తెలంగాణ

telangana

7వేల మంది హమాస్​ మిలిటెంట్లు హతం- గాజాలో 90 శాతం మందికి ఆహారం కరవు!

By ETV Bharat Telugu Team

Published : Dec 10, 2023, 7:44 PM IST

Israel South Gaza Bombing : హమాస్‌ను పూర్తిగా రూపుమాపడమే లక్ష్యంగా దక్షిణ గాజాపై ఇజ్రాయెల్‌ దాడులు ఉద్ధృతం చేసింది. గాజాలో రెండో అతిపెద్ద నగరం ఖాన్‌ యూనిస్‌ మధ్యలోకి ఇజ్రాయెల్‌ యుద్ధ ట్యాంకులు చేరుకున్నాయి. మానవతా సాయం అందక గాజా జనాభాలో 90 శాతం మంది ప్రతిరోజు తిండి తినలేకపోతున్నారు. ఇప్పటివరకు 7 వేల మందికిపైగా హమాస్‌ మిలిటెంట్లను హతమార్చినట్లు ఇజ్రాయెల్‌ ప్రకటించింది.

Israel South Gaza Bombing
Israel South Gaza Bombing

Israel South Gaza Bombing : కాల్పుల విరమణ పాటించాలని ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అమెరికా అడ్డుకున్న తర్వాత గాజాపై దాడులను ఇజ్రాయెల్‌ దళాలు తీవ్రతరం చేశాయి. దక్షిణ గాజాలోని ఖాన్‌ యూనిస్‌ నగరం నుంచి ఈజిప్టు సరిహద్దుల్లోని రఫా నగరానికి వెళ్లే రహదారులను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్‌ బాంబు దాడులు చేసినట్లు హమాస్‌ మిలిటెంట్‌ సంస్థ తెలిపింది.

'లక్షలాది మంది పాలస్తీనా వాసులు ఎలా ఉంటారు?'
Israel Bombs Southern Gaza : ఖాన్‌ యూనిస్‌ నగరం బాంబులు, కాల్పుల మోతతో దద్దరిల్లుతోంది. ఈ నగరంలోనూ సిటీ సెంటర్‌ను ఖాళీ చేయాలని అక్కడి పౌరులను ఇజ్రాయెల్‌ హెచ్చరించింది. ఇజ్రాయెల్‌ సేఫ్‌జోన్‌గా ప్రకటించిన ప్రాంతం లండన్‌ విమానాశ్రయం కంటే తక్కువ విస్తీర్ణం కలిగి ఉండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆ చిన్న ప్రదేశంలో లక్షలాది మంది పాలస్తీనా వాసులు ఎలా ఉంటారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

హమాస్‌ నెట్‌వర్క్‌ను అంతం చేయడమే లక్ష్యం!
Israel Strikes South Gaza : గాజా జనాభా 23 లక్షల మందిలో 85 శాతం నిరాశ్రయులుకాగా కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్‌పై అంతర్జాతీయ సమాజం ఒత్తిడి పెంచుతోంది. అదే సమయంలో ఇజ్రాయెల్‌కు అమెరికా నుంచి పూర్తిస్థాయిలో మద్దతు లభిస్తోంది. హమాస్‌ మిలిటెంట్‌ సంస్థను రూపుమాపే లక్ష్యాన్ని చేరుకునే వరకు ఇజ్రాయెల్‌కు అండగా నిలుస్తామని అమెరికా ఇప్పటికే ప్రకటించింది. హమాస్‌ నెట్‌వర్క్‌ను అంతం చేయడమే తమ అంతిమ లక్ష్యమని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు పునరుద్ఘాటించారు.

మానవతా సాయం అందక
Israel Southern Gaza :ఈజిప్టు నుంచి మానవతా సాయం అందే రహదారులపై ఇజ్రాయెల్‌ దాడులు చేస్తుండటం వల్ల గాజాలో తీవ్రమైన ఆహారం, నీరు, నిత్యావసరాల కొరత నెలకొంది. 90 శాతం మంది గాజా పౌరులకు ప్రతీరోజూ తిండి దొరకడం లేదు. మానవతా సాయం అందక ఎంతో మంది సామాన్య పౌరులు ఆకలి, వ్యాధులతో చనిపోయే ప్రమాదం ఉందని అంతర్జాతీయ సహాయక బృందాలు ఆందోళన వ్యక్తం చేశాయి.

Israel Hamas War Death Toll :దక్షిణ గాజాలో ఇజ్రాయెల్‌ దాడులు తీవ్రతరం కావడం వల్ల ఆశ్రయం కోసం వేలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గాజాలో పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. ఇజ్రాయెల్‌ దాడుల్లో ఇప్పటి వరకు 17 వేల 700 మంది పాలస్తీనా వాసులు మృతి చెందారని హమాస్‌ ఆధ్వర్యంలోని ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీరిలో 40 శాతం మంది 18 ఏళ్లలోపు పిల్లలే ఉంటారని తెలిపింది. ఇప్పటివరకు 7 వేల మందికిపైగా హమాస్‌ మిలిటెంట్లను మట్టుబెట్టినట్లు ఇజ్రాయెల్‌ ప్రకటించింది.

దక్షిణ గాజాపై ఇజ్రాయెల్​ భీకర దాడులు- 5వేల మంది ఉగ్రవాదులు హతం- ఇళ్లను వీడిన 18లక్షల మంది పౌరులు!

రఫాపై ఇజ్రాయెల్ బాంబుల మోత- మానవతాసాయం ట్రక్కులకు బ్రేక్​లు- ఎటు చూసినా ఆకలి కేకలే!

ABOUT THE AUTHOR

...view details