Ukrainian separatist regions : ఉక్రెయిన్లో తాము ఆక్రమించుకున్న లుహాన్స్క్, దొనెట్స్క్ ప్రావిన్స్లు సహా దక్షిణ ఉక్రెయిన్లోని ఖేర్సన్, జపోరిజ్జియా ప్రాంతాలను ఇకపై తమ దేశంలో శాశ్వతంగా కలుపేసుకునేందుకు పుతిన్ సర్కారు రంగం సిద్ధం చేస్తోంది. ఆయా ప్రాంతాలు రష్యాలో చేరే విషయమై ఈ నెల 23 నుంచి 27 వరకు ఓటింగ్ నిర్వహించనున్నట్లు డాన్బాస్లోని రష్యా అనుకూల వేర్పాటువాద నేతలు ప్రకటించారు. లుహాన్స్క్, దొనెట్స్క్ ప్రాంతాలు తమకు కావాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ సన్నిహితుడు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ రిఫరెండం రష్యా భౌగోళిక, రాజకీయ చిత్రాన్ని శాశ్వతంగా మార్చనుందని పుతిన్ సన్నిహితులు వ్యాఖ్యానించారు.
లుహాన్స్క్, దొనెట్స్క్ ప్రాంతాలు రిఫరెండం తర్వాత అధికారికంగా రష్యాలో చేరితే ఇక ఆ సరిహద్దులను మార్చేందుకు వీలుపడదు. వాటిపై ఎవరైనా దాడిచేసినా ఎంతకైనా తెగించే అవకాశం మాస్కోకు దక్కుతుంది. ఆ రెండు ప్రావిన్స్ల గురించి ఇక ఉక్రెయిన్ మర్చిపోవాల్సి వస్తుంది. రిఫరెండంలో ప్రజా తీర్పు రష్యాకు అనుకూలంగానే వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఐతే ఆ రిఫరెండంను పశ్చిమ దేశాలు గుర్తించవని పేర్కొన్నారు. ఇటీవల ఖార్కివ్ రీజియన్లో రష్యా ఆక్రమించుకున్న కొన్ని ప్రాంతాలను తిరిగి ఉక్రెయిన్ స్వాధీనం చేసుకున్న వేళ ఈ రిఫరెండం జరుగుతుండటం గమనార్హం.