తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : Dec 9, 2023, 5:36 PM IST

ETV Bharat / international

రఫాపై ఇజ్రాయెల్ బాంబుల మోత- మానవతాసాయం ట్రక్కులకు బ్రేక్​లు- ఎటు చూసినా ఆకలి కేకలే!

Israel Attack On Rafah : గాజాపట్టీలోని ఒక్కో నగరాన్ని నిర్దాక్షిణ్యంగా ధ్వంసం చేస్తూ ముందుకు సాగుతున్న ఇజ్రాయెల్‌ సేనలు తాజాగా రఫా సిటీలో బాంబుల వర్షం కురిపించాయి. ఈ ఘటనల్లో నగరంలోని చాలా భవనాలు శిథిలాల కుప్పగా మారాయి. నిరంతరంగా కొనసాగుతున్న వైమానిక దాడుల వల్ల మానవతా సాయమందించే ట్రక్కులు ముందుకు కదలడం లేదు. దీంతో చాలా చోట్ల ఆహారం కోసం ప్రజలు అల్లాడుతున్నారు. పిల్లల కడుపు నింపేందుకు తల్లిదండ్రులు ఆహార ట్రక్కులపై ఎగబడుతున్నారు.

israel attack on rafah
israel attack on rafah

Israel Attack On Rafah : ఇజ్రాయెల్‌ దాడులతో గాజాపట్టీలో ప్రజల జీవితాలు నరకప్రాయంగా మారాయి. గాజాపై యుద్ధాన్ని పలు దఫాలుగా విభజించుకున్న ఇజ్రాయెల్‌ సైన్యం నిరంతర దాడులతో ముందుకు కదులుతున్నాయి. గాజా సిటీని సర్వనాశనం చేసిన నెతన్యాహు సేనలు ఖాన్‌ యూనిస్‌, రఫా నగరాలపై విరుచుకుపడుతున్నాయి. ఇంటింటినీ జల్లెడ పట్టి అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నాయి. ఇటీవల గాజాలో డజన్ల సంఖ్యలో యువకులను బట్టలు విప్పించి సామూహికంగా హత్య చేసిందన్న వార్తలు సామాజిక మాధ్యమాల్లో వినిపించాయి. ఐడీఎఫ్‌ దాడులతో రఫాలోని చాలా ప్రాంతాలు శిథిలాల కుప్పగా మారాయి. రఫాపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తమైన సరిహద్దు దేశం ఈజిప్టు తమ పౌరులను పరిసర గ్రామాలు, పట్టణాల నుంచి ఖాళీ చేయించింది.

రఫాలో ట్రక్కులపై దాడులు

దాడులు ఎడతెరిపి లేకుండా సాగుతుండటం వల్ల గాజాలో మానవతాసాయానికి తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ప్రజలకు ఒక్కపూట తిండి దొరకడం కష్టంగా మారడం వల్ల ఎక్కడ చూసినా ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. చాలాచోట్ల మానవతాసాయం అందిస్తున్న ట్రక్కులపై దాడులు జరుగుతున్నాయి. ట్రక్కులు ఆగకముందే వాటిపైకి ప్రజలు ఎగబడుతున్నారు.

మధ్యధరా సముద్ర తీర ప్రాంతంలోని మువైసీ అనే చిన్న భూభాగాన్ని ఇజ్రాయెల్‌ ప్రస్తుతం సేఫ్‌ జోన్‌గా ప్రకటించింది. గాజాలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడకు తరలివచ్చిన ప్రజలు ఇక్కడ దురవస్థలు పడుతున్నారు. నీటితో నిండిపోయిన చిత్తడి మైదానాల్లో టెంట్లు వేసుకుని వేలాది మంది పాలస్తీయన్లు కాలం వెల్లదీస్తున్నారు. కేవలం 20 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న మువైసీకి శరణార్థులు భారీగా తరలి వస్తున్నారు. రాత్రిపూట చలి ఎక్కువగా ఉండటం వల్ల పిల్లలు డయేరియా బారిన పడుతున్నారు. బాత్రూమ్​లు లేకపోవడం వల్ల మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

రఫాలో ట్రక్కులపై దాడులు

మూడో నెలకు చేరిన ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం
ఇజ్రాయెల్- హమాస్‌ మధ్య మొదలైన యుద్ధం శనివారానికి మూడోనెలకు చేరింది. అక్టోబర్‌ ఏడున హమాస్‌ మెరుపుదాడులకు దిగటం వల్ల యుద్ధం మొదలైంది. అప్పటినుంచి హమాస్‌ మిలిటెంట్లను తుదముట్టించే లక్ష్యంతో ఇజ్రాయెల్‌ వైమానిక, భూతల దాడులు చేస్తోంది. గాజాపట్టీలో శనివారం తెల్లవారుజామున భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు స్థానికులు తెలిపారు. ఆకాశంలో నల్లటి పొగ ఎగిసిపడిన దృశ్యాలు కనిపించినట్లు చెప్పారు. కాల్పుల విరమణ ఒప్పందానికి ససేమీరా అంటున్న ఇజ్రాయెల్‌ భీకరంగా దాడులు కొనసాగిస్తోంది. ఈ దాడుల వల్ల గాజాలో మానవతా సాయానికి తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది.

24 ఏళ్లుగా అధికారంలో 'ఒకే ఒక్కడు'- ఐదోసారీ పాలించేందుకు రెడీ!

బీచ్​లో భారీగా మరణించిన చేపలు- కిలోమీటరు వరకు ఎటు చూసినా అవే!

ABOUT THE AUTHOR

...view details