తెలంగాణ

telangana

By

Published : Mar 16, 2020, 6:07 AM IST

Updated : Mar 16, 2020, 6:52 AM IST

ETV Bharat / international

చిగురుటాకులా వణుకుతున్న ఇటలీ

కరోనా వైరస్‌ ఇటలీని చిగురుటాకులా వణికిస్తోంది. చైనా వెలుపల అత్యధిక మరణాలు ఈ దేశంలోనే సంభవిస్తున్నాయి. వైరస్‌ తీవ్రత ఇప్పుడు ఇటలీలో నాలుగోదశలో ఉంది (భారత్‌లో ప్రస్తుతం రెండోదశ). అన్ని దేశాలకన్నా ముందుగానే ప్రయాణ ఆంక్షలు విధించినా.. ఇటలీలో ఎందుకీ మరణమృదంగం? ఈ దేశం ఎక్కడ నిర్లక్ష్యం చేసింది?

Coronavirus is so prevalent in Italy after China.. What are the causes?
ఇటలీ.. ఎందుకీ విలవిల?

ప్రపంచాన్ని కబలిస్తున్న కరోనా వైరస్​... ఇటలీని చిగురుటాకులా వణికిస్తోంది. చైనా తరువాత అత్యధిక మరణాలు ఈ దేశంలోనే సంభవిస్తున్నాయి. వైరస్‌ తీవ్రత ఇప్పుడు ఇటలీలో నాలుగోదశలో ఉంది. అన్ని దేశాలకన్నా ముందుగానే ప్రయాణ ఆంక్షలు విధించినా.. ఇటలీలో పరిస్థితి ఎందుకు క్షీణించింది? ఈ దేశం ఎక్కడ నిర్లక్ష్యం చేసింది?

మొదట్లో నిర్లక్ష్యం..

జనవరి 29న రెండు కేసులు వెలుగుచూసిన మరుసటి రోజే ఇటలీలో ఆరు నెలల పాటు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. చైనా నుంచి విమానాల రాకను నిషేధించారు. కానీ 20 రోజుల్లోనే పరిస్థితి తలకిందులైంది. ఇంత వేగంగా వైరస్‌ ఎందుకు వ్యాపించిందనే దానిపై శాస్త్రవేత్తలు భిన్న వాదనలు వినిపిస్తున్నారు. జనవరి నెల మధ్య నుంచే ఈ వైరస్‌ నెమ్మదిగా ఇటలీలో పాదం మోపడం మొదలైందని.. మొదట్లో మరణాలు సంభవించేంతటి తీవ్రంగా లేదని, స్వల్ప దగ్గు, జ్వరం లాంటివి ఉండేవని వారు అంచనా వేస్తున్నారు. వీటిని సాధారణ ఫ్లూ జ్వరాల్లాగానే పరిగణిస్తూ.. తీవ్రతను గుర్తించకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల వైరస్‌ స్వేచ్ఛగా వ్యాపించిందని బెర్న్‌ యూనివర్సిటీకి చెందిన అంటువ్యాధుల నిపుణుడు క్రిస్టియన్‌ ఆల్తస్‌ చెబుతున్నారు.

జనవరి నెలలో ఇటలీ ఆసుపత్రుల్లో న్యుమోనియా కేసులు కుప్పలు తెప్పలుగా నమోదయ్యాయి. ఈ రోగులకు కరోనా పరీక్షలు చేయడంలో విఫలం కావడం మరో కారణమని ప్రముఖ ఆరోగ్య పరిశీలకులు నినో బాక్టబెల్లోట్ట చెప్పారు. జనవరి 29వ తేదీన రెండు కేసుల తర్వాత మూడో కేసు ఫిబ్రవరి 18న కొడొగ్నో పట్టణంలో వెలుగుచూసింది. రోగికి తీవ్ర జ్వరం ఉన్నా, వైద్య సిబ్బంది దానిని కరోనా వైరస్‌గా గుర్తించలేదు. ఇంటికి వెళ్లిపోవడానికి అనుమతించారు. అతను ఆసుపత్రిలో ఉన్నప్పుడు, బయటికి వచ్చాక... వైరస్‌ విపరీత వ్యాప్తికి కారణమయ్యాడు.

రెండు మరణాలతో మొదలై..

ఫిబ్రవరి 23న మొదటి రెండు మరణాలు సంభవించినందున కొడగ్నోతో సహా.. మరో 10 పట్టణాల్లో ప్రజల్ని దిగ్బంధంలో ఉంచారు. ఇటలీ ఆర్థిక రాజధాని మిలన్‌లోనూ ఆంక్షలు విధించారు. సుమారుగా 1.60 కోట్ల మందిని ఇళ్ల నుంచి బయటికి రానివ్వకుండా కట్టడిచేశారు. కనీవినీ ఎరుగని ఆంక్షల్ని అమల్లోకి తెచ్చారు. కరోనాపై దాదాపు యుద్ధాన్నే ప్రకటించారు. ఫలితంగా రోడ్లన్నీ నిర్మానుష్యమయ్యాయి. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. లోంబార్డీ పట్టణ ఆసుపత్రులకు కరోనా రోగులు పోటెత్తారు.

తోడైన తోళ్ల పరిశ్రమ?

ఖరీదైన లెదర్‌ బ్యాగులు, షూలు, ఇతర ఉత్పత్తులకు ఇటలీ ప్రసిద్ధి. గూచి, లూయీ వ్యుటాన్‌, బెలెన్‌సియాగా లాంటి పేరెన్నికగన్న బ్రాండ్లు ఇక్కడే తయారవుతాయి. మిలన్‌ పరిసరాల్లోని ఈ పరిశ్రమల్ని ఎక్కువగా చైనా వ్యాపారవేత్తలు నిర్వహిస్తున్నారు. మిలన్‌-వుహాన్‌ల మధ్య నేరుగా పలు విమాన సర్వీసులు నడుస్తాయి. తోళ్ల పరిశ్రమల్లో పనిచేయడానికి చైనాలోని వుహాన్‌ నుంచి కార్మికుల్ని తీసుకువస్తారని.. ఇలా వచ్చిన వారి నుంచి కూడా వైరస్‌ వ్యాపించి ఉండొచ్చన్న మరో వాదనా వినిపిస్తోంది. మిలన్‌ పరిసరాల్లో ఏటా జరిగే 3200 కోట్ల డాలర్ల లగ్జరీ ఉత్పత్తుల వ్యాపారం కొవిడ్‌-19 తీవ్రరూపం దాల్చినప్పటి నుంచి ఘోరంగా దెబ్బతింది.

వృద్ధ జనాభా వల్ల...

ఇటలీలోని 6.10 కోట్ల మంది జనాభాలో దాదాపు 22.6 శాతం మంది 65 ఏళ్ల పైబడిన వారున్నారు. ఐరోపా దేశాలన్నింటిలో కన్నా ఇదే ఎక్కువ. కరోనా వైరస్‌ ఎక్కువగా వృద్ధులపైనే ప్రభావం చూపుతోంది. కనుక ఇటలీలో మరణాల పెరుగుదలకూ ఇదీ ఓ కారణం కావొచ్చునని వైద్య నిపుణుడు కార్టబెల్లొట్ట చెప్పారు.

ఇదీ చదవండి:కరోనాను ఎదుర్కోవాలంటే.. ఆ 30రోజులే కీలకం.?

Last Updated : Mar 16, 2020, 6:52 AM IST

ABOUT THE AUTHOR

...view details