తెలంగాణ

telangana

By

Published : Dec 22, 2020, 3:14 PM IST

ETV Bharat / international

ఇటలీలో మృత్యుఘోష- కారణాలు ఇవే...

ప్రపంచవ్యాప్తంగా కరోనా రెండో దఫా విజృంభణ కొనసాగుతోన్న నేపథ్యంలో ఇటలీలో కొవిడ్​ మరణాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. రోజుకు సరాసరి 600 మంది మహమ్మారితో ప్రాణాలు వదులుతున్నారు. మిగతా అన్ని దేశాలతో పోల్చితే ఇటలీలోనే కొవిడ్​ మరణాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే వృద్ధ జనాభా ఎక్కువగా ఉండడం వల్ల ప్రజలు చనిపోతున్నారని పలు నివేదికలు వెల్లడించాయి.

more number of corona deaths in italy due to senior citizens says wef
ఇటలీలో మృత్యుఘోష-కారణాలు ఇవే!

కరోనా వైరస్‌ ధాటికి ఇటలీ వణకిపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా వైరస్‌ విజృంభణ ఉన్నప్పటికీ కొవిడ్‌ కారణంగా ఎక్కువగా ఇటలీ వాసులే మృతి చెందుతున్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం యూరప్‌లో రెండో దఫా కరోనా విజృంభణ కొనసాగుతోన్న సమయంలోనూ ఇటలీలోనే కరోనా మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. ప్రపంచంలో అత్యధిక కరోనా మరణాలు సంభవిస్తోన్న దేశాల్లో అమెరికా, బ్రెజిల్ దేశాలు ముందున్నాయి. అనంతరం ఎక్కువ మరణాలు యూరప్‌లోని ఇటలీలోనే చోటుచేసుకుంటున్నాయి. నిత్యం సరాసరి 600లకు పైగా ఇటాలియన్లు కరోనా వైరస్‌ వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటివరకు ఇక్కడ 68,800మంది కొవిడ్‌ రోగులు మృత్యువాతపడ్డారు. ఇక అధిక మరణాలు సంభవిస్తోన్న దేశాల్లో ఇటలీ ఐదో స్థానంలో ఉండటం కలవరపెడుతోంది. అయితే, తక్కువ జనాభా ఉన్నప్పటికీ మిగతా దేశాలతో పోలిస్తే ఇక్కడే మరణాల సంఖ్య ఎక్కువగా ఉండటానికి గల కారణాలను పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. తాజాగా ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్​) కూడా ఇటలీ మరణాలకు గల కారణాలను విశ్లేషించింది.

ఎక్కువ మరణాలు అందుకేనా..?

అధిక జనాభా కలిగిన దేశాలతో పోలిస్తే ఇటలీలో కరోనా మరణాల సంఖ్య ఎక్కువగా ఉంది. దీనికి అక్కడి ప్రజల వయసే ప్రధాన కారణమని ప్రజారోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రపంచంలో వృద్ధ జనాభా ఎక్కువగా ఉండటం, వారి ఆరోగ్య సమస్యలు ఈ మరణాలకు కారణంగా విశ్లేషిస్తున్నారు. జపాన్‌ తర్వాత అత్యంత వృద్ధ జనాభా ఇటలీలోనే ఉంది. దాదాపు ప్రతి నలుగురు ఇటాలియన్లలో ఒకరు వయసు 65ఏళ్లకు పైబడినవారే కావడం గమనార్హం. కొవిడ్‌ మరణాల్లోనూ ఈ వయసు వారే ఎక్కువగా ఉన్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. యూరప్‌లోనే అత్యంత ఎక్కువ వృద్ధ జనాభా ఇటలీలోనే ఉంది. దాదాపు 22.8శాతం ప్రజలు 65ఏళ్లకు పైబడినవారే ఉన్నారు. అంతేకాకుండా ప్రపంచంలో అత్యధిక ఆయుర్దాయం ఉన్న దేశాల్లో ఇటలీ అగ్రస్థానంలో ఉంది. అక్కడి ప్రజల ఆయుర్దాయం 83సంవత్సరాలు. అయితే, జీవనకాలం ఎక్కువగా ఉన్నప్పటికీ 65ఏళ్ల వయసుపైబడిన వారిలో దాదాపు 70శాతం మందికి కనీసం రెండు ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు అక్కడి ప్రభుత్వ నివేదికలు వెల్లడించాయి. వీటి కారణంగా వైరస్‌ బారినపడటం మరింత ఇబ్బందిగా మారి ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఇది కూడా మరో కారణం..

కరోనా మరణాలు ఎక్కువగా ఉండటానికి వయసు ఒక కారణమైతే.. ఒకటి కంటే ఎక్కువ తరాల వ్యక్తులు ఒకే కుటుంబంగా నివసిస్తుండటం కూడా మరో కారణంగా ఆరోగ్యరంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. రెండు మూడు తరాలకు చెందిన కుంటుంబ సభ్యులు ఒకేచోట ఉండటవల్ల ఆ ఇళ్లలో ఉండే యువతీ యువకులు, బంధువుల వల్ల వృద్ధులు వైరస్‌ బారినపడుతున్నట్లు పేర్కొంటున్నారు. కరోనా వైరస్‌ విజృంభణ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు మరణించిన వారిలో దాదాపు 95శాతానికి పైగా 60ఏళ్ల వయసువారే ఉన్నారు. దాదాపు 86శాతం మంది 70ఏళ్లకు పైబడిన వారు ప్రాణాలు కోల్పోయినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే, ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ మరణాల్లో ఎక్కువగా ఈ వయసు వారే ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ.. ఇటలీలో వీరి సంఖ్య అధికంగా ఉంది.

ఇదీ చూడండి: కరోనా టీకా తీసుకున్న జో బైడెన్‌

ABOUT THE AUTHOR

...view details