ఇజ్రాయెల్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు హోరెత్తాయి. ప్రధాని నెతన్యాహు అధికార నివాసాన్ని చుట్టుముట్టిన వేలాది మంది నిరసనకారులు.. ఆయన రాజీనామాకు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆందోళనకారుల్లో కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో శుక్రువారం నుంచి దేశవ్యాప్తంగా కఠినమైన లాక్డౌన్ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. అనేక వ్యాపార కార్యకలాపాలు నిలిచిపోయాయి. ప్రజలు ఇళ్లకే పరిమితమవ్వాలని అదేశాలిచ్చింది అక్కడి ప్రభుత్వం. అయినప్పటికీ ఈ నిరసనల్లో వేలాది మంది పాల్గొనడం అధికారులను కలవరపెట్టింది.
అవినీతి ఆరోపణల్లో విచారణ ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రధాని పదవి నుంచి నెతన్యాహు వైదొలగాలని ఆందోళనకారులు గత కొన్ని నెలలుగా డిమాండ్ చేస్తున్నారు. కరోన సంక్షోభంలో ప్రధాని నాయకత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తున్నారు. నిరసనకారుల్లో చాలా మంది యువత, విద్యావంతులే ఉండటం గమనార్హం. వీరిలో చాలా మంది కరోనా లాక్డౌన్లో ఉద్యోగాలు కోల్పోయారు.
అయితే నిరసనలను అణచివేసేందుకు గత కొంత కాలం నుంచి నెతన్యాహు ప్రయత్నిస్తున్నారు. ప్రజా ఆరోగ్యానికి ఈ నిరసనలు హాని కలిగిస్తాయని, వీటిని నిషేధించాలని ఓ బిల్లును ఆ దేశ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు నెతన్యాహు. కానీ దానికి అమోదం లభించడం లేదు. కరోనా సంక్షోభాన్ని అడ్డం పెట్టుకుని.. నిరసనలకు చెక్ పెట్టేందుకు నెతన్యాహు ప్రయత్నిస్తున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి.
ఇదీ చూడండి:-ఇజ్రాయెల్పై బహిష్కరణ ఎత్తివేసిన యూఏఈ