మానవ హక్కుల అంశంలో అమెరికాకు ఉన్న చరిత్రపై చైనా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. జాతి వివక్ష, పోలీసుల క్రూరత్వం వంటి అంశాలను ప్రస్తావిస్తూ ఐరాస మానవ హక్కుల మండలిలో ఆ దేశాన్ని ఎండగట్టింది. ఈ మేరకు జెనీవాలో బుధవారం నిర్వహించిన సాధారణ సమీక్షా సమావేశంలో చైనా ప్రతినిధి జియాంగ్ డువాన్ మాట్లాడారు. విదేశాల్లో అమెరికా సైన్యం చేపట్టిన హింసాత్మక చర్యలను ఖండించారు.
"విదేశాల్లో అమెరికా సైన్యం జోక్యం చేసుకోవడం వల్ల భారీ సంఖ్యలో పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అమాయక ప్రజలను అమెరికా దళాలు పొట్టనబెట్టుకున్నాయి. వారిని చిత్రహింసలకు గురిచేశాయి. గతంలో జరిగిన మారణహోమాలకు అమెరికా ఎప్పుడూ క్షమాపణలు చెప్పలేదు. బాధితులకు పరిహారం అందించలేదు."
-జియాంగ్ డువాన్, చైనా ప్రతినిధి