తెలంగాణ

telangana

కరోనా కొమ్ముల్ని వంచిన దేశాలు ఇవే...

By

Published : Apr 14, 2020, 9:12 AM IST

కరోనాపై పోరులో జర్మనీ, తైవాన్‌, న్యూజిలాండ్‌, గ్రీసులు ఆదర్శంగా నిలుస్తున్నాయి. వైరస్​ కంటే వేగంగా కదిలి కొవిడ్​-19 కోరలు పీకేశాయి. మరి ఆ దేశాలు అమల చేసిన ముందుజాగ్రత్త చర్యలేంటి? వాటిని చూసి ప్రపంచం నేర్చుకోవాల్సిన అంశాలేంటి?

countries which succeed in contolling spread of corona virus are greek, germeny,thaiwan and new zealand
కరోనా కొమ్ముల్ని వంచిన దేశాలు!

కరోనా మహమ్మారిని ఎదుర్కొనడంలో, మరణాల రేటును తగ్గించడంలో, వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసే వ్యూహాల్లో నాలుగు దేశాలు అనుసరిస్తున్న విధానాలు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తగిన ముందుజాగ్రత్త చర్యలు, అనుమానితులకు గణనీయ సంఖ్యలో పరీక్షల నిర్వహణ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, భౌతిక దూరం పాటింపుపై ప్రజలకు అవగాహన కల్పించడం, ప్రభుత్వ విభాగాల మధ్య పక్కా సమన్వయంతో.. జర్మనీ, తైవాన్‌, న్యూజిలాండ్‌, గ్రీసులు ఇప్పుడు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. వైరస్‌ను నిలువరించడానికి ఆయా దేశాలు అనుసరిస్తున్న వ్యూహాలేమిటో చూద్దాం..

జర్మనీ

కరోనా కొమ్ముల్ని వంచిన దేశాలు!

‘పరీక్ష’ను పరీక్షలతోనే ఎదుర్కొంటూ..

కరోనా మహమ్మారిని ఎదుర్కొనడంలో, ముఖ్యంగా పరీక్షల నిర్వహణలో జర్మనీ అనుసరిస్తున్న విధానం ఇతరులకు ఆదర్శంగా నిలుస్తోంది. ప్రభుత్వ ముందుజాగ్రత్త చర్యల కారణంగా ఇక్కడ దాదాపు 64,300 మంది కోలుకున్నారు. మరే దేశంలోనూ ఈ స్థాయిలో రోగులు కోలుకోలేదు. జనవరి 27న బవేరియలో తొలికేసు నమోదైంది. స్టాక్‌డోర్ఫ్‌గా పిలిచే ప్రాంతాన్ని క్లస్టర్‌గా గుర్తించిన ప్రభుత్వం ఇక్కడ పరీక్షలు నిర్వహించింది. ఆ తర్వాత ఆస్ట్రియా, ఇటలీ నుంచి వచ్చిన వారిని వెంటనే గుర్తించి ఐసోలేషన్‌లో ఉంచడంతో ఒక్కసారిగా సామాజిక వ్యాప్తి జరగలేదు. ప్రజలకు భౌతిక దూరంపై జర్మనీ అవగాహన కల్పించింది. మార్చి 6 నుంచి కేసుల సంఖ్య పెరుగుతుండటంతో 22న దేశ స్థాయిలో లాక్‌డౌన్‌ ప్రకటించింది. ఏప్రిల్‌ 4 నాటికి దేశంలోని 132 పరీక్షా కేంద్రాలను ఉపయోగించుకొని రోజుకు సగటున 1,16,655 స్వాబ్‌ టెస్ట్‌లను నిర్వహించింది. ‘

ఇన్ఫెక్షన్‌ ప్రొటెక్షన్‌ చట్టం’లో మార్పులు చేసి ఫోన్ల ఆధారంగా బాధితులపై నిఘాపెట్టింది. బాధితులకు సలహాలు ఇచ్చేందుకు టెలిమెడిసిన్‌ను అందుబాటులోకి తెచ్చింది. స్థానిక స్టార్టప్‌ ‘డాక్‌యట్‌’ ఆన్‌లైన్‌ చాట్‌బోట్‌ను రంగంలోకి దించింది. ఇది అనుమానితుల ఆరోగ్య పరిస్థితిని అంచనావేసి టెలిమెడిసిన్‌ వాడుకోవడంలో సలహాలు ఇస్తోంది. జర్మనీ ఆరోగ్య వ్యవస్థపై జీడీపీలో 11.1 శాతం వెచ్చిస్తోంది. ఇక్కడ ప్రతి వ్యక్తిపై 4,271 డాలర్లను ఖర్చుచేస్తోంది. ఏప్రిల్‌ నాటికి వెంటిలేటర్లు సహా ఇంటెన్సివ్‌ కేర్‌ పడకల సంఖ్యను 40 వేలకు పెంచింది. దేశ ఛాన్స్‌లర్‌ ఏంజెలా మెర్కెల్‌ స్వయంగా శాస్త్రవేత్త కావడంతో పరిస్థితుల్ని వేగంగా అర్థంచేసుకొని భౌతిక దూరం నిబంధనలను కఠినంగా అమలు చేశారు. ఫలితంగా వ్యాధి వ్యాప్తి మందగించి.. రోగులకు మెరుగైన వైద్యం అంది, మరణాల రేటు తగ్గిపోయింది.

తైవాన్‌

కరోనా కొమ్ముల్ని వంచిన దేశాలు!

వైరస్‌ కంటే వేగంగా కదిలి..

ముందు జాగ్రత్త.. పటిష్ఠ వైద్య వ్యవస్థతోపాటు, ప్రజలు చైతన్యంగా ఉంటే... ఎలాంటి ఆరోగ్య విపత్తులు వచ్చినా గట్టిగా ఎదుర్కోవచ్చని తైవాన్‌ నిరూపించింది. చైనాకు 130 కి.మీ దూరంలోని ఈ చిరు ద్వీపం కరోనావైరస్‌పై అందరి కంటే మందే ప్రపంచ ఆరోగ్య సంస్థను అప్రమత్తం చేసింది. ఆ వెంటనే డిసెంబరు 31 నుంచే చైనా నుంచి వస్తున్న వారిని పరీక్షించడం ప్రారంభించింది. కరోనా పుట్టుకకు కేంద్రస్థానమైన వుహాన్‌ నుంచి వచ్చే వారిపై జనవరి 23న ఆంక్షలు పెట్టింది. చైనా పర్యటకుల రాకపై ఫిబ్రవరి 6న నిషేధం విధించింది. తైవాన్‌ వాసులు చైనాకు వెళ్లకూడదని ప్రకటించింది. ఫేస్‌మాస్క్‌ల రోజువారీ ఉత్పత్తిని 10 మిలియన్లకు చేర్చాలని స్థానిక కంపెనీలను ఆదేశించింది. ఫేస్‌మాస్క్‌ల పంపిణీని ప్రైవేటు రంగం నుంచి ప్రభుత్వం చేతిలోకి తీసుకొంది. ప్రతిఒక్కరూ వారానికి కొనాల్సిన వాటిపై రేషన్‌ విధించింది. ఆ తర్వాత దాదాపు కోటి మాస్కులను అమెరికా, ఐరోపాలకు అందజేసింది.

దేశంలో కరోనా కేసుల సమన్వయానికి తైవాన్‌ సెంట్రల్‌ ఎపిడమిక్‌ కమాండ్‌ సెంటర్‌ ఉపయోగపడింది. తైవాన్‌ ప్రభుత్వం, అక్కడి ఆసుపత్రుల మధ్య విస్తృత సమన్వయం ఉండటం కలిసొచ్చింది. దేశంలోని ప్రతి ఒక్కరికీ చిప్‌తో కూడిన ఆరోగ్యకార్డును జారీ చేశారు. వారి ఆరోగ్య చరిత్ర అంతా అందులో నిక్షిప్తంచేశారు. బాధితులను గుర్తించి వారిని స్వీయ నిర్బంధంలో ఉంచారు. ఆసుపత్రులను అన్ని రకాలుగా సిద్ధంచేసి, మందులు, సామగ్రిని వేగంగా సమకూర్చారు. వైరస్‌ ముప్పు ఉండటంతో ఆసుపత్రుల్లో సిబ్బంది ఎంతవరకు అవసరమో అంతే ఉంచారు. ఒకవేళ వైరస్‌ అకస్మాత్తుగా విజృంభించినా ఎదుర్కొనేలా 1000 ఐసోలేషన్‌ గదులను సిద్ధంచేశారు. ప్రజలు కూడా తమ పిల్లలను పాఠశాలకు పంపేముందు నిత్యం శరీర ఉష్ణోగ్రతను పరీక్షిస్తున్నారు. తరగతి గదుల్లోనూ విద్యార్థులను దూరంగా కూర్చోబెడుతున్నారు. ఇవన్నీ ఈ చిరుద్వీపానికి సంక్షోభ సమయంలో కలిసొచ్చాయి.

న్యూజిలాండ్‌

కరోనా కొమ్ముల్ని వంచిన దేశాలు!

ప్రజలను యుద్ధానికి ఒప్పించి..

ఒక మహమ్మారిపై గెలవాలంటే ప్రజలను ఒప్పించి పోరాటానికి సిద్ధంచేయాలి. న్యూజిలాండ్‌ అచ్చంగా ఇదే చేసింది. ఇప్పుడు కరోనా కొమ్ములు వంచుతోంది. న్యూజిలాండ్‌ ప్రధాని జెసిండా ఆర్డెర్న్‌ తన పాలనకు మానవత్వం జోడించడంతో ఆమెకు ప్రజలు బాసటగా నిలిచారు. ప్రజల్లో అవగాహన పెంచేందుకు యునైట్‌ అగైనెస్ట్‌ కొవిడ్‌-19 పేరుతో ఒక వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఫిబ్రవరి 28న ఇరాన్‌ నుంచి వచ్చిన ఒక మహిళకు కరోనావైరస్‌ సోకినట్లు తేలడంతో దేశంలో వేడి మొదలైంది. ఆ తర్వాత నెల రోజులకు తొలి మరణం నమోదైంది. వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం ఉద్ధృతంగా పరీక్షలు నిర్వహించింది. 50 లక్షల జనాభా ఉన్న దేశంలో ఏప్రిల్‌ 9 నాటికి 51,165 పరీక్షలు చేశారు. వైరస్‌ నాలుగో దశకు చేరితే అత్యంత ప్రమాదకరమని ప్రజల్ని హెచ్చరిస్తూ.. ప్రతి దశలో ముప్పు గురించి పారదర్శకంగా తెలియజేశారు.

రెండో దశలో భౌతిక దూరాన్ని పాటించేలా ఆంక్షలు విధించారు. ఉద్యోగుల్ని ఇంటి నుంచి పనిచేయడానికి అనుమతించారు. ఒకేసారి 50 కేసులు నమోదుకావడంతో.. ఉన్నఫళాన లాక్‌డౌన్‌ ప్రకటించకుండా.. నిత్యావసరాల కొనుగోలుకు 48 గంటల సమయాన్ని ఇచ్చారు. మార్చి 25న లాక్‌డౌన్‌ ప్రకటించారు. ప్రజలకు తరచూ ఫేస్‌బుక్‌ లైవ్‌లో ప్రధాని అందుబాటులో ఉంటున్నారు. దాదాపు రెండువారాల తర్వాత కొత్త కేసుల నమోదు శాతానికి కళ్లెం పడింది. యాక్టివ్‌ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. మార్చి 28న 146 కేసులు నమోదుకాగా.. ఏప్రిల్‌ 12 నాటికి కొత్త కేసుల సంఖ్య 18కు పడిపోయింది.

గ్రీసు

కరోనా కొమ్ముల్ని వంచిన దేశాలు!

ముందు చూపుతో..

కరోనాను ఎదుర్కొనడానికి ఆర్థిక బలం చాలా అవసరం. ఈ విషయాన్ని గ్రీస్‌ ముందే పసిగట్టింది. ఆర్థికంగా చితికిపోయిన తమ దేశానికి ఇది పెనుభారంగా మారుతుందని గ్రహించి జాగ్రత్త చర్యలు ప్రారంభించింది. ఐరోపాలోని ఇటలీ, స్పెయిన్‌ వంటి దేశాలతో పోలిస్తే మెరుగ్గా పనిచేసింది. ఫిబ్రవరి 26న ఇటలీ వెళ్లి వచ్చిన మహిళకు కొవిడ్‌ సోకినట్లు తేలింది. దేశంలో మార్చి 12న తొలి మరణం నమోదైంది. ప్రమాదాన్ని గ్రహించిన గ్రీస్‌ నాలుగు రోజుల తర్వాత దేశవ్యాప్తంగా దుకాణాలను మూసివేయించింది.

మార్చి 23 నుంచి ప్రజలు బయటకు రావడాన్ని నిషేధించింది. కేవలం ఏడు అత్యవసర కారణాలతో బయటకు రావాలని, వారు కూడా అధికారుల నుంచి ప్రత్యేక అనుమతులు పొందాలని నిబంధనలు విధించింది. వీటిని ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించింది. ఈ నిబంధనల్ని ఏప్రిల్‌ 27 వరకూ పొడిగించింది. దేశంలో మరో 4,200 మంది కొత్త వైద్యులను నియమించడంతోపాటు, ఐసీయూ గదుల సంఖ్యను 50 శాతం పెంచింది. ప్రధాని కిరాయాకోస్‌ మితోటకీస్‌కు ప్రతిపక్షాలు బాసటగా నిలిచాయి. ఇవన్నీ ఫలితాన్నిచ్చి దేశంలో ప్రతి 10 లక్షల మందికి 188 కేసులే నమోదు కాగా.. 8 మరణాలు చోటు చేసుకొన్నాయి.

ఇదీ చదవండి:కరోనా ఎఫెక్ట్​: పసిబిడ్డకు 'శానిటైజర్‌'గా నామకరణం

ABOUT THE AUTHOR

...view details