అమెరికాపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తీవ్ర విమర్శలు చేశారు. అఫ్గానిస్థాన్లో నెలకొన్న తీవ్ర గందరగోళ పరిస్థితుల్ని తొలగించేందుకే అగ్రరాజ్యం తమ దేశాన్ని ఉపయోగించుకుందని మండిపడ్డారు. భారత్తో మాత్రం వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకొనేందుకు అమెరికా అధిక ప్రాధాన్యం ఇచ్చిందని వాపోయారు. భారత్తో పోలిస్తే పాక్తో వాషింగ్టన్లోని అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం పూర్తి భిన్నంగా వ్యవహరించిందన్నారు. ఇస్లామాబాద్లోని తన నివాసంలో విదేశీ పాత్రికేయులతో ఆయన మాట్లాడారు. అఫ్గానిస్థాన్లో తాలిబన్లను వెల్లగొట్టేందుకు తమను పావులా వాడుకొందని అసహనం వ్యక్తం చేశారు.
అఫ్గాన్ అధ్యక్షుడిగా అష్రఫ్ ఘనీ ఉన్నంత వరకు కాబూల్ ప్రభుత్వంతో చర్చలకు తాలిబన్లు సిద్ధంగా లేనందున అఫ్గానిస్థాన్ సమస్యకు రాజకీయ పరిష్కారం కష్టమేనని ఇమ్రాన్ అభిప్రాయపడ్డారు. ఘనీ ప్రభుత్వం తోలుబొమ్మలాంటిదని తాలిబన్లు ఆరోపిస్తున్నారన్నారు. ఘనీ అధ్యక్షుడిగా ఉన్నంత వరకు చర్చలకు తాము వెళ్లేది లేదని తాలిబన్లు తేల్చి చెబుతున్నట్టు ఇమ్రాన్ తెలిపారు. అమెరికా అఫ్గాన్ నుంచి నాటో దళాలను హడావుడిగా ఉపసంహరించుకోవడం వల్ల ఆ దేశం మరింత గందరగోళ పరిస్థితుల్లో పడిందని వ్యాఖ్యానించారు.