తెలంగాణ

telangana

ETV Bharat / international

ఉగ్రవాదంపై బ్రిక్స్ దేశాల ఉమ్మడి పోరు: మోదీ - ఉగ్రవాదంపై బ్రిక్స్ దేశాల ఉమ్మడి పోరు చేయాలన్న మోదీ

బ్రెజిల్​లో 'వినూత్న భవిష్యత్​ కోసం ఆర్థికవృద్ధి' ఇతివృత్తంతో జరుగుతున్న 11వ బ్రిక్స్ సదస్సులో మోదీ ప్రసంగించారు. ఉగ్రవాదనిర్మూలనకు సభ్యదేశాలు కలిసికట్టుగా కృషిచేయాలని సూచించారు. సభ్య దేశాల మధ్య వ్యాపార, వాణిజ్యాలు మరింతగా పెంపొందించుకునేందుకు అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఆరోగ్యం, నీటి సంరక్షణ, పారిశుద్ధ్యం తదితర రంగాల్లో భారత్​ చేస్తున్న కృషిని వివరించారు.

ఉగ్రవాదంపై బ్రిక్స్ దేశాల ఉమ్మడి పోరు: మోదీ

By

Published : Nov 14, 2019, 10:58 PM IST

Updated : Nov 14, 2019, 11:28 PM IST

ఉగ్రవాదంపై బ్రిక్స్ దేశాల ఉమ్మడి పోరు: మోదీ

ఉగ్రవాదం వల్ల ప్రపంచ ఆర్థికవ్యవస్థ ఓ ట్రిలియన్ డాలర్ల మేర నష్టపోయిందని 11వ బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ పేర్కొన్నారు. అభివృద్ధి, శాంతి, శ్రేయస్సులకు.. ఉగ్రవాదం అనేది అతిపెద్ద ముప్పుగా పరిణమించిందని ఆయన అన్నారు.

"కొన్ని అంచనాల ప్రకారం, ఉగ్రవాదం కారణంగా అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థికవృద్ధి 1.5 శాతం తగ్గింది. ఫలితంగా ప్రపంచ ఆర్థికవ్యవస్థకు ఒక ట్రిలియన్​ డాలర్ల మేర నష్టం వాటిల్లింది."
- నరేంద్ర మోదీ, భారత ప్రధాని

ఉగ్రవాదంతో..లక్షల ప్రాణాలు పోయాయ్​..

గత పదేళ్లలో ఉగ్రవాదం బారినపడి 2.25 లక్షల ప్రాణాలు పోయాయని... ఫలితంగా కొన్ని సమాజాలు పూర్తిగా నాశనం అయ్యాయని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు.

కలిసికట్టుగా..

ఉగ్రవాదం, తీవ్రవాదానికి ఆర్థికసాయం, మాదక ద్రవ్యాల రవాణా, వ్యవస్థీకృత నేరాలు సృష్టించిన సందేహాస్పద వాతావరణం వల్ల పరోక్షంగా అంతర్జాతీయ వ్యాపార, వాణిజ్యానికి భారీ నష్టం చేకూరిందని మోదీ అన్నారు. ఈ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి బ్రిక్స్ దేశాలు మొదటిసారిగా సెమినార్ నిర్వహించినందుకు సంతోషంగా ఉందని మోదీ వ్యాఖ్యానించారు. బ్రిక్స్​ దేశాలు అన్నీ కలిసి తీవ్రవాదాన్ని అంతమొందించేందుకు కృషిచేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

అందరిదీ ఒకటే మాట

ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిని సమర్థించేది లేదని... మతం, జాతీయత, నాగరికతతో సంబంధంలేకుండా తీవ్రవాదాన్ని నేరపూరితమైన చర్యగానే భావించాలని బ్రిక్స్ దేశాలు సంయుక్తంగా ప్రకటించాయి. ఉగ్రవాదంపై పోరాటానికి సభ్యదేశాలు అన్ని కట్టుబడి ఉన్నాయని స్పష్టం చేశాయి.

వాణిజ్యం...

బ్రిక్స్ దేశాల మధ్య పరస్పర వాణిజ్యం, పెట్టుబడులు పెంపొందించడంపై దృష్టి కేంద్రీకరించాలని మోదీ సూచించారు. ప్రపంచ వాణిజ్యంతో పోల్చితే... బ్రిక్స్ దేశాల మధ్యవాణిజ్యం కేవలం 15 శాతం మాత్రమే ఉందని ఆయన తెలిపారు.

"రాబోయే పదేళ్లలో... వాణిజ్యపరంగా బ్రిక్స్ దేశాలు పరస్పరం ఎలా సహకరించుకోవాలో చర్చించాల్సిన అవసరం ఉంది. వివిధ రంగాల్లో బ్రిక్స్ దేశాలు విజయం సాధించినప్పటికీ, ఇంకా చాలా రంగాల్లో వ్యాపార,వాణిజ్యాలు పెంపొందించుకునేందుకు అవకాశాలు గణనీయంగా ఉన్నాయి."
- మోదీ, భారత ప్రధాని

పారిశుద్ధ్యం..

పట్టణ ప్రాంతాల్లో స్థిరమైన నీటి నిర్వహణ, పారిశుద్ధ్యం ముఖ్యమైన సవాళ్లుగా నిలిచాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

"'జల నిర్వహణ' అంశంపై బ్రిక్స్ దేశాల జలవనరులశాఖ మంత్రులు తమ మొదటి సమావేశాన్ని భారత్​లో నిర్వహించాలని నేను ప్రతిపాదిస్తున్నా."

- మోదీ, భారత ప్రధాని

ఫిట్ ఇండియా ఉద్యమం

భారత్​లో ఫిట్ ఇండియా ఉద్యమం తీసుకొచ్చామని మోదీ.. బ్రిక్స్ దేశాలకు తెలిపారు. భారత్​లో ఆరోగ్యం, శారీరక దారుఢ్యంపై దృష్టి సారించామని పేర్కొన్నారు. ఇదే విషయంలో భారత్​.. సభ్యదేశాలతో కలిసి పనిచేయాలనుకుంటోందని వెల్లడించారు.

'వినూత్న భవిష్యత్​ కోసం ఆర్థికవృద్ధి'

బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, చైనా, ఇండియా, దక్షిణ ఆఫ్రికా దేశాల కూటమి. ఈ ఏడాది బ్రెజిల్​లో 'వినూత్న భవిష్యత్​ కోసం ఆర్థికవృద్ధి' ఇతివృత్తంతో 11వ బ్రిక్స్ సదస్సు జరుగుతోంది.

ఇదీ చూడండి:అసోంలో ఘనంగా బ్రహ్మపుత్ర పుష్కర మేళా

Last Updated : Nov 14, 2019, 11:28 PM IST

ABOUT THE AUTHOR

...view details