PM MODI IN GERMANY: నాలుగో పారిశ్రామిక విప్లవంలో భారత్ వెనుకబడబోదని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇప్పుడు ప్రపంచాన్ని నడిపిస్తోందని పేర్కొన్నారు. జర్మనీలోని మ్యూనిచ్లో భారత సంతతి ప్రజలతో నిర్వహించిన సభలో మాట్లాడిన ఆయన.. పారిశ్రామిక విప్లవం సమయంలో భారత్ వలసదేశంగా ఉందని గుర్తు చేశారు. అందువల్లే ఆ పారిశ్రామిక విప్లవం ద్వారా తగిన ప్రయోజనం పొందలేకపోయిందని వ్యాఖ్యానించారు.
'ఒకప్పుడు స్టార్టప్ల రేసులో భారత్ ఎక్కడా కనిపించేది కాదు. కానీ ఇప్పుడు స్టార్టప్ రంగంలో మూడో అతిపెద్ద ఎకోసిస్టమ్గా మారాం. చిన్నచిన్న ఫోన్లను సైతం దిగుమతి చేసుకునే దశ నుంచి.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ తయారీదారుడిగా ఎదిగాం. ఇండియాలో వాతావరణ మార్పులు రాజకీయానికి సంబంధించిన విషయమే కాదు. పర్యావరణ అనుకూల సుస్థిర కార్యక్రమాలు ప్రజల జీవనవిధానంలో భాగం. దేశంలో 10 కోట్లకు పైగా టాయిలెట్లను మేం నిర్మించాం. ప్రతి గ్రామం బహిరంగ మలవిసర్జన రహితంగా మారాయి. అన్ని గ్రామాలకు విద్యుత్ సౌకర్యం లభించింది. 99 శాతం గ్రామాలకు స్వచ్ఛమైన ఇంధనం అందుబాటులో ఉంది. 80 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా రేషన్ అందిస్తున్నాం. ఇప్పుడు ప్రజలు దేశాన్ని స్వచ్ఛంగా ఉంచాల్సిన బాధ్యత తమదే అని గ్రహించారు' అని మోదీ చెప్పుకొచ్చారు.