తెలంగాణ

telangana

కరోనా మరణాల్లో ఐదో స్థానానికి బ్రిటన్​

By

Published : Nov 12, 2020, 11:17 AM IST

ప్రపంచ దేశాలను కొవిడ్ మహమ్మారి వణికిస్తోంది. మొత్తం కేసుల సంఖ్య 5 కోట్ల 24 లక్షలు దాటేయగా.. కొవిడ్​ మరణాల సంఖ్య 12.89 లక్షలకు పెరిగింది. అత్యధిక కేసుల్లో అమెరికాలో అగ్రస్థానంలో ఉండగా.. భారత్​, బ్రెజిల్​, ఫ్రాన్స్​, రష్యా టాప్​-5లో కొనసాగుతున్నాయి.

global covid19
కరోనా మృతుల్లో ఐదోస్థానానికి యూకే

ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతోంది. ఇప్పటివరకు మొత్తం 5,24,40,433 మందికి కరోనా నిర్ధరణ అయ్యింది. అందులో 12,89,730 మంది ప్రాణాలు కోల్పోయారు. 3,66,76,552 మంది కొవిడ్​ నుంచి కోలుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 1,44,74,151 కేసులు ఉన్నాయి.

బ్రిటన్​ రికార్డు మరణాలు..

బ్రిటన్​లో కరోనా మరణాలు 50వేలు దాటాయి. ఫలితంగా అత్యధిక మరణాలు సంభవించిన దేశాల్లో ఐదో స్థానానికి చేరింది. యూకే కంటే ముందు అమెరికా, బ్రెజిల్​, భారత్​, మెక్సికోలో మాత్రమే ఈ స్థాయిలో మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం ఇంగ్లాండ్​ వ్యాప్తంగా లాక్​డౌన్​ కొనసాగుతోంది. అత్యవసర సేవలు, నిత్యవసర దుకాణాలు తప్ప పబ్​లు, రెస్టారెంట్లు, జిమ్​లు, గోల్ఫ్​ కోర్టులు, స్విమ్మింగ్​పూల్​లు, వినోద​ పార్కులపై డిసెంబర్​ 2 వరకు ఆంక్షలు కొనసాగుతున్నాయి.

ఎమర్జెన్సీ పెంపు..

దక్షిణాఫ్రికాలో అత్యవసర పరిస్థితిని మరో నెలపాటు పెంచుతున్నట్లు ప్రకటించారు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్​ రామఫోసా. డిసెంబర్​ 15 వరకు తాజా నిబంధనలు అమల్లో ఉంటాయని చెప్పారు. కరోనా నెగెటివ్​ ధ్రువపత్రం ఉండి కొవిడ్​ నిబంధలు పాటిస్తే ఏ దేశం నుంచి వచ్చినా దక్షిణాఫ్రికాలోకి అనుమతి ఇస్తున్నారు.

గ్రీస్​లో కర్ఫ్యూ..

కరోనా ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో గ్రీస్​లో నవంబర్​ 7 నుంచి ఇప్పటికీ లాక్​డౌన్​ కొనసాగిస్తున్నారు. శుక్రవారం నుంచి రాత్రిళ్లు కర్ఫ్యూ సైతం అమలు చేస్తున్నారు. రాత్రి 9 నుంచి ఉదయం 5 వరకు బయట తిరగటానికి వీల్లేదని ఇప్పటికే ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. కేవలం ఆరోగ్య సిబ్బందికి మాత్రమే బయటకు వచ్చేందుకు అనుమతి ఇస్తున్నారు. ఆంక్షలను పక్కాగా అమలు చేసేందుకు మిలటరీని రంగంలోకి దించగా.. కరోనా కట్టడిలో భాగంగా ప్రైవేటు ఆస్పత్రుల నుంచి సహాయ సహకారాలు తీసుకుంటోంది అక్కడి ప్రభుత్వం.

స్వీడన్​లో మద్యం అమ్మకాలపై..

స్వీడన్​లో కరోనా నియంత్రణలో భాగంగా మద్యం అమ్మకాలపై ఆంక్షలు పెట్టింది అక్కడి ప్రభుత్వం. బార్లు, రెస్టారెంట్లు, క్లబ్బుల్లో రాత్రి 10 తర్వాత ఆల్కహాల్​ అమ్మడాన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. నవంబర్​ 20 నుంచి ఈ ఉత్తర్వలు అమల్లోకి రానున్నాయి. గత కొన్ని వారాలుగా స్వీడన్​లో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఇది దేశంలోని వైద్య వ్యవస్థ, ఇంటెన్సివ్​ కేర్​వార్డులపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే దేశంలో కోటి కేసులు రాగా.. 6వేలకుపైగా మరణాలు నమోదయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details