భారత్-చైనా దౌత్య, సైనిక చర్చలు కొనసాగుతున్నప్పటికీ లద్దాఖ్లో మళ్లీ వేడి రాజుకుంటోంది. ఈ ప్రాంతంలో రెండు దేశాలు తమ కార్యకలాపాలను ముమ్మరం చేస్తున్నాయి. కొత్తగా వైమానిక స్థావరాలు నిర్మించడం, ప్రస్తుతమున్నవాటిని విస్తరించడం వంటి చర్యలకు డ్రాగన్ దిగుతోంది. లద్దాఖ్తో పాటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్కు చేరువలోనూ ఇలాంటి పరిణామాలు జరగడం కలకలం సృష్టిస్తోంది. అవసరమైతే లద్దాఖ్లో సైనిక చర్య కోసం వీటిని ఉపయోగించాలన్నది చైనా వ్యూహంగా కనిపిస్తోంది. మరోవైపు లద్దాఖ్ ప్రాంతంలో అదనంగా 15వేల మంది సైనికులను భారత్ రంగంలోకి దించింది. కదనరంగంలో కీలక పాత్ర పోషించే దాడి దళాన్ని (స్ట్రైక్ కోర్) కూడా మోహరించింది.
భారత్, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, రష్యా తదితర దేశాలతో సరిహద్దులు కలిగిన షిన్జియాంగ్ ప్రావిన్స్లో వైమానిక స్థావరాలను చైనా పెంచుతోంది. ఈ ప్రాంతానికి లద్దాఖ్తోనూ సరిహద్దులు ఉన్నాయి. ఏడాదిగా ఇక్కడ భారత్, చైనాల మధ్య సైనిక ప్రతిష్టంభన, ఘర్షణ వాతావరణం నెలకొంది.
భారత సరిహద్దులకు చేరువలోని అలీ గున్సా, బురాంగ్, టాష్కోర్గామ్ విమానాశ్రయాలను 'మొదటి అంచె' విభాగంలోకి చైనా చేర్చింది. వీటిని పౌర, సైనిక అవసరాలకు ఉపయోగిస్తుంది. టాష్కోర్గామ్ విమానాశ్రయం కారకోరం పాస్కు దగ్గరగా ఉంది. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లోని గిల్గిత్కు ఉత్తరాన 10వేల అడుగుల ఎత్తులో పామిర్ పీఠభూమిపై ఇది ఉంది. మన దేశానికి అత్యంత కీలకమైన సియాచిన్ హిమానీనదానికి చేరువలో ఉండటం గమనార్హం. లద్దాఖ్లో ఉద్రిక్తతల నడుమ గత ఏడాది ఈ విమానాశ్రయ నిర్మాణం ఆరంభమైంది. చైనా-పాకిస్థాన్ ఆర్థిక నడవా(సీపెక్)కు దగ్గరగా ఉన్న నేపథ్యంలో ఇది చైనాకు అత్యంత కీలకంగా మారింది. వచ్చే ఏడాది జూన్ నుంచి ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని భావిస్తున్నారు.
అలీ గున్సా ఎయిర్పోర్టు
లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్కు చేరువలో, 14వేల అడుగుల ఎత్తులో అత్యంత వ్యూహాత్మక ప్రాంతంలో ఇది ఉంది. లద్దాఖ్లో పాంగాంగ్ సరస్సుకు 200 కిలోమీటర్ల దూరంలో ఈ స్థావరం ఉండటం గమనార్హం. కైలాస పర్వతానికి ఎదురుగా ఉన్న మానససరోవర్ సరస్సు కూడా దీని పరిధిలోకి వస్తుంది. 2017లో రెండు దేశాల మధ్య డోక్లామ్లో జరిగిన సైనిక ప్రతిష్టంభన సమయంలో దీన్ని వేగంగా విస్తరించారు. ఏడాదిగా లద్దాఖ్లో ఉద్రిక్తతల నేపథ్యంలో మరిన్ని విస్తరణ పనులు జరిగాయి.
బురాంగ్ విమానాశ్రయం
ఇది ఉత్తరాఖండ్ సరిహద్దుల్లో భారత్-టిబెట్-నేపాల్ కూడలి వద్ద కైలాస పర్వతానికి చేరువలో ఉంది. ఈ కూడలిలోని 17వేల అడుగుల ఎత్తులో ఉన్న లిపులేఖ్ పాస్ను చేరుకోవడానికి 80 కిలోమీటర్ల పొడవైన వ్యూహాత్మక రోడ్డును భారత్ నిర్మించింది. దీనివల్ల కైలాస మానససరోవర్ యాత్రికుల ప్రయాణం సులువవుతుంది. భారత్, చైనా సరిహద్దుల్లోని బలగాలకు ఆయుధాలు, సరకుల సరఫరా మెరుగుపడుతుంది. ఈ నేపథ్యంలో 13వేల అడుగుల ఎత్తులోని బురాంగ్ పట్టణంలో విమానాశ్రయ నిర్మాణానికి చైనా పూనుకుంది.