North Korea First Covid case: కరోనా మహమ్మారి ఉద్భవించిన రెండేళ్ల తర్వాత ఉత్తర కొరియాలో తొలి కేసు నమోదైంది. చైనాలో వైరస్ వెలుగు చూసిన వెంటనే సరిహద్దులు మూసివేసి కట్టడి చర్యలు చేపట్టారు ఆ దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్. ఇన్నాళ్లు ఒక్క కేసు కూడా రాలేదని గర్వంగా చెప్పుకున్నారు. తాజాగా తొలి కేసు నమోదైన నేపథ్యంలో కొవిడ్-19 కట్టడి చర్యలను పెంచాలని ఆదేశించారు కిమ్. దేశవ్యాప్తంగా లాక్డౌన్లు విధించాలని స్పష్టం చేశారు.
ప్యాంగ్యాంగ్లో పలువురికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. వారిలో ఒమిక్రాన్ వేరియంట్ నిర్ధరణ అయినట్లు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ గురువారం తెలిపింది. కరోనా కేసులు వెలుగుచూసిన క్రమంలో కిమ్.. అధికార కొరియన్ వర్కర్స్ పార్టీ పొలిట్బ్యూరో సమావేశాన్ని ఏర్పాటు చేశారని పేర్కొంది. వైరస్ కట్టడి చర్యలను పెంచాలని సభ్యులు నిర్ణయించారని తెలిపింది. వైరస్ వ్యాప్తిని అదుపు చేయటం, సంక్రమణ మూలాల్ని వీలైనంత త్వరగా రూపుమాపాలని అధికారులను కిమ్ ఆదేశించారని తెలిపింది.