తెలంగాణ

telangana

By

Published : Nov 5, 2020, 9:01 AM IST

ETV Bharat / jagte-raho

ఫెరారీ కారును దొంగిలించేందుకు సినీ ఫక్కీలో ప్లాన్..

హైదరాబాద్‌ వ్యాపారికి విక్రయించిన విలాసవంతమైన ఫెరారీ కారును దొంగిలించేందుకు వేసిన పథకాన్ని పోలీసులు ఛేదించారు. హైదరాబాద్‌కు తన అనుచరులను పంపించిన దిల్లీ కార్ల డీలర్‌ ప్రిన్స్‌ పాఠక్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కోర్టు అనుమతితో అతడిని విచారిస్తున్న పోలీసులు ఫెరారీ కారు విక్రయం వెనుక జరిగిన వ్యవహారాన్ని తెలుసుకుంటున్నారు.

ఫెరారీ కారును దొంగిలించేందుకు సినీ ఫక్కీలో పథకం
ఫెరారీ కారును దొంగిలించేందుకు సినీ ఫక్కీలో పథకం

దిల్లీకి చెందిన ప్రిన్స్‌పాఠక్‌ అంతకుముందే వినియోగించిన హైఎండ్‌, స్పోర్ట్స్‌ కార్లను విక్రయిస్తున్నాడు. మహేంద్రహిల్స్‌లో ఉంటున్న వ్యాపారి దివేష్‌ గాంధీకి.. తనవద్ద ఉన్న ఫెరారీ కారును హైదరాబాద్‌లో ఉంటున్న మరో డీలర్‌ నీరజ్‌ శర్మ సాయంతో గతేడాది మే నెలలో రూ. 2 కోట్లకు విక్రయించాడు. వ్యాపార పని నిమిత్తం అమెరికాకు వెళ్లిన దివేశ్​ లాక్‌డౌన్‌ కారణంగా అక్కడే ఉండిపోయాడు. ఆయన లేడని తెలుసుకున్న ప్రిన్స్‌ ఆ కారును దొంగలించేందుకు పథకం వేశాడు. ఈ ఏడాది జులై 23న తన అనుచరులు భూపిందర్‌, సద్దామ్‌లను దిల్లీ నుంచి హైదరాబాద్‌కు పంపాడు. దివేశ్​ స్నేహితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అదేరోజు ముగ్గురిని కార్ఖానా పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇది తెలుసుకున్న ప్రిన్స్‌ అజ్ఞాతంలోకి వెళ్లాడు. పోలీసులు అతడి కదలికలపై నిఘా ఉంచి దిల్లీకి వెళ్లి నాలుగురోజుల కిందట పట్టుకున్నారు.

ఖాళీ కాగితాలపై సంతకాలు.. యజమానిగా తన పేరు

ప్రిన్స్‌పాఠక్‌ నుంచి కారు కొన్న దివేశ్​ తన పేరిట ఫెరారీ కారును రిజిస్ట్రేషన్‌ చేయించాల్సిందిగా కోరాడు. ఇందుకు ఖాళీ పత్రాలపై సంతకాలు చేసి పంపించాడు. దీన్ని అవకాశంగా మలుచుకున్న పాఠక్‌.. దివేశ్​ ఆ కారును తనకు విక్రయించినట్టుగా మార్చుకున్నాడు. ఈ ఏడాది మే నెలలో సయ్యద్‌ బిలాల్‌ అనే వ్యాపారి తనకు ఫెరారీ కారు కావాలని పాఠక్‌ వద్దకు వచ్చాడు. బిలాల్‌ వద్ద ఉన్న ఆడీ క్యూ5 స్పోర్ట్స్‌ కారును పాఠక్‌ తీసుకోవడంతో పాటు అదనంగా రూ. 25లక్షలు పుచ్చుకొన్నాడు. నెల రోజులైనా ఫెరారీ కారు ఇవ్వకపోవటం వల్ల సయ్యద్‌ బిలాల్‌ పాఠక్‌పై ఒత్తిడి తీసుకువచ్చాడు. కారు హైదరాబాద్‌లో ఉందని, ఇక్కడి తీసుకువద్దామంటూ బిలాల్‌కు నచ్చజెప్పాడు.

హైదరాబాద్‌ దాటితే కారు మనదే..

దివేశ్​ గాంధీ వద్ద ఉన్న కారును హైదరాబాద్‌ దాటిస్తే.. కారు తమదేనంటూ పాఠక్‌ బిలాల్‌కు చెప్పగా... అతడూ సరేనన్నాడు. దిల్లీ నుంచి భూపిందర్‌, సద్దాంలను పాఠక్‌ పంపించాడు. వీరిద్దరూ స్థానిక డీలర్‌ నీరజ్‌ శర్మను తీసుకుని దివేశ్​ గాంధీ ఇంటికి వెళ్లారు. నెలలుగా కారు నడపకపోవడం వల్ల సమస్యలు తలెత్తాయని, మెకానిక్‌లు సరిచేస్తారు.. తాళాలు ఇవ్వాలంటూ దివేశ్​ కుటుంబ సభ్యులను నీరజ్​శర్మ కోరాడు. తాళాలు ఇవ్వగా... మహేంద్రహిల్స్‌లో కారున్న ప్రాంతానికి వచ్చారు. కొద్దిసేపటికి దివేశ్​ స్నేహితుడు అతడి ఇంటికి వచ్చి కారు శుభ్రం చేస్తా.. తాళాలు ఇవ్వండని అడగ్గా ఇప్పుడే తాళాలు తీసుకెళ్లారని కుటుంబ సభ్యులు తెలిపారు. కారును దొంగిలించుకువెళుతున్నారన్న అనుమానంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వెంటనే అప్రమత్తమైన అధికారులు అదేరోజు రాత్రి కారును స్వాధీనం చేసుకుని నిందితులు నీరజ్‌, భూపిందర్‌, సద్దామ్‌లను అరెస్టు చేశారు.

ఇదీ చూడండి: ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన లారీ... విద్యార్థి దుర్మరణం

ABOUT THE AUTHOR

...view details