తెలంగాణ

telangana

ETV Bharat / international

Hamas Hostage Release : 'హమాస్​ చెరలో 210 బందీలు'.. గాజాకు 200 ట్రక్కుల్లో 3వేల టన్నుల సామగ్రి!

Hamas Hostage Release : హమాస్​ విడిచిపెట్టిన ఇద్దరితో పాటు మిలిటెంట్ల చేరలో మరో 210 మంది ఉన్నట్లు ఇజ్రాయెల్‌ వెల్లడించింది. లెబనాన్​ సాయుధ సంస్థ- హెజ్బొల్లా కూడా యుద్ధంలో చేరాలనుకుంటోందని ఆరోపించింది. మరోవైపు, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం కారణంగా తీవ్ర దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్న గాజా పౌరులకు.. మానవతా సాయంతో చేయాలని ఐక్య రాజ్య సమితి చేసిన ప్రయత్నం ఫలించింది. శుక్రవారమే దాదాపు 200 ట్రక్కుల్లో 3 వేల టన్నులకుపైగా సామగ్రి గాజా సరిహద్దుకు చేరుకుంది.

By ETV Bharat Telugu Team

Published : Oct 21, 2023, 6:56 PM IST

Updated : Oct 21, 2023, 7:16 PM IST

Hamas Hostage Release
Hamas Hostage Release

Hamas Hostage Release :ఇజ్రాయెల్​-హమాస్​ యుద్ధ సంక్షోభం రోజురోజుకూ ముదురుతోంది. ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో గాజాలోని హమాస్‌ చెరలో బందీలుగా ఉన్న ఇజ్రాయెల్‌, ఇతర దేశాల పౌరుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం హమాస్​ మిలిటెంట్ల బందీలో 210 మంది ఉన్నారనిఇజ్రాయెల్ డిఫెన్స్‌ ఫోర్సెస్‌- ఐడీఎఫ్‌ అధికార ప్రతినిధి తెలిపారు. అయితే, ఇదే ఆఖరి సంఖ్య కాదని ఆయన అన్నారు. అదృశ్యమైన వారి కోసం మిలిటరీ దర్యాప్తు కొనసాగిస్తోందని.. అనంతరం బందీల సంఖ్య మరింత పెరగొచ్చని వెల్లడించారు. అయితే హమాస్‌ శుక్రవారం ఇద్దరు అమెరికన్‌-ఇజ్రాయెల్‌ మహిళలను విడుదల చేసింది. వీరిద్దరు కాకుండానే ఇంకా 210 మంది వారి వద్ద బందీలుగా ఉన్నట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. వీరిలో చిన్నారులు, వృద్ధులు కూడా ఉన్నట్లు చెప్పింది.

'యుద్ధానికి హెజ్బొల్లా సై'
Israel Hamas War Hezbollah :మరోవైపు.. ఈ యుద్ధంలో పాల్గొనాలని లెబనాన్‌లోని సాయుధ సంస్థ అయిన హెజ్బొల్లా నిర్ణయం తీసుకున్నట్లు ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి యోవ్‌ గాలెంట్‌ ఆరోపణలు చేశారు. ఒకవేళ అదే నిజమైతే.. తమపై దాడులకు వారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. గత కొన్ని రోజులుగా సౌత్ లెబనాన్‌ నుంచి హెజ్బొల్లా.. ఇజ్రాయెల్‌ సైన్యంపై దాడులు చేస్తోంది. వీటిని ఐడీఎఫ్‌ బలంగా ఎదుర్కొంటోంది. తాము జరిపిన ప్రతిదాడుల్లో 13 మంది హెజ్బొల్లా సభ్యులు హతమైనట్లు ఇజ్రాయెల్‌ వెల్లడించింది.

'హమాస్‌ తమ పౌరులనే చంపేస్తోంది'
Israel Hamas War Update :గాజా స్ట్రిప్‌ నుంచి ఇజ్రాయెల్​పై.. హమాస్‌, పీఐజే మిలిటెంట్లు ప్రయోగించిన రాకెట్లలో 550కు పైగా విఫలమయ్యాయని ఐడీఎఫ్‌ అధికార ప్రతినిధి తెలిపారు. అవి వారి భూభాగంలోనే పడిపోయాయని పేర్కొన్నారు. 'వారు తమ సొంత పౌరులనే చంపేస్తున్నారని' అని ఆరోపణలు చేశారు.

ఐరాస ప్రయత్నం సఫలం..
Israel Hamas War United Nations :గాజాలో మానవతా సంక్షోభం ఏర్పడకుండా ఐరాస, అమెరికా సహా పలు దేశాలు చేసిన ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. మానవతా సాయంతో కూడిన ట్రక్కులు గాజాలో ప్రవేశించాయి. ఈజిప్టు వైపు నుంచి రఫా సరిహద్దు గుండా గాజాకు నిత్యావసరాల సరఫరా మొదలైంది. శుక్రవారమే దాదాపు 200 ట్రక్కుల్లో 3వేల టన్నులకుపైగా సామగ్రి గాజా సరిహద్దుకు చేరుకుంది. అయితే.. ఇజ్రాయెల్‌ దాడులతో గాజాలోని రహదారులు దెబ్బతిన్నాయి. వేగంగా మరమ్మతులు చేపట్టారు. అమెరికాకు చెందిన ఇద్దరు బందీలను హమాస్ మిలిటెంట్లు విడిచిపెట్టిన కొన్ని గంటల తర్వాత ట్రక్కులు.. రఫా సరిహద్దు గుండా గాజాలోకి ప్రవేశించాయి. పరిస్థితులు అనుకూలిస్తే మధ్యవర్తులతో చర్చించి మిగతా బందీలను విడిచిపెట్టనున్నట్లు హమాస్ ప్రకటించింది. ఈజిప్టు, ఖతర్‌తోపాటు పలుదేశాలు చేస్తున్న మధ్యవర్తిత్వ ప్రయత్నాలకు పూర్తిగా సహకరిస్తామని వెల్లడించింది.

గాల్లో దీపంలా రోగుల ప్రాణాలు..
Israel Hamas War Egypt : ఈనెల 7న హమాస్‌ మిలిటెంట్లు మెరుపుదాడులు చేయటం వల్ల.. గాజాను ఇజ్రాయెల్‌ దిగ్బంధించింది. బయటి నుంచి ఎవరూ రాకుండా తమ సరిహద్దును మూసివేసింది. శరణార్థులు, హమాస్ మిలిటెంట్లు తమ దేశంలోకి ప్రవేశించకుండా ఈజిప్టు కూడా తమ సరిహద్దును మూసివేసింది. ఇరుదేశాల చర్యలతో గాజాలో నిత్యావసర వస్తువులు, ఆహారం, ఔషధాలకు కొరత ఏర్పడింది. ఐరాస ప్రధాన కార్యదర్శి గుటెరస్‌, అమెరికా అధ్యక్షుడు బైడెన్ సూచన మేరకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు.. ఈజిప్టు సరిహద్దు నుంచి నిత్యావసరాల సరఫరాకు అంగీకరించారు. ఆస్పత్రుల్లో ఔషధాలు నిండుకోవడం వల్ల క్షతగాత్రులు, దీర్ఘకాలిక రోగుల ప్రాణాలు గాల్లో దీపంలా మారాయి. విద్యుత్‌ లేక జనరేటర్ల వెలుగులో ఆపరేషన్లు నిర్వహించారు. జనరేటర్లు నడిచేందుకు సరిపడా ఇంధనం లేకపోవడం వల్ల కేవలం ఐసీయూకు మాత్రమే విద్యుత్‌ సరఫరా చేస్తున్నారు. అయితే జనరేటర్లు నడిచేందుకు ఇంధనాన్ని నిత్యావసరాలతో పాటే సరఫరా చేస్తారా లేదా అనే విషయంపై స్పష్టత లేదు.

'ఆమెరికా ఆజ్యం పోస్తోంది'
ఇజ్రాయెల్‌- పాలస్తీనా సంక్షోభానికి అమెరికా ఆజ్యం పోస్తోందని పాలస్తీనాజాతీయ సామాజిక ప్రజాస్వామ్య పార్టీ- ఫతా ఆరోపించింది. గాజాపై దాడులు చేసే విషయంలో ఇజ్రాయెల్‌ సంయమనం పాటించాలని ఐరాస, ఇతర దేశాలు పిలుపునిస్తున్నాయని ఫతా గుర్తు చేసింది. అమెరికా, బ్రిటన్‌, జర్మనీ అధినేతలు ఇజ్రాయెల్‌లో పర్యటిస్తూ ఆ దేశాన్ని రెచ్చగొడుతున్నారని దుయ్యబట్టింది. అమెరికా, పాశ్చాత్య దేశాల జోక్యంతోనే ఇదంతా జరుగుతోందని ఆరోపించిన ఫతా.. ఇలాంటి భయంకర చర్యలతో ప్రపంచమంతా ప్రభావితం అవుతుందని హెచ్చరించింది. మధ్యప్రాచ్యంలో అమెరికా ప్రయోజనాలు ప్రమాదంలో పడినందునే.. ఈ పరిణామాలు జరుగుతున్నాయని అభిప్రాయపడింది. అందుకే అమెరికా, ఐరోపా దేశాలు ఇజ్రాయెల్‌కు ఆత్మరక్షణ హక్కులు మంజూరు చేశాయని ఫతా ఆరోపించింది.

Israel Hamas War : గాజాలోకి ఇజ్రాయెల్ సైన్యం! ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్.. అమెరికా 100 బిలియన్ డాలర్ల ప్యాకేజీ!

ఏ క్షణమైనా భూతల దాడులు.. ఇజ్రాయెల్ సైన్యం సన్నద్ధం! మురుగు నీటితోనే గాజా ప్రజల జీవనం!

Last Updated : Oct 21, 2023, 7:16 PM IST

ABOUT THE AUTHOR

...view details