తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనా టీకాపై అగ్రదేశాల యుద్ధం!

కరోనా వైరస్​ టీకాను కనిపెట్టడమే ప్రపంచ దేశాల ప్రథమ కర్తవ్యం. ఇప్పటికే పలు దేశాల్లో శాస్త్రవేత్తలు ప్రయోగాలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. 150కు పైగా టీకాలు వివిధ దశల్లో ఉన్నట్లు సమాచారం. అయితే ఈ టీకా తయారీ అగ్రరాజ్యాలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఫలితంగా పలు దేశాల మధ్య కుట్రలు, వెన్నుపోటులకు తెరలేచింది. ఈ నేపథ్యంలోనే కరోనా టీకాను సిద్ధం చేసినట్లు రష్యా చేసిన ప్రకటన సంచలనం సృష్టించింది.

By

Published : Jul 19, 2020, 3:44 PM IST

Russian hackers tried to steal coronavirus vaccine research: UK
కరోనా టీకాపై అగ్రదేశాల యుద్ధం..!

ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత విలువైన వస్తువు ఏదంటే.. అది భవిష్యత్తులో రాబోయే 'కరోనా వైరస్‌ టీకా'నే. జన జీవనం కుదేలైపోయేట్లు చేసిన ఈ వైరస్‌ను కట్టడి చేయడం ఇప్పుడు ప్రపంచం ముందున్న ప్రథమ కర్తవ్యం. ఈ నేపథ్యంలో కనీవినీ ఎరుగని రీతిలో టీకా తయారీకి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాదాపు 150కు పైగా టీకాలు వివిధ దశల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీకా తయారీ అగ్రరాజ్యాలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఫలితంగా కుట్రలు.. వెన్నుపోటులకు తెరలేచింది. హ్యాకింగ్‌లు, శాస్త్రవేత్తల హత్యలు, ఉద్దేశపూర్వకంగా సమాచారం గోప్యంగా ఉంచడం వంటివి జరుగుతున్నాయి.

సంచలనం సృష్టించిన రష్యా ప్రకటన

కరోనా వైరస్‌ను అడ్డుకొనే టీకాను తయారు చేశామని గత వారం రష్యాకు చెందిన సెచినోవ్‌ విశ్వవిద్యాలయంలోని గమలియ ఇన్‌స్టిట్యూట్‌ ప్రకటించింది. తొలిదశ ప్రయోగాలు 45 మందిపై చేసినట్లు పేర్కొంది. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ నోరు మెదపలేదు. అయితే టీకా తక్కువ మందిపై ప్రయోగించడం.. విడుదలకు సిద్ధమవుతోందని వేగంగా ప్రకటించడం వంటివి అనుమానాలకు తావిస్తోంది. వాస్తవానికి టీకా తయారీకి 15ఏళ్లు అయినా పడుతుంది. వీటిల్లో వివిధ దశలను దాటాల్సి ఉంటుంది. కనీసం 12 నుంచి 18 నెలలు పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రష్యా ప్రకటనపై సందేహాలు వచ్చాయి.

అదే సమయంలో బ్రిటన్‌ సెక్యూరిటీ మినిస్టర్‌ జేమ్స్‌ బ్రోకెన్‌షైర్‌ సంచలన ప్రకటన చేశారు. టీకా పరిశోధనలు చేస్తున్న సంస్థలపై రష్యా ప్రభుత్వ సహకారంతో 'కోజీ బేర్‌' (ఏపీటీ 29) అనే గ్రూప్‌ హ్యాకింగ్‌కు పాల్పడుతోందనడాన్ని 95 శాతం కచ్చితత్వంతో చెప్పగలనని.. ఈ గ్రూప్‌ క్రెమ్లిన్‌ వేగుల బృందంలో కీలకమైన విభాగమని పేర్కొన్నారు. ఎంత డేటాను రష్యా చోరీ చేసిందనే విషయాన్ని మాత్రం ఆయన చెప్పలేదు. రష్యా గతంలో కూడా బ్రిటన్‌లో గూఢచర్యం చేయడం వంటి ఆరోపణలను ఎదుర్కొంది. దీనికి అమెరికా, కెనడాలు మద్దతు తెలిపాయి. మరోపక్క యూకే ఆరోపణలను రష్యా తిరస్కరించింది. పొంతన లేని ఆరోపణలని కొట్టిపారేసింది.

అమెరికాలో శాస్త్రవేత్త హత్య..?

అమెరికాలో కరోనా వైరస్‌పై కీలక పరిశోధనలు చేస్తున్న ఓ శాస్త్రవేత్తను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఈ ఘటన మే మొదటి వారంలో జరిగింది. చైనాలో పుట్టి పెరిగిన బింగ్‌ ల్యూ(37) పిట్స్‌ బర్గ్‌ యూనివర్శిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. మే 6వ తేదీన ఆయన తుపాకీ కాల్పులుకు గురై చనిపోయాడు. కరోనావైరస్‌ పరిశోధనల్లో ఆయన కీలక దశకు చేరుకొన్నాడని సహచరులు చెప్పారు. కరోనా వైరస్‌ కణాలు ఎలా స్పందిస్తాయనే అంశంపై ఆయన పరిశోధనలు చేస్తున్నారు. ఈ క్రమంలో చైనాపై ఆరోపణలు వచ్చాయి. కానీ, డ్రాగన్‌ ఈ ఆరోపణలను కొట్టిపారేసింది.

జన్యు సమాచారం ఆలస్యానికి అదే కారణం..

వుహాన్‌లో కరోనావైరస్‌ బయటపడిన తర్వాత చైనాలో దానికి సంబంధించిన జన్యు సమాచారాన్ని విశ్లేషించి సిద్ధం చేశారు. ఈ డేటాను జనవరి 12న ప్రపంచానికి అందుబాటులోకి తెచ్చారు. కానీ, దాదాపు 10రోజుల ఆలస్యంగా డేటాను పంచుకుందనే ఆరోపణలు చైనాపై వెల్లువెత్తాయి. టీకా రేసులో అందరికంటే ముందుండాలనే చైనా ఇలా చేసిందని అమెరికా ఆరోపించింది. కరోనా సమాచారం బహిర్గతం చేయడంలో చైనా జాప్యం చేసిందని అత్యధిక దేశాలు అనుమానిస్తున్నాయి. ఈ క్రమంలో భవిష్యత్‌లో టీకాలకు సంబంధించి అగ్ర రాజ్యాల మధ్య ఆరోపణలు.. ప్రత్యారోపణలు తీవ్రమైనా ఆశ్చర్యపోనవసరంలేదు.

ఇదీ చూడండి:'బ్లాక్​ లైవ్స్ మ్యాటర్​​​' పెయింటింగ్​పై మూడోసారి దాడి

ABOUT THE AUTHOR

...view details