తెలంగాణ

telangana

By

Published : Feb 4, 2020, 2:32 PM IST

Updated : Feb 29, 2020, 3:34 AM IST

ETV Bharat / international

ఈయూ- బ్రిటన్ మధ్య వాణిజ్య ఒప్పందం కష్టమే!

ఐరోపా సమాఖ్యతో ఇటీవల విడిపోయింది బ్రిటన్. ఈ నేపథ్యంలో యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ సోమవారం కీలక ప్రసంగం చేశారు. ఈయూతో స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందాలకు సిద్ధమంటూనే సమాఖ్య నిబంధనలను అమలు చేయబోమన్నారు. ఇందుకు దీటుగా స్పందించింది ఈయూ. తమకు లాభదాయకం కాని ఒప్పందం కంటే పొత్తు లేకుండా ఉండటమే మేలని తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో రానున్న కాలంలో ఈయూ- యూకే మధ్య సంబంధాలపై నీలినీడలు కమ్ముకున్నాయి.

uk-eu
ఈయూ-బ్రిటన్ మధ్య వాణిజ్య ఒప్పందం కష్టమే!

జనవరి 31న ఐరోపా సమాఖ్యతో (ఈయూ) విడిపోయింది బ్రిటన్. ఈ నేపథ్యంలో ముందుగా నిర్ణయించిన ప్రకారం మరో 11 నెలల కాలంలో ఈయూతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవాల్సి ఉంది. అయితే కీలక అంశాలపై ఏకాభిప్రాయానికి రావాల్సిన సందర్భంలో ఎలాంటి ఒప్పందాలు లేకుండానే ఇరు ప్రాంతాలు విడిపోయే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ సోమవారం నాటి ప్రసంగం దీనికి బలం చేకూర్చేలా ఉంది.

ఐరోపా సమాఖ్యను వీడిన మూడు రోజుల అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు బ్రిటన్ ప్రధాని బోరిస్. ఈయూతో వాణిజ్య ఒప్పందాన్ని చేయాల్సిన అవసరం తమకు లేదని వ్యాఖ్యానించారు. స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందాలకు సిద్ధంగా ఉన్నట్లు అంతర్జాతీయ రాయబారులు, వాణిజ్యవేత్తలు లక్ష్యంగా వ్యాఖ్యలు చేశారు.

"ఈయూతో ఒప్పందం కుదుర్చుకోవాల్సిన అవసరం మనకు లేదు. సరిహద్దుల వెంట సాధికారిక నియంత్రణను పునరుద్ధరిద్దాం."

-బోరిస్ జాన్సన్, బ్రిటన్ ప్రధాని

అయితే బోరిస్ వ్యాఖ్యలపై అదే స్థాయిలో స్పందించారు ఈయూ వాణిజ్య చర్చల ప్రతినిధి మైఖేల్ బార్నియర్. ఐరోపా సమాఖ్యలోని మిగిలిన 27 దేశాలు బ్రిటన్​తో ఎలాంటి వాణిజ్య ఒప్పందాన్ని చేసేందుకు అంగీకరించబోవన్నారు. అత్యంత ఖరీదైన స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందం చేసేకంటే.. 11 నెలల కాలం ముగిశాక ఎలాంటి ఒప్పందం లేకుండా ఉండటమే మేలన్నారు.

"మేం స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందాలకు అనుకూలం. కానీ అమాయకంగా వ్యవహరించబోం. 45 కోట్ల ఐరోపా వినియోగదారులు, పన్ను రహిత కోటాలు లేని స్థితి ఊరికే రావు."

-మైఖేల్ బార్నియర్, ఈయూ వాణిజ్య చర్చల ప్రతినిధి

బ్రెగ్జిట్​ ఒప్పందంలో వాణిజ్య, రక్షణ సహకారం సహా పలు అంశాల్లో సుదృఢ, సరళమైన భాగస్వామ్యం కొనసాగాలని ఇరువర్గాలు ఆకాంక్షించడం గమనార్హం. బ్రిటన్ పూర్తిస్థాయిలో ఐరోపా నుంచి సంబంధాలను తెంచుకునే 11 నెలలకాలం ముగిసే వరకు యథాతథ స్థితి కొనసాగనుంది. అయితే ఈయూ కీలక నిర్ణయాల్లో బ్రిటన్​ ఎలాంటి పాత్ర ​ వహించబోదు. ఈ నేపథ్యంలో సమాఖ్యతో కొనసాగే అంశమై బ్రిటన్ ప్రధాని బోరిస్ నిర్ణయమే కీలకం కానుంది.

కెనడా మోడల్​వైపు బ్రిటన్ మొగ్గు

వస్తు, సేవలపై ఎలాంటి సుంకాలు విధించని కెనడా తరహా వాణిజ్య ఒప్పందాన్ని ఈయూతో చేసుకోవాలని భావిస్తోంది బ్రిటన్. మిగతా దేశాలతో వాణిజ్య ఒప్పందాలకు అనువుగా ఉండడం కోసమే ఈయూతో ఈ విధానాన్ని అవలంబించనున్నట్లు తెగేసి చెబుతోంది. లేదంటే సుంకాలు అధికంగా ఉండే ఆస్ట్రేలియా తరహా విధానాన్ని అవలంబిస్తామని హెచ్చరిస్తోంది.

అయితే పర్యావరణం, కార్మిక హక్కులు, ఆరోగ్యం, రక్షణ ప్రమాణాలు వంటి తమ నిబంధనలకు బ్రిటన్ అంగీకరిస్తేనే ఒప్పందం సాధ్యమవుతుందని ఈయూ వాదిస్తోంది. ఈ నేపథ్యంలోనే హక్కులు, బాధ్యతల మధ్య సమతూకం ఉండాలని వ్యాఖ్యానించారు ఈయూ కమిషన్ అధ్యక్షుడు ఉర్సులా వాన్.

ఇరు వర్గాలు కఠిన వైఖరి అవలంబించడం... రానున్న 11 నెలల్లో జరగాల్సిన ఈయూ- యూకే వాణిజ్య చర్చలపై నీలినీడలు కమ్ముకునేలా చేసింది.

ఇదీ చూడండి: 'బ్రెగ్జిట్'​ ముగిసిపోయింది.. ఆ పదాన్ని ప్రస్తావించను: బోరిస్

Last Updated : Feb 29, 2020, 3:34 AM IST

ABOUT THE AUTHOR

...view details