బుజ్జి బుజ్జి పాదాలు... చిన్ని చిన్ని చేతులు కదిలిస్తూ చిన్నారులు చేసే కేరింతలు.. లేలేత పెదాలపై విరబూసే బోసి నవ్వులు.. ఏ ఇంటనైనా ఆనందాల సిరులను కురిపిస్తాయి.. సంతోషాల సంబరాన్ని అందిస్తాయి. అలాంటి మురిపాల బుజ్జాయి.. అరుదైన, చికిత్సలేని వ్యాధి బారిన పడితే.. ఇక ఆ తల్లిదండ్రుల ఆవేదన వర్ణనాతీతం. ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు బ్రిటన్కు చెందిన అలెక్స్, దవె దంపతులు. అత్యంత అరుదైన రుగ్మతతో బాధపడుతున్న వారి అయిదు నెలల చిన్నారి లెక్సీ రాబిన్స్ శరీరం రాయిలా మారుతోంది.
20 లక్షల మందిలో ఒకరికి..
బేబీ లెక్సీ ఈ ఏడాది జనవరి 31న యూకేలోని హేమెల్ హెంప్స్టెడ్, హెర్ట్ఫోర్డ్షైర్లో జన్మించింది. పుట్టుకతోనే ఆమె జన్యు సంబంధిత రుగ్మతకు గురైంది. రోజులు గడిచే కొద్ది చిన్నారి శరీరంలో వస్తున్న మార్పులు తల్లిదండ్రులను కలవరానికి గురిచేశాయి. చేతి బొటన వేలు, కాలి బొటన వేలులో చలనం లేదని గుర్తించారు. వైద్యుల వద్దకు తీసుకెళితే నెలరోజుల పాటు వివిధ పరీక్షలు చేసి చివరకు ఫైబ్రోడిస్ ప్లాసియా ఓసిఫికన్స్ ప్రొగ్రెస్సివా(ఎఫ్ఓపీ) అని తేల్చారు. 20 లక్షల మందిలో ఒకరికి వచ్చే ఈ అరుదైన వ్యాధి వల్ల కండరాలు, సంధాన కణజాలాలు, ఎముకలను కలిపి ఉంచే లిగ్మెంట్ స్థానంలో ఎముకలు ఏర్పడతాయి. డొక్క(స్కెలిటన్) భాగం వెలుపలా ఎముకలు పుట్టుకొచ్చి కదలికలు లేకుండా అడ్డుకుంటాయి. చివరకు శరీరం చలనరహితమై రాయిలా మారుతుందని వైద్యులు తెలిపారు. ఇటువంటి వారు 40ఏళ్లు మాత్రమే జీవించగలరని, అందులోనూ సగానికి పైగా కాలం మంచానికే పరిమితమై ఉండాల్సి వస్తుందని వివరించారు.