తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : Oct 8, 2023, 8:36 AM IST

Updated : Oct 8, 2023, 9:18 AM IST

ETV Bharat / international

Israel Vs Palestine : 'బంకర్లలో బిక్కుబిక్కుమంటూ గడిపాం'.. భీకర యుద్ధంలో 500 మంది మృతి!.. హమాస్​కు ఇజ్రాయెల్ ప్రధాని మాస్​ వార్నింగ్

Israel Vs Palestine Updates : హమాస్​ అనూహ్య దాడులకు ఇజ్రాయెల్ దీటుగా బదులిస్తోంది. గాజాపై ఇజ్రాయెల్​ చేసిన దాడిలో 200 మందికి పైగా మృతిచెందారు. మరోవైపు గాజాలో ఉగ్రవాదుల స్థావరాలను శిథిలాలుగా మారుస్తానని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు శపథం చేశారు. అంతకుముందు ఇజ్రాయెల్​పై హమాస్​ చేసిన ఘటనను ప్రపంచ దేశాలు ఖండించాయి.

Israel Gaza conflict Updates
Israel Gaza conflict Updates

Israel Vs Palestine Updates : హమాస్‌ మిలిటెంట్ల మెరుపు దాడితో అవాక్కయిన ఇజ్రాయెల్‌.. తిరిగి తేరుకుని పాలస్తీనాలోని గాజాపై వైమానిక దాడులకు దిగింది. ఈ దాడుల్లో 232 మందికిపైగా మరణించారు. 1,697 మంది గాయపడ్డారు. మరోవైపు ఇజ్రాయెల్​లోకి అక్రమ చొరబాటుకు యత్నించిన ఏడుగురు ఉగ్రవాదులను హతమార్చినట్లు ఇజ్రాయెల్​ డిఫెన్స్ ఫోర్సెస్- ఐడీఎఫ్ తెలిపింది. ఇజ్రాయెల్ దక్షిణ ప్రాంతానికి చెందిన అఫ్​కెయిన్ పట్టణంలో.. హమాస్​ తీవ్రవాదులు బందీలుగా పట్టుకున్న అనేక మందిని విడిపించినట్లు పేర్కొంది. అయితే ఈ ఊహించని దాడిలో.. తమ బేస్​లు, కమ్యూనిటీలు ఇంకా తమ నియంత్రణలోకి రాలేదని లెఫ్టినెంట్ కల్నల్ జొనాథన్ కాన్​రియస్ చెప్పారు.

Hamas Attack On Israel : అంతకుముందు ఉరుములేని పిడుగులా ఇజ్రాయెల్‌పై పాలస్తీనా మిలిటెంట్‌ సంస్థ హమాస్‌ మెరుపు దాడులకు దిగింది. యూదుల సెలవు దినమైన శనివారం తెల్లవారుజామునే వేల రాకెట్లను గాజా నుంచి ప్రయోగించి.. సాయుధులైన డజన్లకొద్దీ మిలిటెంట్లు సరిహద్దులు దాటి ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించారు. భూమి, ఆకాశం, సముద్రం నుంచి ఒక్కసారిగా హమాస్‌ విరుచుకుపడింది. ఇజ్రాయెల్‌ పట్టణాల్లో మిలిటెంట్లు తుపాకులతో స్వైర విహారం చేశారు. డజన్లకొద్దీ ఇజ్రాయెలీలను బందీలుగా చేసుకున్నారు. ఇజ్రాయెల్‌ పట్టణాలు, నగరాల్లో 22 చోట్ల మిలిటెంట్లకు, ఇజ్రాయెల్‌ సైన్యానికి భీకర పోరు సాగుతోంది. రెండు పట్టణాల్లో పలువురిని బందీలుగా చేసుకుని పాగా వేశారు. హమాస్‌ దాడుల్లో 300 మందికి పైగా మరణించారు. 1100 మంది గాయపడ్డారు.

బంకర్​లలో తలదాచుకున్నాం..
ఇజ్రాయెల్​-హమాస్​ మధ్య భీకర వాతావరణం నెలకొన్న నేపథ్యంలో భారత విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని ఇజ్రాయెల్​లోని భారత ఎంబసీ అడ్వైజరీ జారీ చేసింది. అక్కడి ప్రభుత్వ సూచనలు పాటించాలని సూచించింది. మరోవైపు అక్కడి పరిస్థితిపై ఓ భారత విద్యార్థిని స్పందించింది. 'మతపరమైన సెలవులు ఉన్న నేపథ్యంలో ఈ దాడులు అకస్మాత్తుగా జరిగాయి. శనివారం ఉదయం 5.30 గటంల సమయంలో సైరన్లు మోగాయి. అనంతరం ఆ సైరన్లు ఆగిపోయేదాగా దాదాపు 7-8 గంటలు బంకర్లలో ఉన్నాం. దీంతోపాటు ఇళ్లలోనే ఉండమని ఇజ్రాయెల్​ భద్రతా దళాలు చెప్పాయి. ఇక్కడ రవాణ సౌకర్యాలు అన్నింటినీ మూసేశారు. మేము ఇండియన్​ ఎంబసీతో సంప్రదింపులు జరుపుతున్నాము. ఏదైనా విషయం ఉంటే వారు మాకు అప్డేట్​ చేస్తారు' అని ఆ విద్యార్థి చెప్పుకొచ్చింది.

ఇజ్రాయెల్​ ప్రధాని మాస్​ వార్నింగ్
Israel PM Statement :హమాస్​ దాడుల నేపథ్యంలో ఉగ్రదళాలకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమెన్ నెతన్యాహు ఎక్స్​ వేదికగా మాస్​ వార్నింగ్ ఇచ్చారు. 'హమాస్ ఉగ్రవాదులు ఉన్న, దాడులు నిర్వహిస్తున్న బేస్​లు, వారి నగరాన్ని శిథిలాలుగా మారుస్తాం. గాజాలో నివాసితులకు నేను చెప్పేదొక్కటే.. వెంటనే గాజా వదిలి వెళ్లిపోండి. ఎందుకంటే మేము బలవంతంగా పనిచేస్తాము' అని అన్నారు.

#ఇండియా విత్​ ఇజ్రాయెల్​
ఇజ్రాయెల్​లో హమాస్​ దాడుల నేపథ్యంలో సోషల్ మీడియా ప్లాట్​ఫామ్​ ఎక్స్​లో (ఇంతకముందు ట్విట్టర్) ఇండియా విత్​ ఇజ్రాయెల్​ హ్యాష్​ట్యాగ్​ ట్రెండ్​ అవుతోంది. దీనిపై ఇజ్రాయెల్​ విదేశాంగ శాఖ స్పందించింది. తన అధికారికి ఎక్స్​ ఖాతాలో భారత్​కు కృతజ్ఞతలు తెలిపింది. అంతకుముందు భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. హమాస్​ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన ఇజ్రాయెల్​ పౌరుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. ఈ క్లిష్టపరిస్థితుల్లో ఇజ్రాయెల్​తో మేము ఉంటామని చెప్పారు.

ఎమర్జెన్సీ అయితే సంప్రదించండి..
ఎమర్జెన్సీ పరిస్థితుల్లో నేరుగా భారత ప్రతినిధి కార్యాలయాన్ని సంప్రదించాలని పాలస్తీనాలో ఉన్న భారతీయులకు ఆ కార్యాలయం చెప్పింది. 'పాలస్తీనాలో నెలకొన్న భద్రతా పరమైన కారణాల దృష్ట్యా భారతీయ పౌరులకు 24 గంటల ఎమర్జెన్సీ హెల్ప్​లైన్ అందుబాటులో ఉంటుంది. జవ్వాల్ : 0592-916418, వాట్సాప్ : +970-59291641' అని ఎక్స్​లో పోస్ట్​ చేసింది.

ఐరాస భద్రతామండలి సమావేశం..
ఇజ్రాయెల్​-హమాస్​ పరస్పర దాడుల నేపథ్యంలో ఐరాస భద్రతామండలి ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో సమావేశం నిర్వహించనుంది.

ప్రపంచ దేశాల ఖండన..
ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడిని పలు ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి. ప్రధాని నెతన్యాహుతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఫోన్‌లో మాట్లాడారు. 'తీవ్రవాదం ఎప్పటికీ సమర్థనీయం కాదు. తనను, తన పౌరులను రక్షించుకునే హక్కు ఇజ్రాయెల్‌కు ఉంది. ఈ పరిస్థితిని ఎవరైనా అవకాశంగా తీసుకుంటూ ఊరుకునేది లేదు. ఇజ్రాయెల్‌ భద్రతకు మేం గట్టిగా మద్దతుగా నిలుస్తాం' అని జోబైడెన్‌ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.

ఉగ్రదాడులు దిగ్భ్రాంతికరం
ఇజ్రాయెల్‌ నుంచి ఎలాంటి కవ్వింపు లేకుండానే హమాస్‌ మిలిటెంట్లు దాడికి దిగారని అమెరికా జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి ఆడ్రియన్‌ వాట్సన్‌ వ్యాఖ్యానించారు. 'ఇజ్రాయెల్‌ పౌరులపై హమాస్‌ ఉగ్రవాదుల దాడులు తీవ్ర దిగ్భ్రాంతికరం. ఇజ్రాయెల్‌లోని యూకే పౌరులు ప్రయాణ సూచనలను పాటించాలి' అని బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ పేర్కొన్నారు.

హమాస్‌ దాడిని యూరోపియన్‌ యూనియన్‌ ఖండించింది. హమాస్‌ ఉగ్రవాదుల అమానుష హింస దిగ్భ్రాంతికరమని స్పెయిన్‌ విదేశాంగ మంత్రి జోస్‌ మాన్యూల్‌ అల్బరెస్‌ వ్యాఖ్యానించారు. దుందుడుకు చర్యలకు ఇజ్రాయెల్‌, పాలస్తీనాలు దూరంగా ఉండాలని తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్‌ సూచించారు. ఇజ్రాయెల్​పై జరిగిన ఈ ఉగ్రదాడిని ఖండిస్తున్నట్లు నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్​ ప్రచండ ఎక్స్​లో ట్వీట్​ చేశారు. 'ఈ దాడుల్లో 9 మంది నేపాలీలు, ఇతరులు గాయపడినట్లు తెలిసింది. వారికి, వారి కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను' అని చెప్పారు. మరోవైపు, హమాస్‌ దాడిని ఇరాన్‌ సమర్థించింది. పాలస్తీనా ఫైటర్లకు సుప్రీం పాలకుడు అయతుల్లా అలీ ఖమేనీ శుభాకాంక్షలు తెలిపారని ఆయన సలహాదారుడు ప్రకటించారు.

Israel Palestine Conflict : ఇజ్రాయెల్​-పాలస్తీనా గొడవకు కారణం ఇదే!.. 'హమాస్​' ఎలా ఏర్పడిందంటే?

Israel Palestine War : రాకెట్ల దాడిలో మేయర్ సహా 40 మంది మృతి.. ప్రత్యర్థులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందేన్న ఇజ్రాయెల్ ప్రధాని

Last Updated : Oct 8, 2023, 9:18 AM IST

ABOUT THE AUTHOR

...view details