ప్రపంచంలో సుదీర్ఘ కాలం పాటు పాలించిన నేతగా రికార్డుకెక్కిన ఆఫ్రికా ఖండంలోని ఈక్వెటోరియల్ గినియా అధ్యక్షుడు టియోడోరో ఒబియాంగ్ గ్వీమా మబాసోగో (80) మరోసారి ఆ ఛాన్స్ కొట్టేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఆదివారం (నవంబర్ 20న) జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో.. కేవలం ఇద్దరు ప్రత్యర్థులు మాత్రమే ఎన్నికల బరిలో ఉన్నారు. 14 ప్రతిపక్ష పార్టీలు ఏకమై ఒబియాంగ్కు మద్దతుగా నిలిచాయి. దీంతో ఇప్పటికే 43 ఏళ్లుగా గినియాను పాలిస్తున్న ఆయన.. ఈసారి కూడా మళ్లీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
43 ఏళ్లుగా అధికారంలో 'ఒకే ఒక్కడు'.. మరోసారి ఆయనకే ఛాన్స్! - ఆఫ్రికా టియోడోరో ఒబియాంగ్ గ్వీమా మబాసోగో న్యూస్
ఆఫ్రికా దేశమైన ఈక్వెటోరియల్ గినియాలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అధ్యక్షుడు టియోడోరో ఒబియాంగ్ గ్వీమాగే మళ్లీ గెలిచే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. గడిచిన 43ఏళ్లుగా అధికారంలో ఉన్న ఆయన.. మరోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఆఫ్రికా దేశమైన ఈక్వెటోరియల్ గినియా జనాభా సుమారు 15లక్షలు. చమురు, సహజవాయు నిల్వలు పుష్కలంగా ఉన్న ఆ దేశం 1968లో స్పెయిన్ నుంచి స్వాతంత్ర్యం పొందింది. అనంతరం దేశ మొదటి అధ్యక్షుడిగా ఎన్నికైన ఫ్రాన్సిస్కో మాసియస్ గ్వీమాపై తిరుగుబాటు చేసిన ఒబియాంగ్.. 1979లో పాలనా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ఆ దేశాన్ని పాలిస్తున్న ఆయన.. తదనంతర ఎన్నికల్లోనూ విజయం సాధిస్తూ వస్తున్నారు. ఇలా గడిచిన 43 ఏళ్లుగా గినియాను పాలిస్తున్న ఆయన.. తాజా ఎన్నికల్లోనూ తననే గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం అక్కడ 4లక్షల మందికిపైగా ఓటర్లుగా నమోదు చేసుకున్నారు.
ఇప్పటివరకు జరిగిన ఏ ఎన్నికల్లోనూ టియోడోరో ఒబియాంగ్కు ఎన్నడూ 90శాతం కంటే తక్కువ ఓట్లు రాలేదు. ఇలా నాలుగన్నర దశాబ్దాలుగా పాలిస్తున్నప్పటికీ.. దేశంలో అవినీతి వ్యవస్థను ప్రోత్సహించారనే ఆరోపణలున్నాయి. భారీ స్థాయిలో చమురు నిల్వలు ఉన్న ఆ దేశాన్ని పేదరికం నుంచి విముక్తి కల్పించే అవకాశాలున్నప్పటికీ.. అలా చేయడంలో టియోడోరో ఒబియాంగ్ విఫలమయ్యారనే విమర్శలున్నాయి. ఒబియాంగ్ పాలనలో ప్రత్యర్థులను బెదిరించడం, మరణశిక్షలు అమలు వంటి విషయంలో దారుణంగా వ్యవహరిస్తున్నారని మానవ హక్కుల సంఘాలు కూడా మండిపడుతున్నాయి.