ప్రాణాంతక కరోనా విజృంభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 40లక్షల మందికిపైగా వైరస్ బారినపడ్డారు. సుమారు 3లక్షల మంది మరణించారు. వైరస్ దెబ్బకు ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయి. లక్షలాది మంది ఉపాధి కోల్పోయి వీధినపడ్డారు. లాక్డౌన్ ఆంక్షలు ప్రజలు-ప్రభుత్వాల మధ్య వివాదాలకు దారి తీస్తున్నాయి. కొన్ని దేశాలైతే.. వైరస్ ధాటికి ఇప్పట్లో తేరుకునేట్లు కనిపించడం లేదు. మరికొన్నిదేశాలు.. వైరస్ తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఆంక్షలను సడలిస్తున్నాయి. ప్రపంచ దేశాల్లో పరిస్థితులపై సమగ్ర కథనం...
తుపాను భయంలో ఫిలిప్పీన్స్..
ఫిలిప్పీన్స్ ఓ వైపు కరోనాతో సతమవుతుంటే మరో వైపు తుపాను వణికించింది. వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల వేలాది మందిని ప్రమాదకర ప్రాంతాల నుంచి బలవంతంగా తరలిస్తున్నారు అక్కడి అధికారులు. ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడం వల్ల వైరస్ వ్యాప్తి మరింత పెరిగే అవకాశం ఉంది. వారందరూ భయాందోళనకు గురవుతున్నారు.
ఆంక్షలు సడలింపు
కొన్ని దేశాల్లో వైరస్ నియంత్రణలోకి రావడం వల్ల ఆంక్షలను సడలిస్తున్నారు. వీటిలో న్యూజిలాండ్ ఒకటి. నిరుద్యోగ రేటును అదుపులో ఉంచడానికి అప్పు చేసి మరీ ఖర్చు చేయాలని న్యూజిలాండ్ ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే మాల్స్, రిటైల్ స్టోర్లు తెరుచుకున్నాయి. అయితే వైరస్ మళ్లీ విస్తరించే ప్రమాదం ఉండటం వల్ల కొన్ని పరిమితులు విధించింది.
త్వరలోనే..
జపాన్లోని పలు ప్రాంతాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న అత్యవసర పరిస్థితిని ఎత్తివేయనున్నట్లు ప్రకటించారు ఆ దేశ ప్రధాని షింజో అబే. అయితే వ్యాధి తిరిగి పుంజుకునే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ఇటలీలో ఇలా..!
వైరస్ ప్రభావంతో భారీగా నష్టపోయిన దేశాలలో ఇటలీ ఒకటి. వ్యాపారులకు, కుటుంబాలకు సహాయం చేయడానికి భారీగా పన్ను కోతలు, ఇతర ఆర్థిక సాయం కోసం ప్యాకేజీని ప్రకటిస్తామని హామీ ఇచ్చారు ఆ దేశ ప్రధాని గిసెప్పె కాంటే.