Russia Ukraine War : ఉక్రెయిన్పై రష్యా సాగిస్తున్న యుద్ధం.. మరో భారీ విధ్వంసానికి దారితీసేలా మలుపు తీసుకుంటోంది. నాలుగు ఉక్రెయిన్ భూభాగాలను రష్యా విలీనం చేసుకునే ప్రక్రియ దాదాపు ముగింపునకు వచ్చింది. ప్రజాభిప్రాయం మేరకు వాటిని తమ దేశంలో కలిపేసుకుంటున్నట్టు అధ్యక్షుడు పుతిన్ నేడో, రేపో ప్రకటన చేయనున్నారు. విలీనం చేసుకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని అమెరికా సారథ్యంలోని నాటో ఘాటుగా హెచ్చరించినా.. ఆయన తగ్గడం లేదు. ఇరుపక్షాల నోటా అణ్వస్త్రాల మాట వినిపిస్తున్న వేళ.. తాజా పరిణామం ఎక్కడకు దారితీస్తుందోనన్న ఆందోళన ప్రపంచానికి వణుకు పుట్టిస్తోంది.
సరిహద్దులో ఉక్రెయిన్కు చెందిన దొనెట్స్క్, లుహాన్స్క్, జపోరిజియా, ఖేర్సన్లను తమ దేశంలో విలీనం చేసుకునేందుకు రష్యా రిఫరెండం పాచిక వేసిన సంగతి తెలిసిందే. ప్రజాభిప్రాయం పేరుతో ఈనెల 23-27 మధ్య అక్కడ ఓటింగ్ నిర్వహించారు. మాస్కోకు అనుకూలంగా ఓటింగ్ జరిగినట్టు చెబుతున్నా.. ఈ ప్రక్రియ అంతా పచ్చి బూటకమని ఉక్రెయిన్, అమెరికా సహా నాటో దేశాలు కొట్టిపారేశాయి. ప్రజలెవరూ స్వేచ్ఛగా ఓటు వేసే పరిస్థితులు లేవని, రెఫరెండాన్ని అంగీకరించే సమస్యే లేదని తేల్చిచెప్పాయి. అయినా పుతిన్ వాటిని పెడచెవిన పెట్టారు.
2014లో క్రిమియాను ఆక్రమించే సమయంలోనూ ఆయన మొదట దాడులకు దిగారు. తర్వాత అక్కడ రెఫరెండం చేపట్టి, విలీనం చేసుకున్నారు. అమెరికా, నాటోలు నాడు హెచ్చరికలకే పరిమితం అయ్యాయి తప్ప, ఏమీ చేయలేకపోయాయి. ఇప్పుడు మాత్రం ఆ దేశాలు తమను ఏం చేయగలవన్నది పుతిన్ ధీమాగా విశ్లేషకులు చెబుతున్నారు.
ఉక్రెయిన్ నష్టపోయేదేంటి?
జెలెన్స్కీ సేనలు నెలల తరబడి రష్యా బలగాలను దీటుగా ఎదుర్కోవడం విశేషమే. యుద్ధ మేఘాలు కమ్ముకున్న క్రమంలో లక్షల మంది దేశాన్ని వీడగా, ఎంతోమంది ఉక్రెయిన్ ప్రజలు యుద్ధగాయాలకు బలయ్యారు. గాయాలతో శాశ్వత వైకల్యానికి గురైనవారెందరో. చెల్లాచెదురైన కుటుంబాలెన్నో! భారీ ప్రాణ, ఆస్తి నష్టం అటుంచితే.. దొనెట్స్క్, లుహాన్స్క్, జపోరిజియా, ఖేర్సన్లు రష్యాలో విలీనం కావడం ఉక్రెయిన్కు మరో భారీ దెబ్బ అవుతుంది.