తెలంగాణ

telangana

IMF​ షరతులకు తలవంచిన పాక్‌.. ప్రజలపై మరింత పన్నుల భారం!

By

Published : Feb 11, 2023, 5:04 PM IST

తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌ రుణాల కోసం నానా తంటాలు పడుతోంది. సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఇందులో భాగంగా ఐఎమ్​ఎఫ్​ షరతులకు తలవంచిన పాక్‌.. ప్రజలపై పన్నుల భారం మోపేందుకు సిద్ధమైంది. పన్నులు పెంపు ద్వారా 17వేల కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోవాలని యోచిస్తోంది. పాక్‌ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఒక్కపూట తిండి కోసం తిప్పలు పడుతున్న ప్రజల పరిస్థితి మరింత దయనీయంగా మారనుంది.

imf-loan-to-pakisthan
పాకిస్థాన్​ ఐఎమ్​ఎఫ్​ రుణం

Pakistan Economy Crisis : తీవ్ర ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న పాకిస్థాన్‌కు మరిన్ని కష్టాలు వచ్చి పడ్డాయి. విదేశీ మారకనిల్వలు అడుగంటిపోవడం వల్ల నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటిన వేళ.. రుణాల కోసం అంతర్జాతీయ సంస్థల వద్ద అర్రులు చాస్తోంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ-ఐఎమ్​ఎఫ్ ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీ కోసం.. కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఐఎమ్​ఎఫ్ షరతులన్నింటికీ అంగీకరిస్తున్న షెహబాజ్ షరీఫ్‌ సర్కార్.. తాజాగా ప్రజలపై పన్నుల భారం మోపాలని నిర్ణయించింది. 17వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించాలని భావిస్తోంది.

1.1 బిలియన్‌ డాలర్ల ఉద్దీపన ప్యాకేజీ కోసం పాకిస్థాన్‌ ప్రభుత్వం, ఐఎమ్​ఎఫ్ మధ్య 10రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. రుణం ఇచ్చేందుకు ఐఎమ్​ఎఫ్ షరతులు విధించినట్లు.. పాక్ ఆర్థిక మంత్రి ఇషాక్‌ దార్‌ తెలిపారు. సోమవారం నుంచి వర్చువల్‌గా చర్చలు కొనసాగనున్నాయని పేర్కొన్నారు. అయితే ఆ చర్చలకు ముందు కొన్ని చర్యలు చేపట్టాల్సి ఉందని పాక్‌ ఆర్థిక మంత్రి ఇషాక్‌ దార్‌ వెల్లడించారు.

ఆ తర్వాత కేబినెట్‌ ఎకనామిక్‌ కో-ఆర్డినేషన్‌ కమిటీతో సమావేశమైన ఇషాక్‌ దార్.. ప్రజలపై కొన్ని పన్నులు విధించేందుకు ఆమోదం తెలిపారు. విద్యుత్‌పై ఒక్కో యూనిట్‌కు రూ. 3.21 పైసలు,స్పెషల్‌ ఫైనాన్సింగ్‌ సర్‌ఛార్జ్ కింద రూ.3.39 పైసల చొప్పున ఏడాదిపాటు విద్యుత్‌ ఛార్జీల షాక్‌ ఇచ్చేందుకు పాక్‌ సర్కార్‌ సిద్ధమైంది. ఇంధన సర్దుబాటు ఛార్జీల కింద ఒక్కో యూనిట్‌కు రూ.4 చొప్పున 3 నెలలు రికవరీ చేయనుంది.

ఐఎమ్​ఎఫ్ షరతుల మేరకు మార్చి 1 నుంచి జీరో రేటింగ్‌ కలిగిన పరిశ్రమలకు రాయితీలు, కిసాన్‌ ప్యాకేజీని ఎత్తివేయాలని నిర్ణయించిన పాక్‌ కేబినెట్‌.. అమ్మకం పన్నును ఒక్క శాతం పెంచనుంది. పాక్‌ సర్కారు తాజా నిర్ణయంతో విద్యుత్‌ ఛార్జీలతోపాటు, నిత్యావసరాల ధరలు మరింత భారం కానున్నాయి. పాక్‌ ప్రజల జీవనం మరింత దుర్భరంగా మారనుంది. అప్పుల కోసం అర్రులు చాస్తున్న పాక్‌.. రక్షణ రంగానికి కేటాయింపుల్లో మాత్రం రాజీపడటం లేదు.

ABOUT THE AUTHOR

...view details