Cargo Ship Sinks Greece :గ్రీసు దేశ తీరంలో ఓ కార్గో నౌక మునిగిపోయి నలుగురు భారతీయులు సహా 13 మంది గల్లంతయ్యారు. ప్రమాద సమయంలో నౌకలో మొత్తం 14 సిబ్బంది ఉండగా.. ఒకరిని రక్షించినట్లు అధికారులు చెప్పారు. వీరిలో నలుగురు భారతీయులతో పాటు ఎనిమిది మంది ఈజిప్టునకు చెందినవారు.. ఇద్దరు సిరియాకు చెందిన వారున్నారు. బలమైన గాలులతో సముద్రం అల్లకల్లోలంగా మారడమే దీనికి కారణంగా తెలుస్తోంది.
ఇదీ జరిగింది
ఈజిప్టులోని అలెగ్జాండ్రియా నుంచి రాప్టర్ అనే కార్గో నౌక.. 6,000 టన్నుల ఉప్పుతో తుర్కియేలోని ఇస్తాంబుల్కు బయలుదేరింది. మార్గమధ్యలో ఆదివారం ఉదయం 7గంటలకు నౌకలో సాంకేతిక సమస్య వచ్చింది. ఈ విషయాన్ని గుర్తించిన సిబ్బంది.. హుటాహుటిన సమీప కేంద్రానికి ప్రమాద సంకేతాన్ని ఇచ్చారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆ నౌక కనిపించకుండా పోయినట్లు స్థానిక కోస్ట్ గార్డ్ చెప్పింది.
వెంటనే రంగంలోకి దిగిన రెస్య్క్యూ బృందాలు.. ముమ్మర గాలింపు చర్యలు చేపట్టాయి. రెండు హెలికాప్టర్లతో పాటు ఎనిమిది నౌకలు, గ్రీస్కు చెందిన ఓ యుద్ధ నౌకతో ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇందులో ఒక ఈజిప్టు దేశీయుడిని రక్షించినప్పటికీ.. 13 మంది ఆచూకీ గల్లంతైనట్లు వెల్లడించారు. సముద్రంలో భీకర గాలులతో ప్రతికూల వాతావరణం ఉండడంతో గాలింపు కష్టతరంగా మారిందని రెస్య్కూ సిబ్బంది వివరించారు.