తెలంగాణ

telangana

ఆగని తాలిబన్ల దురాక్రమణ- భారత్ ఇచ్చిన చాపర్ సీజ్

అఫ్గానిస్థాన్​లో మరో రెండు పెద్ద నగరాలు తాలిబన్ల హస్తగతమయ్యాయి. వ్యూహాత్మకంగా కీలకమైన ఘాజ్నీ నగరంతో పాటు ఆ దేశంలోనే మూడో అతిపెద్ద నగరమైన హేరత్​ను ముష్కరులు ఆక్రమించుకున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు, అఫ్గాన్​కు భారత్ గిఫ్ట్​గా అందించిన ఓ హెలికాప్టర్​ను తాలిబన్లు తమ అధీనంలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

By

Published : Aug 12, 2021, 4:29 PM IST

Published : Aug 12, 2021, 4:29 PM IST

Updated : Aug 12, 2021, 11:01 PM IST

Taliban seize Mi-35 chopper gifted by India to Afghanistan
ఆగని తాలిబన్ల దురాక్రమణ- భారత్ ఇచ్చిన చాపర్ సీజ్

అఫ్గానిస్థాన్​లో తాలిబన్ల దురాక్రమణ కొనసాగుతోంది. ఇప్పటికే అనేక ప్రాంతాలను ఆక్రమించుకున్న ముష్కరులు కాబుల్​కు సమీపంలోని ఘాజ్నీ నగరాన్ని, మూడో అతిపెద్ద నగరమైన హేరత్​ను హస్తగతం చేసుకున్నారు. ఆక్రమణ అనంతరం నగరంలో తమ జెండాలను ఎగురవేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, చిత్రాలను తాలిబన్లే స్వయంగా పోస్ట్ చేశారు. ఘాజ్నీతో కలిపి మొత్తం 11 రాష్ట్రాల రాజధానులు తాలిబన్ల చెరలోకి వెళ్లిపోయాయి.

నగరం వెలుపల ముష్కరులకు, సైన్యానికి మధ్య ఘర్షణ జరుగుతోందని స్థానిక అధికారులు తెలిపారు. ప్రస్తుతం కాబుల్ నగరానికి ఎలాంటి ముప్పు లేనప్పటికీ.. తాలిబన్ల దురాక్రమణ ఇంత వేగంగా సాగడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. దేశ రాజధానితో పాటు మిగిలిన కొన్ని నగరాలను కాపాడుకునేందుకే సర్కారు పరిమితమయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

ఘాజ్నీ నగరాన్ని తాలిబన్లకు కోల్పోవడం.. అఫ్గాన్ సేనలకు వ్యూహాత్మక ఎదురుదెబ్బే అని తెలుస్తోంది. కాబుల్- కాందహార్ హైవే మధ్య ఉన్న ఈ నగరం.. అఫ్గాన్ రాజధానిని, ఆ దేశ దక్షిణాది రాష్ట్రాలను కలుపుతుంది. ఈ నగరం ఆక్రమణతో.. అఫ్గాన్ సైనికుల రవాణా కష్టతరం కానుంది. అదే సమయంలో, దక్షిణాది నుంచి అఫ్గాన్ భూభాగాన్ని పూర్తిగా హస్తగతం చేసుకునేందుకు తాలిబన్లకు ఇదో మంచి అవకాశంగా మారనుంది.

హెలికాప్టర్ సీజ్

మరోవైపు, అఫ్గానిస్థాన్​కు భారత్ అందించిన ఎం-35 హెలికాప్టర్​ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. కుందుజ్ ఎయిర్​బేస్​లో ఈ హెలికాప్టర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి అంతర్జాలంలో చక్కర్లు కొడుతోంది. చాపర్ రోటర్లను తొలగించినట్లు తెలుస్తోంది. సీరియల్ నెంబర్​ను బట్టి ఇది భారత్ బహుమతిగా ఇచ్చిన హెలికాప్టరేనని సంబంధిత వర్గాలు తెలిపాయి.

అఫ్గాన్ గగనతల రక్షణ వ్యవస్థ బలోపేతం కోసం మొత్తం నాలుగు చాపర్​లను భారత్ గిఫ్ట్​గా అందించింది. అయితే, తాలిబన్లు ఓ చాపర్​ను సీజ్ చేసుకున్న విషయంపై స్పందించేందుకు భారత రక్షణ శాఖ అధికారులు నిరాకరించారు. అఫ్గాన్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాలని అనుకోవడం లేదని అన్నారు.

అంతర్జాతీయంగా వ్యతిరేకత

మరోవైపు, అఫ్గాన్ పరిస్థితులపై చర్చించేందుకు చైనా, పాకిస్థాన్, రష్యా ప్రతినిధులతో అమెరికా రాయబారి జాల్మే ఖలీల్జాద్ భేటీ అయ్యారు. దురాక్రమణను నివారించాలని తాలిబన్లను హెచ్చరించారు. లేదంటే అంతర్జాతీయంగా బహిష్కరించే అంశాన్ని పరిశీలిస్తామని అన్నారు. అఫ్గాన్ ప్రభుత్వం, తాలిబన్ అధికారులతోనూ జాల్మే భేటీ కానున్నట్లు సమాచారం.

అటు, జర్మనీ సైతం తాలిబన్లకు తీవ్ర హెచ్చరికలు చేసింది. అఫ్గాన్​లో తాలిబన్ల పాలన పాలన ఏర్పాటైతే.. తమ దేశం అందిస్తున్న అభివృద్ధి సాయాన్ని ఆపేస్తామని స్పష్టం చేసింది. ఒక్క సెంటు కూడా తాలిబన్ల చేతిలో పెట్టేందుకు సిద్ధంగా లేమని తేల్చి చెప్పింది. ప్రస్తుతం జర్మనీ నుంచి అఫ్గాన్​కు 504 మిలియన్ డాలర్లు సాయంగా అందుతోంది.

ఇదీ చదవండి:తాలిబన్ల అధీనంలోకి మూడు రాష్ట్రాలు, ఆర్మీ స్థావరం

Last Updated : Aug 12, 2021, 11:01 PM IST

ABOUT THE AUTHOR

...view details