Indonesia Volcano Eruption Death Toll : ఇండోనేసియాలోని పశ్చిమ ప్రాంతంలో సంభవించిన అగ్నిపర్వతం విస్ఫోటనం ఘటనలో మృతుల సంఖ్య 23కు చేరుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆదివారం ఘటన నుంచి స్థానికులు ఇంకా కోలుకోకముందే సోమవారం మరో విస్ఫోటనం సంభవించింది. దీని ధాటికి సుమారు 2,620 అడుగుల ఎత్తుకు బూడిద గాల్లోకి ఎగసిపడింది. దీంతో సహాయక చర్యలను తాత్కాలికంగా నిలిపివేశారు అధికారులు. అయితే, తాజాగా లభ్యమైన మృతదేహాలు విస్ఫోటనం జరిగిన ప్రదేశానికి చాలా దూరంలో కనిపించాయని పశ్చిమ సుమత్రా ప్రావిన్స్ డిప్యూటీ పోలీస్ చీఫ్ ఏడీ మార్డియాంటో తెలిపారు.
సుమత్రా దీవిలో ఉన్న మౌంట్ మరాపిని పర్వతాన్ని అధిరోహించేందుకు శనివారం మెుత్తం 75 మంది పర్వతారోహకులు బయలుదేరారు. ఆదివారం వీరంతా ట్రెక్కింగ్ చేసే సమయంలో అగ్నిపర్వతం ఒక్కసారిగా బద్దలైంది. భారీ స్థాయిలో జరిగిన విస్ఫోటనం ధాటికి 11 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మంది ఆచూకీ గల్లంతైంది. సమాచారం అందుకున్న యంత్రాంగం హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టింది. ఈ రెస్క్యూ ఆపరేషన్లో 49 మందిని సహాయక సిబ్బంది కాపాడినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం వారంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు.
"పర్వతం విస్ఫోటనం ఘటనలో మృతుల సంఖ్య 23కు చేరుకుంది. ఇప్పటివరకు వెలికితీసిన మృతదేహాలను పోస్ట్మార్టం పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించాం. అయితే మిగిలిన వారు ఇంకా ప్రాణాలతో ఉండే అవకాశం లేదు. వారి బాడీలను కూడా ఈరోజు లేదా రేపు గుర్తిస్తాం."
- ఏడీ మార్డియాంటో, సుమత్రా ప్రావిన్స్ డిప్యూటీ పోలీస్ చీఫ్