అంతర్జాతీయ ప్రతిష్ఠాత్మక 'గేట్స్ కేంబ్రిడ్జ్ క్లాస్ ఆఫ్ 2021'(కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం అంతర్జాతీయ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్)కి 9 మంది భారతీయ స్కాలర్లు ఎంపికయ్యారు. వీరితో సహా ప్రపంచవ్యాప్తంగా 74 మంది అభ్యర్థులు దీనికి ఎంపికయ్యారు. 2000 సంవత్సరంలో 'బిల్, మిలిందా గేట్స్ ఫౌండేషన్' దీనికి 21 కోట్ల అమెరికన్ డాలర్లను విరాళంగా అందజేసింది. బ్రిటన్లో ఓ విశ్వవిద్యాలయానికి ఒకేసారి అత్యధికంగా ఇచ్చిన విరాళం ఇదే. ఈ ఏడాది ఎంపికైన స్కాలర్లు కూడా ఎప్పటిలా అకడమిక్ విద్యలోను, నాయకత్వ సామర్థ్యాల్లోనూ అసాధారణ ప్రజ్ఞాపాటవాలున్నవారేనని గేట్స్ కేంబ్రిడ్జ్ ట్రస్ట్ అధిపతి ప్రొఫెసర్ బారీ ఎవరిట్ తెలిపారు.
ఎంపికైన భారతీయులు..
అనన్య(లండన్ యూనివర్సిటీలో జెండర్ స్టడీస్ మాస్టర్స్ పూర్తిచేసి.. సోషల్ ఆంథ్రోపాలజీ ఎం.ఫిల్ చేస్తున్న విద్యార్థి), రిషభ్ బజోరియా(1960 సింధు జలాల ఒప్పందంపై ప్రాజెక్టు చేస్తున్న లీగల్ స్టడీస్ పీహెచ్డీ విద్యార్థి), అమెరికాలో ఉంటున్న తథాగత్ భాటియా(ఎం.ఫిల్-హిస్టరీ, ఫిలాసఫీ ఆఫ్ సైన్స్ అండ్ మెడిసిన్), సూర్య డేకా, నిఖితా ఝూ(విద్యావేత్తలు), అన్వేష లహరి(ఎపిడమాలజిస్ట్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ), మిషికా మెహరోత్రా(సైకాలజీ గ్రాడ్యుయేట్), అర్నాబ్ సర్కార్(ఆస్ట్రానమీ విద్యార్థి), సమర్పితా సేన్(జెనెటిక్స్ స్కాలర్). వీరితో పాటు భారత సంతతికి చెందిన - ఇండియన్ అమెరికన్, ఫిజికల్ సైన్సెస్ విద్యార్థి వెంకట చలువాడి, రేడియాలజిస్ట్ తన్వీ రావు, హెల్త్ కేర్ నిపుణుడు వీరజ్ షా, ఇంగ్లీషు సాహిత్యం విద్యార్థి మీనా వెంకటరమణన్ కూడా ఉన్నారు. 20వ వార్షికోత్సవం జరుపుకొంటున్న ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్కి 2001 నుంచి 111 దేశాలు, 600పైగా విశ్వవిద్యాలయాలకు చెందిన 2 వేల మందికి పైగా ఎంపికైనట్లు గేట్స్ కేంబ్రిడ్జ్ ట్రస్ట్ తెలిపింది.
ఇవీ చదవండి:'కొవిడ్ అనంతరం కొత్త ఉపాధి అవకాశాలు'
'మయన్మార్ నిరసనల్లో 51 మంది పిల్లలు మృతి'