తెలంగాణ

telangana

రష్యా దండెత్తిన తర్వాత తొలి విదేశీ పర్యటన.. అమెరికాకు జెలెన్​స్కీ.. వాటిపై చర్చ!

By

Published : Dec 21, 2022, 6:18 PM IST

రష్యా దండెత్తిన తర్వాత తొలిసారి ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అగ్రరాజ్యం అమెరికాకు బయల్దేరారు. ఈ పర్యటనలో ఆయన అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌తో వాషింగ్టన్‌లో భేటీ కానున్నారు. ఈ భేటీలో అమెరికా నుంచి వచ్చే ఆర్థిక, ఆయుధల సాయంపై ప్రధానంగా చర్చలు జరగనున్నట్లు సమాచారం.

Zelensky was the first Ukrainian president to visit America after the Russian invasion
ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అమెరికా బయల్దేరారు. రష్యా దాడులు మొదలుపెట్టిన తర్వాత ఆయన తొలిసారి విదేశీ పర్యటనకు వెళ్లారు. తన పర్యటనలో భాగంగా ఆయన అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌తో వాషింగ్టన్‌లో భేటీ కానున్నారు. అమెరికా కాంగ్రెస్‌ను ఉద్దేశించి ప్రసంగించడంతోపాటు.. అక్కడి కీలక సభ్యులతో సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ విషయాలను స్వయంగా ఆయనే వెల్లడించారు. ఇటీవలే శ్వేతసౌధం దాదాపు 2 బిలియన్‌ డాలర్ల విలువైన ప్యాకేజీని ధ్రువీకరించింది.

అమెరికా ప్రకటించిన ప్యాకేజీలో పేట్రియాట్‌ గగనతల రక్షణ వ్యవస్థలు కూడా ఉన్నాయి. రష్యా దాడుల నుంచి ఉక్రెయిన్‌ మౌలిక వసతులను కాపాడుకొనేందుకు దీనిని వినియోగించనున్నారు. దీనిపై శ్వేతసౌధం స్పందిస్తూ.. ఉక్రెయిన్‌ దళాలకు వేరే దేశంలో పేట్రియాట్‌ క్షిపణుల వినియోగంపై శిక్షణ ఇస్తామని పేర్కొంది. 2023 నాటికి దాదాపు 40 బిలియన్‌ డాలర్లకు పైగా ఉక్రెయిన్‌కు అందించే బిల్లును అమెరికా సిద్ధం చేస్తోంది. యుద్ధం మొదలైన నాటి నుంచి మరేదేశం అందించని స్థాయిలో ఉక్రెయిన్‌కు అమెరికా సాయం చేసింది. జూన్‌ నుంచి నవంబర్‌ వరకు ఒక్క అమెరికానే 18.51 బిలియన్‌ డాలర్లు అందించింది.

ఈ సారి పేట్రియాట్‌ క్షిపణులతోపాటు ప్రస్తుతం ఉన్న డంబ్‌ బాంబ్‌లను స్మార్ట్‌ బాంబులుగా మార్చే కిట్‌లను కూడా ఉక్రెయిన్‌కు అందించనున్నట్లు అమెరికా అధికారులు పేర్కొన్నారు. ఇటువంటివి ఎన్ని ఉక్రెయిన్‌కు పంపించనున్నారో మాత్రం వెల్లడించలేదు. వీటి ఆధారంగా రష్యా సైనిక స్థావరాలపై కచ్చితత్వంతో ఉక్రయిన్‌ దాడులు చేసే అవకాశాలు మరింత పెరుగుతాయి. కానీ, వీటిని వినియోగించాలంటే ఫైటర్‌ జెట్‌ విమానాలు అవసరం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉక్రెయిన్‌ ఉన్న సోవియట్‌ కాలం నాటి మిగ్‌ విమానాలను వాడుకొనే అవకాశం ఉంది.

ముమ్మరంగా పోరు సాగుతున్న బఖ్‌ముత్‌ నగరంలో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ నిన్న ఆకస్మికంగా పర్యటించారు. సైనిక బలగాల్లో స్థైర్యాన్ని నింపేరీతిలో వారితో ముచ్చటించారు. డాన్‌బాస్‌ ప్రాంతం మొత్తాన్ని గుప్పిట బంధించాలన్న రష్యా ప్రయత్నాలు వమ్ముచేస్తూ బఖ్‌ముత్‌ను మాత్రం ఉక్రెయిన్‌ నిలబెట్టుకుంటూ వస్తోంది. తమ భూభాగాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చాటేందుకు ఈ నగరం ఒక ఉదాహరణ అని టెలిగ్రామ్‌ ఛానల్‌లో జెలెన్‌స్కీ పేర్కొన్నారు. కీవ్‌లో 10 నెలల విరామం తర్వాత రెండు ప్రధాన సబ్‌వే స్టేషన్లను పునఃప్రారంభించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details