తెలంగాణ

telangana

By

Published : Mar 8, 2022, 10:52 PM IST

ETV Bharat / international

వెనక్కి తగ్గని రష్యా.. 500కిలోల బాంబుతో దాడి- 18 మంది మృతి

Russia Ukraine war: ఉక్రెయిన్‌పై సైనిక చర్యకు దిగిన రష్యా క్రమంగా పట్టు బిగిస్తోంది. పలు నగరాలను చుట్టుముట్టిన నేపథ్యంలో రాజధాని కీవ్‌ సహా 5 నగరాలకు చెందిన ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు కాల్పుల విరమణ ప్రకటించింది. అయితే, దాడులు కొనసాగినట్లు ఉక్రెయిన్‌ ఆరోపించింది. సుమీలోని ఓ నివాస ప్రాంగణంపై 500కిలోల బాంబు పడిన ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా 18మంది చనిపోయారు. ఖార్కివ్‌లో రష్యా మేజర్‌ జనరల్‌ను చంపినట్లు ప్రకటించుకున్న ఉక్రెయిన్... ఇప్పటివరకు 12వేల మంది పుతిన్ సేనలు చనిపోయినట్లు తెలిపింది.

RUSSIA UKRAINE WAR UPDATES
RUSSIA UKRAINE WAR UPDATES

Russia Ukraine war 13th day: ఉక్రెయిన్‌పై దండయాత్ర మొదలుపెట్టిన రష్యా.. 13వరోజు కూడా దాడులు కొనసాగించింది. బాంబుల మోతతో పలు నగరాలు దద్ధరిల్లుతున్నాయి. మరియుపోల్‌లో పుతిన్‌ సేనలు బాంబుదాడులతో విరుచుకుపడుతున్నాయి. సుమీ నగరంలోని ఓ అపార్ట్‌మెంటుపై 500 కిలోల బాంబు పడి ఇద్దరు చిన్నారులు సహా 18 మంది మృతి చెందారు.

Russia soldiers deaths

మానవత్వాన్ని మంటగలిసేలా రష్యా సేనలు దాడి చేస్తున్నాయని ఉక్రెయిన్‌ మండిపడింది. దాడులు జరుగుతున్న ప్రాంతాల్లో కొన్నిరోజుల నుంచి నీరు, విద్యుత్తు సరఫరా నిలిచిపోయినట్లు ఉక్రెయిన్ అధికారవర్గాలు తెలిపాయి. ప్రజలు ఆహారంతోపాటు నీరు, మందుల కొరత ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నాయి. ఖార్కివ్‌లో తమ సైనికులు జరిపిన దాడిలో రష్యా మేజర్ జనరల్ చనిపోయినట్లు ఉక్రెయిన్‌ ప్రకటించుకుంది. ఇప్పటివరకు 12వేల మంది రష్యా సైనికులు చనిపోయినట్లు తెలిపింది.

దాడి విధ్వంస దృశ్యాలు

Russia Ukraine Evacuation

మాస్కో సేనలు ముట్టడించిన నగరాల నుంచి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు.. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక కారిడార్లు ఏర్పాటయ్యాయి. అక్కడి పౌరులు ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు వీలుగా రష్యా... మానవతా కారిడార్లు తెరిచింది. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌, చెర్నిహివ్‌, సుమీ, ఖార్కివ్‌, మరియుపోల్‌ నగరాల్లో కాల్పుల విరమణ ప్రకటించిన రష్యా... ఉదయం 10గంటల నుంచి దాడులు ఆపేసినట్లు తెలిపింది. యుద్ధప్రాంతాల పౌరులను రష్యా, బెలారస్‌కు తరలించాలన్న ప్రతిపాదనను ఉక్రెయిన్‌ తిరస్కరించింది. దీంతో ప్రజలు తాము కోరుకున్న ప్రాంతాలకు వెళ్లొచ్చని రష్యా సూచించింది.

దాడులకు ధ్వంసమైన వంతెన.. బోల్తా పడిన వాహనం

Sumy Green corridors

కీవ్‌కు సమీపంలోని ఇర్పిన్‌తోపాటు సుమీ నగరాల నుంచి కూడా ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. సుమీలో గ్రీన్ కారిడార్ ఏర్పాటు కాగా... తొలిదశ తరలింపు ప్రక్రియ ప్రారంభమైనట్లు ఉక్రెయిన్ అధికార వర్గాలు తెలిపాయి. మంచుతో నిండిన రోడ్లపై నుంచి బస్సులు బయలుదేరాయి. మరికొందరు పసుపుపచ్చ బస్సుల్లో ఇతర ప్రాంతాలకు వెళ్తున్న వీడియోలను అధికారులు పోస్ట్ చేశారు. కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ... దాడులు కొనసాగినట్లు ఉక్రెయిన్‌ ఆరోపించింది. కీవ్‌ ప్రాంతంలోని అనేక గ్రామాల్లో శరణార్థుల బస్సులపైనా షెల్లింగ్‌ జరిపినట్లు పేర్కొంది.

ధ్వంసమైన వంతెనపై నిల్చొని చుట్టూ పరిశీలిస్తున్న వ్యక్తి

Ukraine refugee crisis

యుద్ధం మొదలైన నాటి నుంచి ఇప్పటివరకు 20లక్షల మంది ఉక్రెయిన్‌ ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లినట్లు ఐరాస ప్రకటించింది. అందులో లక్ష మంది విదేశీయులు ఉన్నట్లు తెలిపింది. రెండో ప్రపంచయుద్ధం తర్వాత ఐరోపాలో అతిపెద్ద శరణార్థి సంక్షోభం ఇదేనని పేర్కొంది. యుద్ధం ఇలాగే కొనసాగితే ప్రజలు వనరులతోపాటు సంబంధాలు కోల్పోయే ప్రమాదముందని ఐరాస హెచ్చరించింది. ఐరోపా దేశాలు మరింత ముందుకు వెళ్లటానికి సంక్లిష్ట పరిస్థితులు ఎదురుకావచ్చని పేర్కొంది.

వంతెన కింద ఆగిన ఉక్రెయిన్ పౌరులు

USA bans Russia oil imports

రష్యాపై ఇప్పటికే అనేకరకాల ఆంక్షలు విధించిన అమెరికా... మాస్కో నుంచి దిగుమతయ్యే చమురుపైనా కఠిన నిర్ణయం తీసుకుంది. ఆయిల్ దిగుమతులను నిషేధిస్తున్నట్లు బైడెన్ ప్రకటించారు.

ధ్వంసమైన వంతెన దాటుతున్న ప్రజలు

మరోవైపు, యుద్ధంలో రెండు నుంచి నాలుగు వేల మంది రష్యన్ సైనికులు మరణించినట్లు అమెరికా రక్షణ శాఖ అంచనా వేసింది.

ఇదీ చదవండి:

'ఈ యుద్ధాన్ని ఆపే సామర్థ్యం జో బైడెన్​కే ఉంది'

ఆయిల్ కొనుగోళ్లు బంద్.. అత్యధిక ఆంక్షలు రష్యాపైనే

ABOUT THE AUTHOR

...view details