Pakistan Heavy Rains : పాకిస్థాన్లో కురిసిన భారీ వర్షాలకు 25 మంది పౌరులు మరణించారు. మరో 145 మంది గాయాలపాలయ్యారు. వాయవ్య పాకిస్థాన్లో భారీ వర్షాల కారణంగా అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. వరదల కారణంగా చెట్లు, కరెంట్ స్తంభాలు కూలిపోయి విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగిందని సీనియర్ రెస్క్కూ ఆఫీసర్ ఖటీర్ అహ్మద్ తెలిపారు. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లోని బన్ను, లక్కి మర్వాత్, కరక్ జిల్లాలో భారీగా వర్షాలు పడినట్లు ఆయన చెప్పారు. నిర్వాసితులకు అత్యవసర సాయం అందించి సహాయక చర్యలు చేపట్టినట్లు వివరించారు.
ప్రధాని షరీఫ్ విచారం
వరదల్లో చిక్కుకుని 25 మంది మృతి చెందడం పట్ల ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ విచారం వ్యక్తం చేశారు. సహయక చర్యలు త్వరితగతిన చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అరేబియా సముద్రంలో వచ్చిన బిపోర్ జాయ్ తుపాను తీరాన్ని తాకనున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ తుపాను గంటకు 150 కిలోమీటర్ల వేగంతో దక్షిణ పాకిస్థాన్ వైపు దూసుకు వస్తున్నట్లు ఆ దేశ వాతావరణ శాఖ వెల్లడించింది.
గతేడాది 1,700 మంది బలి
Pakistan Floods 2022 : గతేడాది కూడా పాకిస్థాన్ భారీ వర్షాలతో అతలాకుతలమైంది. ఆ దేశ చరిత్రలో ఎన్నడూ లేనంతగా కురిసిన భారీ వర్షాలకు దాదాపు సగం భూభాగం వరదల్లో మునిగిపోయింది. ఈ వరదల బీభత్సానికి 1,700 మందికి పైగా మృతిచెందారు. లక్షలాది మంది నిరాశ్రయులుగా మిగిలిపోయారు.