తెలంగాణ

telangana

హౌతీ రెబల్స్​ స్థావరాలపై అమెరికా బాంబుల వర్షం- ఐదుగురు మృతి

By PTI

Published : Jan 12, 2024, 9:58 AM IST

Updated : Jan 12, 2024, 2:26 PM IST

US Attack on Houthi Rebels : హౌతీలపై అమెరికా, బ్రిటన్‌ సైన్యాలు ప్రతీకార దాడులు చేశాయి. యెమెన్‌లోని స్థావరాలపై బాంబుల వర్షం కురిపించాయి. మరిన్ని చర్యలకూ వెనుకాడబోమని హెచ్చరించాయి. దాడుల్లో ఐదుగురు చనిపోయినట్లు హౌతీ అధికారులు ప్రకటించారు.

US Attack on Houthi Rebels
US Attack on Houthi Rebels

US Attack on Houthi Rebels :ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలే లక్ష్యంగా వరుస దాడులకు పాల్పడుతున్న హౌతీ రెబల్స్‌పై అమెరికా, బ్రిటన్‌ సైన్యాలు గురువారం భారీ దాడులు చేశాయి. ఈ దాడిలో యెమెన్​ హౌతీ రెబెల్స్​కు చెందిన ఐదుగురు మరణించగా, మరో ఆరుగురు గాయపడ్డారు. యెమెన్‌లో హౌతీల అధీనంలో ఉన్న డజనుకుపైగా స్థావరాలపై ఇరు దేశాలు బాంబుల వర్షం కురిపించాయి. యుద్ధనౌక నుంచి టొమాహాక్‌ క్షిపణులతో పాటు యుద్ధ విమానాలతో విరుచుకుపడ్డాయి. గగనతల రక్షణ వ్యవస్థలు, ఆయుధ భాండాగారాలు, లాజిస్టిక్‌ కేంద్రాలు, రాడార్‌ వ్యవస్థలే లక్ష్యంగా దాడులు చేశామని అమెరికా అధికారులు చెప్పారు.

గాజాపై ఇజ్రాయెల్‌ యుద్ధానికి నిరసనగా హౌతీలు ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకొని గత కొన్ని నెలలుగా వరుస దాడులకు పాల్పడుతున్నారు. దీన్ని ఆపాలని వారం క్రితం అమెరికా సహా పలు దేశాలు హౌతీలను తీవ్ర స్థాయిలో హెచ్చరించాయి. లేకపోతే తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తేల్చి చెప్పాయి. అయినా హౌతీలు సంయమనం పాటించకుండా దాడులను కొనసాగించారు. దీంతో ఆగ్రహించిన అమెరికా తాజాగా ప్రతీకార దాడులను చేపట్టింది. ఈ దాడుల్లో బ్రిటన్‌ సైన్యం నేరుగా పాల్గొనగా, ఆస్ట్రేలియా, బహ్రెయిన్‌, కెనడా, నెదర్లాండ్స్‌ తమకు మద్దతిస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ వెల్లడించారు.

"ప్రపంచంలోని అత్యంత కీలకమైన జలమార్గాల్లో రవాణా స్వేచ్ఛపై హౌతీ తిరుగుబాటుదారులు దాడికి పాల్పడ్డారు. అందుకోసం వారు ఉపయోగించిన యెమెన్‌లోని అనేక స్థావరాలపై విజయవంతంగా దాడి చేశాం. మా ప్రజలు, అంతర్జాతీయ వాణిజ్య స్వేచ్ఛా రవాణాను రక్షించడానికి మరిన్ని చర్యలు తీసుకోవడానికీ వెనుకాడబోం."
--జో బైడెన్‌, అమెరికా అధ్యక్షుడు

నౌక దాడులపై అమెరికా, భారత విదేశాంగ మంత్రుల చర్చ
గత ఏడాది నవంబర్‌ 19 నుంచి ఇప్పటి వరకు ఎర్రసముద్రంలో 27 దాడులకు పాల్పడిన హౌతీలు, తాజా అమెరికా సైన్యం ప్రతీకార చర్యలపై స్పందించారు. యెమెన్‌లోని తమ స్థావరాలపై దాడికి తీవ్ర సైనిక ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించారు. మరోవైపు ఎర్ర సముద్రంలో నౌకలపై హౌతీల దాడులపై అమెరికా, భారత విదేశాంగ మంత్రులు ఆంటోని బ్లింకెన్​, జైశంకర్​ చర్చించారు. ఎర్ర సముద్రంలో స్వేచ్ఛాయుత రవాణాకు కాపాడడంలో భారత సహకారాన్ని అమెరికా స్వాగతించింది. దీంతో పాటు ఇజ్రాయెల్​-హమాస్​ వివాదం తీవ్రం కాకుండా నిరోధించే ప్రయత్నాలు, గాజాలో పౌరలకు మానవతా సాయంపైనా చర్చించారు.

భారత్​కు వస్తున్న ఇజ్రాయెల్​ నౌక హైజాక్​- హౌతీ రెబల్స్​ పనే- గాజాపై దాడులు ఆపాలని హెచ్చరిక

ఎర్ర సముద్రంలో నౌక హైజాక్‌ వీడియో రిలీజ్- నేరుగా హౌతీలతో మాట్లాడుతున్న జపాన్

Last Updated : Jan 12, 2024, 2:26 PM IST

ABOUT THE AUTHOR

...view details