తెలంగాణ

telangana

By

Published : Aug 16, 2021, 5:08 PM IST

ETV Bharat / international

Ashraf Ghani: ఆయనో కీలుబొమ్మ.. 'ఘనీ'చరిత్రేమీ లేదు!

అఫ్గానిస్థాన్​​లో సుస్థిర ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనుకున్న అష్రాఫ్‌ ఘనీ.. తాలిబన్ల ధాటికి చేతులెత్తేసి దేశం విడిచి వెళ్లిపోయారు. తొలినాళ్లలో అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన ఆయనే.. అనంతరం తన ప్రభుత్వానికి అవినీతి మరకలంటినా ఏమీ చేయలేని దుస్థితిలోకి వెళ్లారు. ఇంతకీ ఈ పరిస్థితికి దారి తీసిన పరిణామాలేంటి?

Ashraf Ghani
అష్రాఫ్‌ ఘనీ

అష్రాఫ్‌ ఘనీ.. అఫ్గాన్‌లోనే ఓ గొప్ప విద్యావేత్త, ఆర్థికంగా నష్టపోయిన దేశాలపై అధ్యయనం చేసిన ప్రపంచస్థాయి ఆర్థిక నిపుణుల్లో ఒకరు. కానీ, ఇదంతా ఒకప్పుడు. నేడు ఆయన సొంత ప్రభుత్వాన్ని కాపాడుకోలేని ఓ విఫల నాయకుడు. అహంకారంతో సొంత నేతలను దూరంపెట్టి ఒంటరిగా మిగిలిన అధినేత. తిరుగుబాటుదారుల అరాచకాలను అడ్డుకోలేక దేశం విడిచి వెళ్లిన దేశాధ్యక్షుడు. తాలిబన్లు కీలుబొమ్మగా వర్ణించే అష్రాఫ్‌.. ప్రజల్లో మనస్సుల్లోనూ ఘనంగా నిలువలేకపోయారు..!

24ఏళ్లు దేశానికి దూరంగా..

అష్రాఫ్‌ ఘనీ 1949 మే నెలలో అఫ్గానిస్థాన్‌లోని లోగర్‌ ప్రావిన్స్‌లో జన్మించారు. ఉన్నత చదువుల నిమిత్తం విదేశాలకు వెళ్లిన ఆయన.. అమెరికాలోని పలు యూనివర్శిటీల్లో విద్యనభ్యసించారు. పీహెచ్‌డీ పూర్తిచేసిన తర్వాత కాలిఫోర్నియా యూనివర్శిటీ, జాన్‌ హాప్‌కిన్స్‌ యూనివర్శిటీల్లో అధ్యాపకుడిగా పనిచేశారు. ఆ తర్వాత 1991లో ప్రపంచబ్యాంకులో చేరారు. ఐక్యరాజ్యసమితిలోనూ పనిచేశారు. అలా రెండు దశాబ్దాలకు పైగా విదేశాల్లో ఉన్న ఘనీ.. 2001 చివర్లో తిరిగి కాబుల్‌ చేరుకున్నారు. అదే సమయంలో అఫ్గాన్‌లో తాలిబన్ల ఆధిపత్యం పోయి ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడింది.

సలహాదారుగా రాజకీయ జీవితం మొదలుపెట్టి..

అఫ్గాన్‌ తిరిగి వచ్చిన ఘనీ.. అప్పటి అధ్యక్షుడు హమీద్‌ కర్జాయ్‌కి సలహాదారుగా ప్రభుత్వంలో చేరారు. ఆ ప్రభుత్వంలో కీలక నిర్మాతగా వ్యవహరించిన ఆయన.. 2002 నుంచి 2004 వరకు ఆర్థికమంత్రిగానూ వ్యవహరించారు. ఆ సమయంలో కొత్త కరెన్సీని విడుదల చేయడం సహా పన్ను వ్యవస్థను ఏర్పాటు చేశారు. దేశంలో పాతుకుపోయిన అవినీతిని తరిమికొట్టేందుకు అనేక సంస్కరణలు తీసుకొచ్చి ప్రజలను ఆకట్టుకున్నారు. సంపన్నులైన అఫ్గాన్లు తిరిగి స్వదేశానికి వచ్చేలా చేశారు. అలా అప్పట్లో ఆయన పేరు దేశమంతా మార్మోగింది.

2014లో తొలిసారి అధ్యక్ష బాధ్యతలు..

అమెరికా పౌరసత్వాన్ని వదులుకుని 2009లో అఫ్గాన్‌ అధ్యక్ష పదవికి ఘనీ పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో కేవలం 3శాతం ఓట్లు మాత్రమే సాధించి నాలుగో స్థానానికి పరిమితమయ్యారు. 2014లో మరోసారి అధ్యక్ష పదవికి పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో ఎవరికీ స్పష్టమైన ఆధిక్యం రాలేదు. దీంతో ఆయన ప్రత్యర్థి అబ్దుల్లాతో అధికారాన్ని పంచుకునేందుకు ఒప్పందం కుదిరింది. దీంతో 2014 సెప్టెంబరులో ఘనీ తొలిసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. అబ్దుల్లాను చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫ్‌ అఫ్గానిస్థాన్‌గా నియమించారు. 2019లో జరిగిన ఎన్నికల్లో మరోసారి గెలిచి రెండోసారి అధ్యక్ష పీఠం ఎక్కారు.

తాలిబన్లను రాజకీయ పార్టీగా గుర్తించి..

తాలిబన్లపై పోరాటానికి తొలుత గట్టిగానే ప్రయత్నించిన ఘనీ.. అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో పలుమార్లు వారితో శాంతి చర్చలు జరిపారు. ఒకానొక దశలో తాలిబన్లను రాజకీయ పార్టీగా గుర్తించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా చెప్పారు. దేశంలో యుద్ధాన్ని ముగించే పనిని పూర్తి చేశానని చెబుతూ తాలిబన్లతో ఒప్పందానికి సిద్ధమేనని 2019 ఎన్నికల ప్రచార సమయంలో మరోసారి పునరుద్ఘాటించారు.

అమెరికాపై అతిగా ఆధారపడి..

తాలిబన్లు సంధికి అంగీకరించక పౌర ప్రభుత్వంపై వరుసగా దాడులు చేస్తూ ప్రభుత్వాన్ని బలహీనపర్చేందుకు ప్రయత్నించారు. దీంతో ఘనీ.. అమెరికాపై అతిగా ఆధారపడక తప్పలేదు. మరోవైపు సొంత సైన్యాన్ని బలోపేతం చేసుకోవడంలోనూ ఆయన విఫలమయ్యారు. రాజకీయ జీవితం తొలినాళ్లలో ఏ అవినీతికి వ్యతిరేకంగా పోరాడి పేరు తెచ్చుకున్నారో.. అధికారంలోకి వచ్చిన తర్వాత తన ప్రభుత్వంలోనే అవినీతి తారస్థాయికి చేరుకున్నా ఏమీ చేయలేని పరిస్థితి ఎదురైంది.

ఈ నేపథ్యంలోనే తాలిబన్లతో అమెరికా జరుపుతున్న చర్చలకు ఘనీ దూరమవుతూ వచ్చారు. దీంతో ఈ వ్యవహారాన్ని అగ్రరాజ్యం తమకు తలకు మించిన భారంగా భావించి అఫ్గాన్‌ను వీడేందుకు నిర్ణయించుకుంది. అలా గతేడాది ఫిబ్రవరిలో తాలిబన్లతో శాంతి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా అమెరికా ఒత్తిడితో 5000 మంది క్రూరమైన తిరుగుబాటుదారులను ఘనీ జైళ్ల నుంచి విడుదల చేసేందుకు అంగీకరించాల్సి వచ్చింది. ఇది ప్రజల్లో ఆయనపై వ్యతిరేకతను పెంచింది. ఆ తర్వాత అమెరికా అఫ్గాన్‌ను వీడటం మొదలుపెట్టింది. అయితే ఈ ఒప్పందాన్ని ఏ మాత్రం పట్టించుకోని తాలిబన్లు ఘనీ ప్రభుత్వంపై యుద్ధానికి దిగి విజయం సాధించారు.

కోపం.. అహంకారం.. ఎక్కువే

ఘనీకి కోపం ఎక్కువ. దాంతో పాటు తోటి అఫ్గాన్ల పట్ల అహంకార భావంతో ఉండేవారని ప్రముఖ అఫ్గాన్‌ రచయిత అహ్మద్‌ రషీద్‌ ఒకానొక సమయంలో తన పుస్తకంలో రాసుకొచ్చారు. ఘనీ ఎవరితోనూ సన్నిహితంగా ఉండరని, అందర్నీ దూరం పెట్టడం వల్ల ఒంటరివారయ్యారని పేర్కొన్నారు. ఘనీ అధ్యక్షుడు కాకముందు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "నేను ఒంటరిగా ఉండాలనుకోవడం లేదు" అని చెప్పారు. అయితే అధ్యక్షుడైన తర్వాత మాత్రం ఆయన ఎప్పుడూ అధ్యక్ష భవనానికి మాత్రమే పరిమితమయ్యేవారట. కేవలం తన నమ్మకస్తులను మాత్రమే తనతో పాటు ఉంచుకున్నారు.

అఫ్గానిస్థాన్‌ను పునఃనిర్మిస్తానన్న హామీతో అధ్యక్ష పీఠం ఎక్కిన అష్రాఫ్‌.. సొంత వైఫల్యాలతో తాలిబన్లను ఎదుర్కోలేక, ప్రభుత్వం కూలిపోతుంటే చూస్తు ఉండటం తప్ప ఏమీ చేయలేని స్థితిలో దేశం నుంచి పలాయనం చిత్తగించారు!

ఇదీ చూడండి:తాలిబన్లు అంత సంపన్నులా? రూ.వేల కోట్లు ఎలా సంపాదించారు?

ABOUT THE AUTHOR

...view details