తెలంగాణ

telangana

ETV Bharat / international

అరబ్‌ ఆశల్ని మోసుకెళ్లిన 'హోప్' - అంగారక గ్రహం మీద వాతావరణ పరిస్థితుల అధ్యయనం

యునైటెడ్​ అరబ్​ ఎమిరేట్స్​ అంతరిక్ష రంగంలో ముందడుగు వేసింది. మొట్టమొదటి సారిగా అంగారకుడిపై పరిశోధనలు చేసేందుకు ఓ అంతరిక్ష నౌకను గగనతలంలోకి పంపించింది. జపాన్‌లోని తనెగాషిమా స్పేస్‌ సెంటర్‌ నుంచి హెచ్‌-11ఏ వాహక నౌక ఎమిరేట్స్‌ మార్స్‌ మిషన్‌(ఎమిరేట్స్‌ మార్స్‌ మిషన్‌)కు చెందిన హోప్‌ అంతరిక్ష నౌకను మోసుకెళుతూ నింగిలోకి దూసుకెళ్లింది.

United Arab Emirates spacecraft blasts off from Japan
అరబ్‌ ఆశల్ని మోసుకెళ్లిన 'హోప్'

By

Published : Jul 20, 2020, 11:57 AM IST

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ మొట్టమొదటి అంగారక యాత్ర సోమవారం విజయవంతంగా ప్రారంభమైంది. జపాన్‌లోని తనెగాషిమా స్పేస్‌ సెంటర్‌ నుంచి హెచ్‌-11ఏ వాహక నౌక ఎమిరేట్స్‌ మార్స్‌ మిషన్‌(ఎమిరేట్స్‌ మార్స్‌ మిషన్‌)కు చెందిన హోప్‌ అంతరిక్ష నౌకను మోసుకెళుతూ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ యాత్ర 200 రోజుల పాటు సాగనున్నట్లు యూఏఈ స్పేస్‌ ఏజెన్సీ వెల్లడించింది.

అరబ్‌ ఆశల్ని మోసుకెళ్లిన 'హోప్'

సుదీర్ఘంగా అధ్యయనం...

అంగారక గ్రహం మీద వాతావరణ పరిస్థితుల అధ్యయనమే లక్ష్యంగా ఈ మిషన్‌ను చేపట్టారు. దాదాపు 687 రోజుల పాటు అంగారక గ్రహంపై దీని అధ్యయనం సాగనుంది. రోజువారీ వాతావరణంతో పాటు వివిధ రుతువుల్లో అక్కడి పరిస్థితులు ఎలా మార్పు చెందుతున్నాయన్న విషయంపై దీని పరిశోధన సాగనుంది. ముఖ్యంగా ఉపరితంలో గూడు కట్టుకుని ఉన్న ధూళి కణాల లక్షణాలను ఇది పరిశీలించనుంది. ఈ కణాలే అక్కడి వాతావరణ, ఉష్ణోగ్రతలను ప్రభావితం చేస్తున్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వీటిని అధ్యయనం చేయడం ద్వారా అక్కడి వాతావరణ మార్పుల గుట్టు తెలిసే అవకాశం ఉంది. అలాగే వివిధ ప్రాంతాల్లో వాతావరణ మార్పులు ఎలా ఉన్నాయన్న దానిపై కూడా ఈ మిషన్‌ సమాచారం అందించనుంది. వాస్తవానికి ఈ ప్రయోగం బుధవారమే జరగాల్సి ఉండగా.. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఆలస్యమైంది.

అమెరికా సాయంతో...

అమెరికా అంతరిక్ష నిపుణుల వద్ద శిక్షణ పొందిన యూఏఈ ఇంజినీర్లు కేవలం ఆరు సంవత్సరాల వ్యవధిలోనే ఈ హోప్‌ మిషన్‌ను పూర్తిచేశారు. ఈ ప్రాజెక్టులో అధికభాగం కొలరాడో యూనివర్సిటీలోని 'ది ల్యాబరేటరీ ఫర్ అట్మాస్ఫియరిక్ అండ్ స్పేస్ ఫిజిక్స్'(ఎల్ఏఎస్పీ)లో పూర్తి చేసినప్పటికీ.. దుబాయ్‌లోని 'మొహమ్మద్ బిన్ రషీద్ స్పేస్ సెంటర్'(ఎంబీఆర్ఎస్సీ)లో ముఖ్యమైన భాగం తయారైందని శాస్త్రవేత్తలు తెలిపారు. నాసా 'అడ్వైజరీ కమిటీ మార్స్ ఎక్స్‌ప్లొరేషన్ ప్రోగ్రాం అనాలిసిస్ గ్రూప్'(ఎంఈపీఏజీ) వీరికి తోడ్పాటునందించింది. హోప్‌ ప్రయోగం అరబ్ దేశాల్లో యువతకు స్ఫూర్తినిస్తుందని, విద్యార్థులను శాస్త్రీయ పరిశోధనవైపు ఆకర్షించడానికి ప్రేరణ కలిగిస్తుందని ఆశిస్తున్నారు.

ఇదీ చూడండి:'కుంకుమ పువ్వు'తో అందరికీ ఆరోగ్యమే!

ABOUT THE AUTHOR

...view details