తెలంగాణ

telangana

By

Published : Jan 11, 2021, 3:13 PM IST

ETV Bharat / international

విమాన ప్రమాదాలు ఆ దేశంలోనే ఎక్కువేల?

104 ప్రమాదాలు.. 1300 మంది మృతులు... 1945 నుంచి ఇప్పటి వరకు ఇండోనేసియాలో జరిగిన విమాన ప్రమాదాల వివరాలివి. అయితే.. ఆ దేశంలోనే ఎందుకు ఇంతలా విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి? ఇందుకు ఏమైనా ప్రత్యేక కారణాలున్నాయా? ఇలాంటి అనేక ప్రశ్నలకు నిపుణులు చెబుతున్న సమాధానాలేంటో ఇప్పుడు చూద్దాం..

Why is Indonesia prone to plane crashes?
ఇండోనేసియా ప్రమాదాల చరిత్ర- కారణాలేంటి?

ఏడుగురు చిన్నారులు, ముగ్గురు శిశువులు.. మొత్తం 62 మంది. వీరందరి కలలు, ఆశలు.. ఇండోనేసియా విమాన ప్రమాద రూపంలో జలసమాధి అయ్యాయి. ఈ ఘటనతో ఆ దేశ ప్రమాదాల చరిత్రలో మరో చీకటి అధ్యాయం చేరినట్లయింది. మరి ఎందుకని అక్కడే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి? దీనిపై విశ్లేషకులు ఏమంటున్నారు?

అసలేం జరిగింది?

అదృశ్యమైన ఇండోనేసియా విమానం జావా సముద్రంలో కూలిపోయినట్లు తేలింది. సిబ్బంది సహా 62 మంది ఈ ఘటనలో జల సమాధి అయినట్లు ఆదివారం నిర్ధరణ అయింది. శనివారం జకార్తా నుంచి పోటియాన్​కు బయల్దేరి, నిమిషాల వ్యవధిలోనే రాడార్​ తెరపై నుంచి ఆచూకీ గల్లంతైన శ్రీ విజయ విమానయాన సంస్థ బోయింగ్​ ఆచూకీని నౌకాదళం కనిపెట్టగలిగింది. 75 అడుగుల లోతులో విమాన శకలాలు ఉన్నట్లు తేల్చింది. ప్రయాణికుల్లో ఎవరూ ప్రాణాలతో బయటపడ్డట్టు సమాచారం లేదు.

ఇండోనేసియాలోనే ఎందుకు ఎక్కువగా?

ఇందుకు ఆర్థిక, సామాజిక, భౌగోళిక కారణాలున్నాయి. ఇండోనేసియా విమానయాన సేవలు ఊపందుకుంటున్న కొత్తలో... 1990 చివర్లో సుహ్రతో విమానం కుప్పుకూలింది. ఆ ఘటన తర్వాత విమానయాన వ్యవస్థపై కాస్త పర్యవేక్షణ పెంచింది అక్కడి ప్రభుత్వం. కానీ, ఆ తర్వాత కూడా అనేక విమాన ప్రమాదాలు ఆ దేశంలో జరుగుతూనే ఉన్నాయి.

తక్కువ ధరలో విమాన సేవలు అందించే లయన్​ ఎయిర్​ సంస్థకు చెందిన విమానం 2018లో కూలిపోయింది. ఈ ఘటనలో సిబ్బంది 189 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ద్వీప దేశంలో ఇప్పటికీ.. సమర్థమైన రవాణా వ్యవస్థ లేదనడానికి ఈ ఘటనలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి.

ఇప్పటి వరకు ఎన్ని ప్రమాదాలు జరిగాయి?

గగనతల భద్రతా వ్యవస్థ(ఏఎస్​ఎన్​) సమాచారం ప్రకారం..1945 నుంచి ఇప్పటివరకు 104 పౌర విమానాలు ప్రమాదానికి గురయ్యాయి. 1,300 మంది ప్రాణాలు పోయాయి. ఈ కారణాలతో ఆసియాలోనే విమాన ప్రయాణానికి అత్యంత ప్రమాకరమైన స్థలమనే అపకీర్తిని మూటగట్టుకుంది ఇండోనేసియా.

వరుస ప్రమాదాలు చోటుచేసుకున్న కారణంగా.. ఈ దేశానికి చెందిన అన్ని విమానాలపై అమెరికా 2007 నుంచి 2016 వరకు నిషేధం విధించింది. ఇదే తరహాలో యూరోపియన్‌ యూనియన్‌ కూడా 2007లో నిషేధం విధించింది. ఈ ఆంక్షలు 2018 వరకు అమలులో ఉన్నాయి.

ఆ తర్వాత ఏమైంది?

ఈ ప్రమాదాల తర్వాత ఇండోనేసియా ప్రభుత్వం తమ విమానయాన రంగంపై పర్యవేక్షణను పెంచిందని ఎయిర్​లైన్​ రేటింగ్స్​.కామ్​ సంపాదకుడు జెఫ్రీ థామస్​ చెప్పారు. తరచూ తనిఖీలు, విమానాల్లో సౌకర్యాల పెంపు, సుశిక్షితులైన పైలట్లను విధుల్లో నియమించడం వంటి చర్యలను ఆ దేశం చేపట్టిందని తెలిపారు.

2016లో ​ ఇండోనేసియాను అమెరికా ఏవియేషన్​ అడ్మినిస్ట్రేషన్ ఏ1 రేటింగ్​ కేటగిరిలో చేర్చింది. అంటే.. ఆ దేశం అంతర్జాతీయ పౌరవిమానయాన భద్రతకు కట్టుబడి ఉందని ధ్రువీకరించింది.

ఈ తాజా ఘటన ఎందుకు జరిగింది?

దీని గురించి ఇప్పుడే చెప్పడం చాలా తొందరపాటు చర్య అవుతుంది. మానవ తప్పిదాలు, విమాన పరిస్థితులు, జకార్తాలోని అసాధారణ వాతావారణ పరిస్థితులు... ఇలా చాలా కారణాలే ఉంటాయని చాలామంది నిపుణులు భావిస్తున్నారు.

ఈ ఘటన జరిగినప్పుడు తమకు 30 మీటర్ల దూరంలో పిడుగుపాటు, బాంబు పేలుడు వంటిదేదో సంభవించినట్లు అనిపించిందని కొంతమంది మత్స్యకారులు చెప్పారు. ఆ సమయంలో భారీగా వర్షం పడుతుండటం వల్ల ఏదీ స్పష్టంగా కనిపించలేదని, శబ్దాలు వచ్చాక నీళ్లు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయని తెలిపారు.

శ్రీవిజయ విమానయాన సంస్థ విమానాల పరిస్థితి ఏంటి?

అయితే.. శ్రీవిజయ విమానయాన సంస్థకు చెందిన విమానాలు గతంలో చిన్న చిన్న ప్రమాదాలకు మాత్రమే గురయ్యాయి. 2008లో ఓ విమానం ల్యాండింగ్​ అవుతున్నప్పుడు హైడ్రాలిక్​ సమస్య తలెత్తి రన్​వేను దాటివెళ్లి ఓ రైతు మృతికి దారి తీసింది.

తాజాగా ప్రమాదానికి గురైన విమానం 26 ఏళ్లుగా సేవలందిస్తోందని విమానయాయన సంస్థ అధ్యక్షుడు జెఫ్పర్​సన్​ ఇర్విన్​ జౌవేనా తెలిపారు. అంతకుముందు అమెరికా విమానయాన రంగంలోనూ దీన్ని వినియోగించినట్లు చెప్పారు. ఇదే మార్గంలో ఆ విమానం అంతకుముందు కూడా ప్రయాణించినట్లు పేర్కొన్నారు. అయితే ఆ విమానం ప్రస్తుతం.. ప్రయాణానికి అనుకూలమేనా? కాదా? అనేది తేల్చడానికి దర్యాప్తు జరగుతోందని చెప్పారు.

పూర్తి సమాచారం ఎప్పుడు తెలుస్తుంది?

విమానానికి చెందిన రెండు బ్లాక్‌ బాక్సుల ఆచూకీ లభ్యమైంది. సిగ్నల్స్‌ను బట్టి వాటిని త్వరలోనే వెలికితీస్తామని అక్కడి అధికారులు అంటున్నారు. ఇందులోని డేటా రికార్డర్లు, కాక్​పిట్​ వాయిస్​ రికార్డర్లు.. ప్రమాదానికి కారణాలు తెలుసుకోవడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

అయితే ఈ ప్రక్రియ పూర్తవ్వడానికి వారాలు లేదా నెలలు కూడా పట్టవచ్చని ఇండోనేసియా ఏవియేషన్ కన్సల్టెంట్​ డైరెక్టర్​ గెర్రీ సోజెటమాన్​ తెలిపారు. అంతర్జాతీయ నిపుణులతో ఈ ప్రమాదంపై దర్యాప్తు జరిపేందుకు ఇండోనేసియా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు. నెలలోపే మధ్యంతర నివేదిక వచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ఆ నివేదికతో ప్రమాద విశ్లేషణ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:జావా సముద్రంలో ఇండోనేసియా విమాన శకలాలు గుర్తింపు

ABOUT THE AUTHOR

...view details