తెలంగాణ

telangana

By

Published : Aug 18, 2021, 9:54 PM IST

ETV Bharat / international

తాలిబన్ల అకృత్యాలతో భయం భయంగా అఫ్గాన్​ ప్రజలు!

అఫ్గానిస్థాన్​లో తాలిబన్లు అరాచకాలు మొదలుపెట్టారు . ప్రజలందరికీ క్షమాభిక్ష ప్రసాదించామంటూ.. ఇటీవల జపించిన శాంతి మంత్రాన్ని అప్పుడే పక్కన పెట్టేశారు. తమకు వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనలను ఉక్కుపాదంతో అణచివేస్తున్నారు తాలిబన్లు. అఫ్గాన్​ను స్వాధీనం చేసుకున్న మూడు రోజుల తర్వాత దేశవ్యాప్తంగా పరిస్థితులు ఇలా ఉన్నాయి.

Taliban violently
తాలిబన్ల అకృత్యాలు

అఫ్గానిస్థాన్​ను వశపరుచుకున్న తాలిబన్లు.. మూడు రోజుల్లోనే తమ తుపాకులకు పని చెప్పడం ప్రారంభించారు. సమ్మిళిత, బహిరంగ ఇస్లామిక్ ప్రభుత్వ ఏర్పాటు, పాలనలో మహిళలకు చోటు, తమకు వ్యతిరేకంగా పని చేసిన వారు సహా ప్రజలందరికీ క్షమాభిక్ష ప్రసాదించామంటూ పలికిన బీరాలు అంతా ఒట్టిదేనని తాలిబన్లు నిరూపిస్తున్నారు. 20 ఏళ్ల క్రితం సాగించిన అరాచక పాలనకు మళ్లీ నాందీ ప్రస్తావన అంటూ తమ పాత నైజాన్ని చాటుకుంటున్నారు.

కాల్పుల్లో ముగ్గురు మృతి..

అఫ్గానిస్తాన్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు మాజీ అధ్యక్షుడు హమీద్‌ కర్జాయ్‌, కీలక శాంతిదూత అబ్దుల్లా అబ్దుల్లాతో తాలిబన్లు చర్చలు జరపగా అదే సమయంలో ముష్కరులకు వ్యతిరేకంగా పలు ప్రాంతాల్లో తిరుగుబాట్లు చెలరేగాయి. పలు చోట్ల మహిళలు కూడా ఈ నిరసనల్లో పాల్గొన్నారు. అయితే నిండా కర్కషత్వం నింపుకొన్న తాలిబన్లు ఈ ఆందోళనలను ఉక్కుపాదంతో అణచివేస్తున్నారు. జలాలాబాద్‌లో నిరసనకారులు తాలిబన్ల జెండా తొలగించి, తమ జాతీయ జెండాను ఎగురవేయగా.. వారిపై తాలిబన్లు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు.

అలీ మజారీ విగ్రహం ధ్వంసం

నిరసనకారులను.. మోకాళ్లపై కూర్చోబెట్టి తుపాకులు ఎక్కుపెడుతున్నారు. ఇక గత పౌర ప్రభుత్వంలో తమకు వ్యతిరేకంగా పని చేసిన వారికి ఏ హానీ తలపెట్టబోమని ఇచ్చిన హామీని పూర్తిగా గాలికొదిలారు. వారి కోసం ఇల్లిల్లూ గాలిస్తున్నారు. 1990వ సంవత్సరంలో జరిగిన అఫ్గాన్‌ పౌర యుద్ధంలో తమకు వ్యతిరేకంగా పని చేసిన షియా మిలీషియా నాయకుడు అబ్దుల్‌ అలీ మజారీ విగ్రహాన్ని కూడా ధ్వంసం చేశారు. 1996లో తాలిబన్‌లు మజారీని హత్య చేశారు. బామ్‌యాన్‌లో 15 వందల ఏళ్ల నాటి బుద్ధ విగ్రహాన్ని.. తాలిబన్లు పేల్చివేశారు.

ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని..

అఫ్గన్‌ అంతటా తాలిబన్ల నిర్బంధం కొనసాగుతోంది. రాజధాని కాబూల్‌ ఆంక్షల చట్రంలోకి వెళ్లిపోయింది. కాబూల్‌లో అనేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేసిన తాలిబన్లు తుపాకులతో రోడ్లపై తిరుగుతున్నారు. ముష్కరుల భయంతో మహిళలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకే భయపడుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేయకముందే తాలిబన్లు ఇంతలా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటే ఇక వారి ఆటవిక పాలన మొదలైతే తమ భవిష్యత్తు ఏమిటోనని ప్రజలు ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని బతుకుతున్నారు.

మరోవైపు అఫ్గనిస్తాన్​లో తాలిబన్లతో పోరాడిన తొలి మహిళా గవర్నర్ గా గుర్తింపు పొందిన సలీమా మజారీని ముష్కరులు బంధించారు. ప్రస్తుతం ఆమె పరిస్ధితి ఏమిటన్నది తెలియరాలేదు.

తిరిగొచ్చిన ముల్లా అబ్దుల్‌ ఘనీ బరాదర్‌

తాలిబన్‌ రాజకీయ, సైనిక వ్యూహకర్త ముల్లా అబ్దుల్‌ ఘనీ బరాదర్‌ అఫ్గానిస్తాన్‌కి తిరిగి వచ్చారు. కొంతకాలంగా కతర్‌లో తలదాచుకుంటున్న ఆయన అఫ్గాన్‌ తాజా పరిస్థితుల నేపథ్యంలో మళ్లీ క్రియాశీలకంగా మారాడు. తాలిబన్‌ సహ వ్యవస్థాపకుడైన బరాదర్‌.. దోహా శాంతి ఒప్పందంలో కీలక పాత్ర పోషించాడు. తాలిబన్లు అఫ్గాన్‌ను హస్తగతం చేసుకోవడంలో బరాదర్‌ వ్యూహాలు ఉండొచ్చని భావిస్తున్నారు.

అటు పలు దేశాలు తమ దౌత్యాధికారులు, ఇతర సిబ్బందిని యుద్ధప్రాతిపదికన స్వదేశాలకు తరలిస్తున్నాయి. ఇవాళ ఒక్కరోజే 2వేల 200 మందికిపైగా అధికారులు, ప్రజలను తీసుకెళ్లారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details