తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : Sep 29, 2023, 1:56 PM IST

Updated : Sep 29, 2023, 3:54 PM IST

ETV Bharat / international

Suicide Blast In Pakistan : పండుగ నాడు పాక్​లో ఆత్మాహుతి దాడి.. 55 మంది మృతి

Suicide Blast In Pakistan : పాకిస్థాన్​లో జరిగిన ఆత్మాహుతి దాడిలో 55 మంది మరణించారు. అనేక మంది గాయపడ్డారు. బలూచిస్థాన్​లోని ఓ మసీదు దగ్గర శుక్రవారం ఈ దాడి జరిగింది.

Suicide Blast In Pakistan
పాకిస్థాన్​లో ఆత్మాహుతి దాడి

Suicide Blast In Pakistan :పాకిస్థాన్​లో పండుగ వేళ జరిగిన ఆత్మాహుతి దాడికి 55 మంది బలయ్యారు. మరో 50 మందికి పైగా గాయపడ్డారు. బలూచిస్థాన్​ రాష్ట్రం మస్తుంగ్ జిల్లాలోని మదీనా మసీదు వద్ద శుక్రవారం ఈ పేలుడు జరిగింది. ఈ దాడిలో అక్కడే విధులు నిర్వర్తిస్తున్న డీఎస్​పీ నవాజ్​ గాష్కోరి మృతి చెందారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మహ్మద్ ప్రవక్త జయంతి (ఈద్ మిలాదున్ నబీ) సందర్భంగా ర్యాలీ నిర్వహించేందుకు స్థానికులంతా జిల్లాలోని మదీనా మసీదు దగ్గర గుమిగూడారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి డీఎస్​పీ కారు దగ్గరగా వెళ్లి తనను తాను పేల్చుకున్నాడు. శక్తిమంతమైన బాంబు పేలుడు ధాటికి 55 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్నామని సిటీ పోలీస్​ స్టేషన్ ఎస్​హెచ్​ఓ మహ్మద్ జావెద్ లెహ్రీ తెలిపారు. గాయపడిన వారిలో కొంత మంది పరిస్థితి విషమంగా ఉందని జిల్లా వైద్యాధికారి రషీద్​ మహ్మద్​ సయీద్​ చెప్పారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

క్షతగాత్రులకు ఆస్పత్రిలో చికిత్స

ఈ ఘటనపై బలూచిస్థాన్ తాత్కాలిక సమాచార మంత్రి జాన్​ అచక్​జాయ్​ స్పందించారు. సహాయక బృందాలను ఘటనా స్థలానికి పంపించినట్లు తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారిని కెట్టాకు తరలించామని చెప్పారు. అన్ని ఆస్పత్రుల్లో ఎమర్జెన్సీని విధించామని వెల్లడించారు.

'ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రజలు ఏకం కావాలి'
ఈ దారుణానికి ఒడిగట్టిన వారిని అరెస్టు చేయాలని బలూచిస్థాన్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అలీ మర్దాన్ డోమ్​కీ అధికారులను ఆదేశించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రజలందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఇస్లాం శాంతిని కోరుకునే మతమని.. ఇలాంటి విధ్వంసకర ఘటనలకు పాల్పడే వారు ముస్లింలు కాదని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజులు సంతాప దినాలను ప్రకటించారు. ఈ ఘటనను పాకిస్థాన్​ హోం మంత్రి తీవ్రంగా ఖండించారు. క్షతగాత్రులకు సహాయం చేసేందుకు అన్ని వనరులను ఉపయోగించుకుంటున్నట్లు తెలిపారు.

ఈ ఘటనతో కరాచీ పోలీసులు అప్రమత్తమయ్యారు. పండగ వేళ అన్ని ఈద్ మిలాదున్ నబీ ఊరేగింపుల్లో భద్రత కట్టుదిట్టం చేయాలని.. పోలీసులందరూ అప్రమత్తంగా ఉండాలని కరాచీ ఇన్​స్పెక్టర్​ జనరల్​ ఖదీమ్​ హుస్సేన్ ఆదేశించారు. మస్తుంగ్ జిల్లాలో పదిహేను రోజుల్లో ఇది రెండో ఘటన అని అధికారులు తెలిపారు.

పోలీస్​ స్టేషన్​పై అత్మాహుతి దాడి.. 12 మంది మృతి.. పాకిస్థానీ తాలిబన్ల పనే!

Blast : పాక్​లో బాంబు దాడి.. 11 మంది కూలీలు మృతి

Last Updated : Sep 29, 2023, 3:54 PM IST

ABOUT THE AUTHOR

...view details