NATO Summit 2022: ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణను అడ్డుకునేందుకు, ఐరోపాలో తలెత్తిన పరిస్థితిపై స్పందించేందుకు సభ్య దేశాలన్నీ రక్షణ సామర్థ్యాలను మెరుగుపరచుకోవాలని 'ఉత్తర అట్లాంటిక్ సైనిక కూటమి' (నాటో) పిలుపునిచ్చింది. బెల్జియం రాజధాని బ్రసెల్స్లో నాటో అత్యవసర శిఖరాగ్ర సమావేశం గురువారం ప్రారంభమైంది. దురాక్రమణకుగానూ రష్యా తగిన మూల్యం చెల్లించుకోవాలని నాటో స్పష్టంచేసింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సహా కీలకనేతలు దీనికి హాజరయ్యారు.
అకారణంగా విరుచుకుపడిన రష్యా తీరును ఖండించి, ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని.. ప్రాదేశిక సమగ్రతను పరిరక్షించడానికి నాటో దేశాలన్నీ ఐక్యంగా ఉన్నాయని సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్తెన్బర్గ్ చెప్పారు. రష్యాపై ఆంక్షల్ని కొనసాగించి, "దుర్మార్గ యుద్ధానికి" ముగింపు పలకాలనేది తమ నిర్ణయమని చెప్పారు. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా రక్షణ రంగంలో పెట్టుబడులను పెంచాలన్నారు. కూటమిలో సభ్య దేశంపై ఎలాంటి దాడి జరిగినా స్పందించి, పరిరక్షించేందుకు నాటో ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని చెప్పారు. రష్యా మీద విధించాల్సిన కొత్త ఆంక్షలు, ఉక్రెయిన్కు అదనపు సాయంపై నాటో సభ్య దేశాలతో బైడెన్ చర్చించారు. శుక్రవారం ఆయన పోలండ్ వెళ్తారు. మరోవైపు- జి-7 కూటమి శిఖరాగ్ర సదస్సు, ఈయూ సదస్సు కూడా బ్రసెల్స్ వేదికగా నిర్వహించారు. జీవ, రసాయన, అణ్వాయుధాలను వాడవద్దంటూ రష్యాకు జి-7 విజ్ఞప్తి చేసింది. ప్రపంచ మార్కెట్లకు సరఫరాలు పెంచాలని చమురు ఉత్పత్తి దేశాలను కోరింది. రష్యా కేంద్ర బ్యాంకు ఏ లావాదేవీల్లోనూ బంగారాన్ని వినియోగించకుండా నియంత్రణ విధిస్తున్నట్లు ప్రకటించింది.
రెండు పక్షాలకూ నష్టం
Ukraine War: యుద్ధంలో భాగంగా ఒకరినొకరు దెబ్బతీసుకునేందుకు రష్యా, ఉక్రెయిన్ గురువారం గట్టి ప్రయత్నాలు చేశాయి. రష్యాకు చెందిన ఒక యుద్ధనౌకను ధ్వంసం చేసి దానిని ముంచేశామని ఉక్రెయిన్ నౌకాదళం ప్రకటించింది. రష్యా బలగాలకు అవసరమైన వాటిని సరఫరా చేయడానికి ఆ నౌకను వినియోగించేవారు. తూర్పు ఉక్రెయిన్లో హోరాహోరీ పోరు తర్వాత ఇజో నగరాన్ని తాము గుప్పిట పట్టామని రష్యా ప్రకటించుకుంది. చాలా ప్రాంతాల్లో రష్యా సైన్యానికి ఉక్రెయిన్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. తీవ్రంగా ధ్వంసమైన మేరియుపొల్లో వీధివీధినా పోరాటం జరుగుతోంది. ఈ నగరం రష్యా చేజిక్కకుండా ఉక్రెయిన్ అడ్డుకుంది. కీవ్ సమీపంలో రష్యా పాత్రికేయురాలు ప్రాణాలు కోల్పోయారు.
ఉక్రెయిన్కు బాసట