తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : Nov 16, 2023, 10:12 PM IST

Updated : Nov 16, 2023, 10:55 PM IST

ETV Bharat / international

హమాస్​పై ఇజ్రాయెల్ ఉక్కుపాదం- కీలక నేత ఇల్లు ధ్వంసం, నేవీ ఆయుధాలు సైతం!

Israel Palestine Conflict : హమాస్‌ మిలిటెంట్ల ఏరివేతే లక్ష్యంగా దాడులు చేస్తున్న ఇజ్రాయెల్.. తాజాగా ఆ సంస్థకు చెందిన రాజకీయ అధిపతి ఇస్మయిల్ హనియా నివాసంపై బాంబు దాడి చేసింది. ఈ మేరకు ఐడీఎఫ్‌ ఎక్స్‌లో ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఈ నివాసం కేంద్రంగానే హమాస్ ఇజ్రాయెల్‌పై దాడులకు ప్రణాళికలు రచించిందని పేర్కొంది. అయితే ఇస్మయిల్ హనియా గాజా పట్టీలో లేరని తెలుస్తోంది.

Israel Palestine Conflict
Israel Hamas War

Israel Palestine Conflict : ఇజ్రాయెల్‌ దళాలు గాజాలో ఉగ్రవేటను కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలోనే హమాస్‌ రాజకీయ అధిపతిగా పేరొందిన ఇస్మాయిల్‌ హనియా ఇంటిని ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ ధ్వంసం చేసింది. ఆయన నివాసంపై ఫైటర్‌ జెట్లతో బాంబుల వర్షం కురిపించింది. దీనికి సంబంధించిన వీడియోలను ఐడీఎఫ్‌ ఎక్స్‌ లో పోస్టు చేసింది. ఇస్మాయిల్‌ హనియా ఇల్లు హమాస్‌ ఉగ్రకార్యకలాపాలకు నిలయంగా మారిందని ఆరోపించింది. హమాస్‌ సంస్థకు చెందిన సీనియర్‌ నాయకులు, వ్యూహకర్తలు ఇక్కడే సమావేశమై ఇజ్రాయెల్‌పై దాడి వ్యూహాన్ని రచించినట్లు పేర్కొంది. హనియా నివాసంతోపాటు హమాస్‌ నౌకాదళానికి చెందిన వివిధ ఆయుధాలను కూడా ధ్వంసం చేసినట్లు తెలిపింది. అయితే, దాడి సమయంలో హనియా నివాసంలో ఎవరైనా ఉన్నారా అనే విషయమై ఐడీఎఫ్‌ ఎలాంటి స్పష్టతను ఇవ్వలేదు.

అతడి అడుగుజాడల్లోనే హనియా..!
హమాస్ రాజకీయ అధిపతి ఇస్మాయిల్ హనియా గాజా పట్టీలో నివసించడంలేదని తెలుస్తోంది. హమాస్ సంస్థ ఈనెల ప్రారంభంలో ఒక వీడియో సందేశం విడుదల చేయగా అందులో హనియా ఖతర్ రాజధాని దోహాలో ఉన్నట్లు పేర్కొంది. మరోవైపు హమాస్ వ్యవస్థాపకుడు అహ్మద్‌ యాసిన్‌కు ఇస్మయిల్ హనియా అత్యంత సన్నిహితుడని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. యాసిన్‌కు రాజకీయపరమైన సలహాలిస్తూ అతడికి కుడి భుజంగా మారాడని వెల్లడించింది. 2004లో ఇజ్రాయెల్‌ దాడుల్లో అహ్మద్‌ యాసిన్‌ హతమైన తర్వాత.. హనియా హమాస్‌లో కీలక పాత్ర పోషిస్తున్నాడని తెలిపింది. పాలస్తీనాపై ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో ఇప్పటివరకు11 వేల 200 పాలస్తీనియన్లు మృతి చెందారు. అక్టోబరు 7న హమాస్ జరిపిన మెరుపు దాడిలో 1200 మంది ఇజ్రాయెలీలు హతమయ్యారు.

శిథిలాల కింద చిక్కుకున్న పాలస్తీనియన్​
ఇజ్రాయెల్​ దాడుల్లో ధ్వంసమైన భవనం

'ఆసుపత్రులను లక్ష్యంగా చేసుకోలేదు'
ఆసుపత్రులను లక్ష్యంగా చేసుకొని దాడులు చేయట్లేదని.. హమాస్​ మిలిటెంట్లు అక్కడ ఏర్పరుచుకున్న కమాండ్​ అండ్​ కంట్రోల్​ స్థావరాలపై మాత్రమే దాడులు చేస్తోందని ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్​ గురువారం స్పష్టం చేశారు. అలాగే ఆసుపత్రుల్లోని ఇజ్రాయెల్ పౌరులను హమాస్​ దళాలు కాల్చి చంపుతున్నాయని ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఇజ్రాయెల్​ హమాస్​ యుద్ధంలో దెబ్బతిన్న నివాసాలు

"హమాస్‌ దాడుల నుంచి ఇజ్రాయెల్‌కు తనను తాను రక్షించుకునే హక్కు ఉంది. ఈ క్రమంలోనే మా దేశ పౌరులను వారి చెరనుంచి విడిపించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఇందుకోసం బందీలను రక్షించేందుకు ఇజ్రాయెల్​ ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది."
- ఐజాక్ హెర్జోగ్, ఇజ్రాయెల్ అధ్యక్షుడు

'అంతర్జాతీయ మానవతా చట్టం నిబంధనల ప్రకారం గాజాలో మా దేశ బలగాలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. యుద్ధం జరిగే ప్రాంతాల్లో నుంచి ప్రజలు విడిచి వెళ్లేలా కరపత్రాలు పంచుతున్నాం. ఫోన్ల ద్వారా సందేశాలు పంపుతున్నాం' అని ఐజాక్ హెర్జోగ్ అన్నారు. ఇక అక్టోబర్ 7న ప్రారంభమైన ఇజ్రాయెల్​-హమాస్​ యుద్ధం 41వ రోజుకు చేరుకుంది.

'గాజాపై పట్టుకోల్పోయిన హమాస్'- ఆస్పత్రి కేంద్రంగా భీకర పోరు, శవాలను పీక్కుతింటున్న శునకాలు!

అల్‌షిఫా ఆస్పత్రిలోకి ఇజ్రాయెల్ దళాలు- హమాస్ ముష్కరులకు అల్టిమేటం- కమాండ్ సెంటర్ అక్కడే!

Last Updated : Nov 16, 2023, 10:55 PM IST

ABOUT THE AUTHOR

...view details