ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా సీనియర్ దౌత్యవేత్త రుచిరా కాంబోజ్ను నియమించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. త్వరలోనే ఆమె బాధ్యతలను చేపట్టనున్నట్లు పేర్కొంది. 1987 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS) అధికారి అయిన రుచితా ప్రస్తుతం భూటాన్లో భారత రాయబారిగా పనిచేస్తున్నారు. భూటాన్కు భారత మొదటి మహిళా రాయబారిగా రుచిరా నిలిచారు. ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధిగా పనిచేసిన టి.ఎస్.తిరుమూర్తి స్థానాన్ని కాంబోజ్ భర్తీ చేయనున్నారు.
రుచితా కాంబోజ్ 1987 సివిల్ సర్వీసెస్ బ్యాచ్లో ఆల్ ఇండియా మహిళా టాపర్. అంతేకాదు, 1987 ఫారిన్ సర్వీస్ బ్యాచ్లో టాపర్ కూడా. 2002-2005 వరకు న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితికి భారత శాశ్వత మిషన్లో కౌన్సెలర్గా ఆమె నియామకం పొందారు. అక్కడ ఐరాస శాంతి పరిరక్షణ, యూఎన్ భద్రతా మండలి సంస్కరణ, మధ్యప్రాచ్య సంక్షోభం తదితర అంశాలపై పనిచేశారు. అనంతరం పలు పదవుల్లో సేవలందించిన ఆమె.. ఇకపై ఐక్యరాజ్య సమితిలో భారత్ గళాన్ని వినిపించనున్నారు.