తెలంగాణ

telangana

ETV Bharat / international

బ్రిటన్​ ప్రధాని రిషి సునాక్‌కు మోదీ తొలిసారి ఫోన్‌.. ఆ అంశాలపై కీలక చర్చ! - pm modi phone to sunak

బ్రిటన్‌ నూతన ప్రధానిగా ఎంపికైన భారత సంతతి వ్యక్తి రిషి సునాక్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి ఫోన్‌లో మాట్లాడారు. బ్రిటన్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినందుకు మరోసారి ఆయనకు అభినందనలు తెలిపారు.

modi sunak
modi sunak

By

Published : Oct 27, 2022, 9:40 PM IST

Modi Sunak: బ్రిటన్‌ నూతన ప్రధానిగా ఎంపికైన భారత సంతతి వ్యక్తి రిషి సునాక్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి ఫోన్‌లో మాట్లాడారు. బ్రిటన్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినందుకు మరోసారి ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా భారత్‌, యూకే మధ్య సమతుల్యతో కూడిన సమగ్రమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని(ఎఫ్‌టీఏ) ఓ ముగింపు దశకు తీసుకురావాల్సిన ఆవశ్యకతపై కీలకంగా చర్చించినట్టు మోదీ తెలిపారు. ఈ మేరకు ప్రధాని ట్వీట్‌ చేశారు.

"రిషి సునాక్‌తో మాట్లాడినందుకు సంతోషంగా ఉంది. బ్రిటన్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినందుకు ఆయనకు అభినందనలు తెలిపాను. ఇరు దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు మేం కలిసి పనిచేస్తాం. సమగ్రమైన, సమతుల్యతతో కూడిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని త్వరగా ఓ ముగింపు దశకు తీసుకురావాల్సిన ఆవశ్యకతపై పరస్పరం అంగీకరించుకున్నాం" అని పేర్కొన్నారు. బ్రిటన్‌ ప్రధానిగా రిషి ఏకగ్రీవంగా ఎంపికైన రోజే ప్రధాని నరేంద్ర మోదీ హృదయపూర్వక అభినందనలు తెలిపిన సంగతి తెలిసిందే. ప్రపంచ సమస్యలపై రిషితో సన్నిహితంగా కలిసి పనిచేసేందుకు, రోడ్‌మ్యాప్‌ 2030 అమలు చేసేందుకు ఎదురుచూస్తున్నట్టు పేర్కొన్నారు.

మరోవైపు, మోదీతో ఫోన్‌ సంభాషణపై రిషి సునాక్‌ ఆనందం వ్యక్తంచేశారు. తాను నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఫోన్‌ చేసి అభినందించిన మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. భారత్‌, యూకే చాలా షేర్‌ చేసుకుంటాయని.. రాబోయే కాలంలో ఇరు దేశాల మధ్య భద్రత, రక్షణ, ఆర్థికరంగాల్లో భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవడంపై మరింతగా కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఇదిలా ఉండగా.. బ్రిటన్‌ విదేశాంగ కార్యదర్శి జేమ్స్‌ క్లెవర్లీ శుక్రవారం భారత్‌ పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌తో చర్చలు జరపనున్నారు. దౌత్యపరమైన చర్చలను బలోపేతం చేసుకోవడంపై చర్చించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details