తెలంగాణ

telangana

By

Published : Dec 24, 2020, 5:21 AM IST

ETV Bharat / international

మరో వేషంలో మహమ్మారి.. మరింత ప్రమాదకారి.!

కరోనా మహమ్మారి మరో వేషంలో ముంచుకొస్తోంది. బ్రిటన్​లో ఇంకో కొత్త రకం వైరస్​ను గుర్తించారు. దక్షిణాఫ్రికాలో మార్పు చెంది అక్కడ తీవ్రస్థాయిలో విజృంభిస్తున్న కొత్త రకం కొవిడ్​ వైరస్ ​లండన్​కు చేరుకుంది. ఇప్పటికే ఇద్దరిలో ఈ రకం వైరస్​ను గుర్తించారు. ఇది మరింత వేగంగా వ్యాపిస్తుందని బ్రిటన్​ ఆరోగ్య మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.

జన్యుమార్పిడి జరిగిన కరోనాతో కొద్దిరోజులుగా సతమతమవుతోందన్న బ్రిటన్​కు మరో కొత్త బెడద ముంచుకొచ్చింది. దక్షిణాఫ్రికాలో మార్పు చెంది అక్కడ తీవ్రస్థాయిలో విజృంభిస్తున్న ఇంకో కొత్త రకం కొవిడ్​ వైరస్​ తాజాగా లండన్​కు చేరుకుంది. ఇద్దరు పౌరులు ఇప్పటికే దీని బారినపడినట్లు బ్రిటన్​ ఆరోగ్య మంత్రి మట్​ హన్​కాక్​ బుధవారం వెల్లడించారు. కొత్త రకం కరోనా(వియుఐ202012/01)ను మించిన వేగంతో వ్యాపించే లక్షణాలు దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వైరస్​కు ఉన్నాయని, ఉత్పరివర్తనం కూడా త్వరత్వరగా జరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని వారాల క్రితం దక్షిణాఫ్రికాకు వెళ్లి వచ్చిన వారి ద్వారా ఇది తమ దేశానికి చేరి ఉంటుందని తెలిపారు. కొత్త రకాల వైరస్​ వ్యాప్తి నివారణకు లాక్​డౌన్​ను మరిన్ని ప్రాంతాలకు విస్తరించి, ఆంక్షలను కఠినంగా అమలు చేయనున్నట్లు వెల్లడించారు. దక్షిణాఫ్రికా నుంచి ప్రయాణికుల రాకపోకలను తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.

గత 15 రోజుల్లో దక్షిణాఫ్రికాకు వెళ్లి వచ్చిన వారు వెంటనే స్వీయ ఏకాంతంలోకి వెళ్లాలని సూచించారు. దక్షిణాఫ్రికా రకం వైరస్​పై వాయవ్య ఇంగ్లాండ్​లోని ప్రత్యేక ప్రయోగశాలలో పరీక్షలు చేయనున్నారు. బ్రిటన్​లో బుధవారం ఒక్కరోజే 36 వేల మందికి పైగా వైరస్​ బారినపడ్డారు.

ఇదీ చూడండి: 'కొత్త' వైరస్ వేళ..​ 'క్రిస్మస్'పై ఆంక్షలు ఏ దేశంలో ఎలా?

బ్రిటన్​ ప్రయాణికుల్లో 11 మందికి కరోనా..

కొత్త రకం కరోనా వైరస్​ వ్యాప్తి నేపథ్యంలో భారత ప్రభుత్వం.. బ్రిటన్​ నుంచి వచ్చే విమానాలను బుధవారం నుంచి ఈ నెలాఖరు వరకు రద్దు చేసింది. ఆ గడువులోగా ఇక్కడికి చేరుకున్న ప్రయాణికులందరికీ ఆర్​టీపీసీఆర్​ టెస్టుల్ని నిర్వహిస్తోంది. మంగళవారం రాత్రి నాలుగు విమానాల్లో దిల్లీకి చేరుకున్న వారిలో 11 మందికి కరోనా సోకినట్లు నిర్ధరణ అయింది. మరో 50 మందికిపైగా క్వారంటైన్​కు తరలించారు.

ప్రతి ఒక్కరినీ నిశితంగా పరీక్షించిన తర్వాతే విమానాశ్రయం వెలుపలకు అనుమతిస్తున్నారు. దీంతో ప్రయాణికులు గంటల కొద్దీ అక్కడే నిరీక్షించాల్సి వస్తోంది. రాష్ట్రాల్లోనూ యూకే నుంచి వచ్చిన ప్రయాణికుల వివరాల సేకరణ ప్రారంభమయింది. కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్​ భూషణ్​ బుధవారం వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా సమీక్ష నిర్వహించారు. కరోనా పాజిటివ్​తో రాష్ట్రాలకు చేరుకున్న విదేశీ ప్రయాణికుల పరిస్థితి గురించి ఆరా తీశారు. గత 15 రోజుల్లో 33 మంది బ్రిటన్​ నుంచి ఇందోర్​కు వచ్చినట్లు గుర్తించిన మధ్యప్రదేశ్​ ప్రభుత్వం వారందరూ ఏకాంతంలో ఉండాలని సూచించింది. మహారాష్ట్ర మాదిరిగానే కర్ణాటక ప్రభుత్వం కూడా పట్టణ ప్రాంతాల్లో రాత్రి పూట కర్ఫ్యూ విధించింది.

ఇదీ చూడండి: రిపోర్టులు రాక.. విమానాశ్రయంలో పడిగాపులు

ABOUT THE AUTHOR

...view details