బ్రెగ్జిట్ వల్ల వచ్చిన నూతన వీసా నిబంధనలు కళా రంగానికి తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెడతాయని బ్రిటీష్ నటులు మెక్కెల్లన్, ప్యాట్రిక్ స్టీవర్ట్, జూలీ వాల్టర్స్ సహా పలువురు యూకే ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వీసా లేకుండా ఐరోపా సమాఖ్య (ఈయూ)లోని ఇతర దేశాలకు ప్రయాణించేందుకు వీలు లేకపోవడం వల్ల చాలా నష్టం వస్తుందని తెలిపారు.
బ్రిటన్ కళాకారులపై బ్రెగ్జిట్ దెబ్బ!
ఎన్నో చర్చల అనంతరం అమలైన బ్రెగ్జిట్ డీల్పై బ్రిటన్ కళాకారుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. బ్రెగ్జిట్ కారణంగా ఈయూలో ప్రదర్శనలు ఇచ్చేందుకు ఇతర దేశాల మాదిరిగానే ప్రత్యేక వీసాలు తీసుకోవాల్సి వస్తోంది. ఇది తమపై ఆర్థిక భారం మోపుతున్నట్లు వాపోతున్నారు.
బ్రెగ్జిట్ అనంతరం వీసా నిబంధనలతో భారీ నష్టం
2020 చివరినాటికి ఈయూ నుంచి పూర్తి తెగదెంపులు చేసుకున్న నేపథ్యంలో.. బ్రిటన్ పౌరులు ఐరోపా సమాఖ్య దేశాల్లో నివసించడం కుదరదు. కళాకారులు 27 ఈయూ దేశాల్లో ప్రదర్శన ఇచ్చేందుకు ప్రత్యేక వీసాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ వీసాల కోసం భారీ మొత్తంలో ఈయూకు డబ్బు చెల్లించాల్సి వస్తుందని వాపోతున్నారు పలువురు. దీని వల్ల సాంస్కృతిక శక్తిగా ఉన్న బ్రిటన్కు తీవ్ర నష్టం వాటిల్లుతుందని చెబుతున్నారు.