తెలంగాణ

telangana

By

Published : Feb 16, 2020, 11:51 PM IST

Updated : Mar 1, 2020, 2:08 PM IST

ETV Bharat / international

'క్రూయిజ్​షిప్'​లో మరో ఇద్దరు భారతీయులకు కరోనా

ప్రపంచదేశాల్ని గడగడలాడిస్తోన్న కరోనా వైరస్​.. చైనాలో రోజుకు వందలసంఖ్యలో ప్రాణాలను బలిగొంటుంది. చైనా నుంచి ఇతర దేశాలకు వ్యాపిస్తోన్న ఈ మహమ్మారి.. క్రమంగా దాని పరిధిని విస్తరించుకుంటోంది. దీని కారణంగా ఇప్పటికే జపాన్​లో కొద్దిరోజులుగా క్రూయిజ్​ నౌకను నిర్బంధించగా.. తాజాగా మరో ఇద్దరు భారతీయులకు కొవిడ్​-19 పాజిటివ్​గా నిర్ధరణ అయినట్లు జపాన్​లోని భారతీయ రాయబార కార్యాలయం వెల్లడించింది.

Two more Indians coronavirus
క్రూయిజ్​షిప్​లో మరో ఇద్దరు భారతీయులకు కరోనా

జపాన్​లో తీరంలో కొద్దిరోజులుగా నిలిపివేసిన 'డైమండ్​ ప్రిన్సెస్​' బోటులో కొవిడ్​-19(కరోనా వైరస్​) బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటికే ముగ్గురు భారతీయులతో సహా మొత్తం 355 మంది ఈ మహమ్మారి బారిన పడ్డారు. తాజాగా మరో ఇద్దరు ఇండియన్స్​ ఆ జాబితాలోకి చేరారు. గత రెండు రోజుల్లో ఈ నౌకలో కొత్తగా 137 మంది వైరస్‌ బారినపడ్డారని జపాన్​లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. నౌకలో తుది పరీక్షలు ఫిబ్రవరి 17 నుంచి మొదలవుతాయని కార్యాలయ అధికారులు పేర్కొన్నారు.

జపాన్​ నిర్బంధం అనంతరం.. నౌక నుంచి భారతీయులందరినీ ముందస్తుగా వెనక్కి పంపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు జపాన్​ ప్రభుత్వం తెలిపింది.

'పరిస్థితులు చక్కదిద్దుకోగానే భారతీయులను స్వదేశానికి పంపించడానికి జపాన్ సిద్ధంగా ఉంది. అంతవరకూ ధైర్యంగా ఉండాలని ఆశిస్తున్నాము.'

- జపాన్​లోని భారత రాయబార కార్యాలయం

క్రూయిజ్​నౌకలో మొత్తం 3,711 మంది ఉండగా.. అందులో 138 మంది భారతీయులున్నారు. వారిలో 132 మంది సిబ్బంది కాగా, ఆరుగురు ప్రయాణికులు. ఇవాళ నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఇద్దరు భారతీయులకు 'కొవిడ్​-19' పాజిటివ్​ వచ్చినందున.. మొత్తంగా ఐదుగురు ఇండియన్స్​కు ఈ మహమ్మారి సోకినట్లైంది.

చైనాలో అంతకంతకూ వ్యాపిస్తోన్న కరోనా కారణంగా ఇప్పటికే 1665 మంది మృతిచెందారు. మరో 68,500 మంది ఈ మహమ్మారి బారిన పడ్డారు.

చైనాకు అన్నివిధాలుగా సాయపడతాం: భారత్

చైనాలో రోజురోజుకూ విజృంభిస్తోన్న కరోనా ధాటికి వందల మంది ప్రాణాలు కోల్పోతుండగా.. వేల మంది దీని బారినపడుతున్నారు. ఫలితంగా చైనా తీవ్ర ఆందోళనకు గురవుతోంది. అయితే.. ఆ దేశానికి అన్నివిధాలుగా సాయమందించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు భారత్​ తెలిపింది. త్వరలోనే వైద్య సామాగ్రి పంపిస్తామని భారత రాయబారి విక్రమ్​ మిశ్రీ తెలిపారు. చైనా ప్రజలకు సంఘీభావం ప్రకటించిన మిశ్రీ... రెండు దేశాల మధ్య మైత్రి గురించి కొనియాడారు.

అమెరికా ముమ్మర ఏర్పాట్లు...

నౌకలో నిర్బంధంలో ఉన్న తమ ప్రయాణికుల్ని అమెరికాకు రప్పించుకునేందుకు ఆ దేశం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. అందుకోసం యెకోహామాలో 12 బస్సులను సిద్ధం చేసింది. అనంతరం వారిని యూఎస్​కు తీసుకెళ్లేందుకు గానూ.. రెండు విమానాలను కూడా ఏర్పాటుచేసింది. ఆ తరువాత ఓడ నుంచి వచ్చిన ప్రయాణికులను అమెరికా మరో 14 రోజులు నిర్బంధంలో ఉంచనున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి:బ్రిటన్​లో 'డెన్నిస్' తుపాను బీభత్సం

Last Updated : Mar 1, 2020, 2:08 PM IST

ABOUT THE AUTHOR

...view details