పుడమి పరిరక్షణలో ప్రపంచ దేశాలకు దిక్సూచీలా మారుతుందని ఆశించిన 'కాప్-25' సదస్సు ఉసూరుమనిపించింది. కర్బన ఉద్గారాల తగ్గింపు దిశగా స్పష్టమైన మార్గనిర్దేశనం చేయకుండానే ముగిసిపోయింది. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో స్పెయిన్ రాజధాని మ్యాడ్రిడ్ వేదికగా ఈ నెల్లోనే సదస్సు జరిగింది. భూతాపం పెరుగుదలను నియంత్రించి, మానవాళి భవిష్యత్తును పదిలం చేయడమే లక్ష్యంగా పారిస్ సదస్సు(2015)లో కుదిరిన ఒప్పందానికి మాడ్రిడ్ సదస్సు తుది రూపునిస్తుందని అంతా భావించారు. కర్బన ఉద్గారాలను సమర్థంగా కట్టడి చేసే నిబంధనల రూపకల్పనకు వేదికగా నిలుస్తుందని ఆశించారు. అవేవీ తాజా సదస్సులో కార్యరూపం దాల్చలేదు. ఇందుకు ప్రధానంగా ఐదు కారణాలు ఉన్నాయన్నది విశ్లేషకుల వాదన.
వందల మంది లాబీయిస్టులు
కర్బన ఉద్గారాలను తగ్గించే ప్రణాళికల రూపకల్పన 'కాప్-25'లో కీలకాంశం. అయితే- తాజా సదస్సులో పాల్గొనేందుకు దాదాపు 30 వేల మంది దౌత్యవేత్తలు, నిపుణులు, పర్యావరణ కార్యకర్తలు, ప్రముఖులకు అనుమతి లభించగా.. అందులో హై-ఆక్టేన్ శిలాజ ఇంధనాల లాబీయిస్టులే కొన్ని వందల మంది ఉన్నారు. ఆ ఇంధనం పర్యావరణానికి హాని కలిగించేది కావడం గమనార్హం. పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన సదస్సులో వారు పాల్గొంటే ఫలితం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు!
చైనా మౌనం
ప్రపంచంలో అత్యధికంగా కార్బన్ డై ఆక్సైడ్ను వాతావరణంలోకి విడుదల చేస్తున్న దేశం చైనా. తర్వాతి స్థానాల్లో వరుసగా అమెరికా, రష్యా, భారత్ ఉన్నాయి. తన తర్వాత ఉన్న మూడు దేశాలు సంయుక్తంగా వాతావరణంలోకి విడుదల చేసే కార్బన్ డై ఆక్సైడ్తో పోలిస్తే ఒక్క చైనా ఉద్గారాలే ఎక్కువ. ఈ నేపథ్యంలో 2030 కల్లా కర్బన ఉద్గారాలను గణనీయంగా తగ్గించుకుంటామంటూ పారిస్ ఒప్పంద సమయంలో చైనా స్వచ్ఛందంగా ముందుకు రావడం అందరికీ సంతోషం కలిగించింది. అయితే- లక్ష్య సాధనకు సంబంధించి తాజా సదస్సులో చైనా మౌనం పాటించింది. పారిస్ ఒప్పంద సమయంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను సడలించుకునే దిశగా సంకేతాలిచ్చింది.