తెలంగాణ

telangana

ETV Bharat / international

చైనాకు 'చిప్‌'చాప్‌గా తైవాన్ షాక్‌‌..! - Super computer

చైనాకు చెందిన ఏడు సూపర్‌ కంప్యూటింగ్‌ సంస్థలపై అమెరికా విధించిన 'ఎకనామిక్ బ్లాక్‌లిస్ట్‌' ఆంక్షలకు తాము కూడా కట్టుబడి ఉన్నామని తైవాన్‌ ప్రకటించింది. దీంతో పలు కీలక టెక్నాలజీలు అందక చైనా కంపెనీలు ఇబ్బందులు ఎదుర్కోనున్నాయి. చైనా దూకుడుగా తైవాన్‌ గగనతలంలోకి 25 విమానాలను పంపించిన రోజుల్లోనే తైవాన్‌ ఈ నిర్ణయం ప్రకటించడం విశేషం.

china
చైనా

By

Published : Apr 16, 2021, 5:17 AM IST

Updated : Apr 16, 2021, 7:03 AM IST

చైనా సూపర్‌ కంప్యూటింగ్‌ శక్తులను హరించేలా అమెరికా ఇటీవల విధించిన ఆంక్షలకు తైవాన్‌ మరింత పదును పెట్టింది. ఫలితంగా ఇప్పుడు అత్యంత కీలకమైన టెక్నాలజీ డ్రాగన్‌కు దక్కడం కష్టంగా మారనుంది. చైనా దూకుడుగా తైవాన్‌ గగనతలంలోకి 25 విమానాలను పంపించిన రోజుల్లోనే తైవాన్‌ ఈ నిర్ణయం ప్రకటించడం విశేషం. ఇప్పటికే అమెరికా నుంచి పలు కీలక టెక్నాలజీలు అందక చైనా కంపెనీలు కుదేలయ్యే పరిస్థితి నెలకొంది.

చైనాకు చెందిన ఏడు సూపర్‌ కంప్యూటింగ్‌ సంస్థలపై అమెరికా విధించిన 'ఎకనామిక్ బ్లాక్‌లిస్ట్‌' ఆంక్షలకు తాము కూడా కట్టుబడి ఉన్నామని తైవాన్‌ బుధవారం ప్రకటించింది. అంతేకాదు ఆ సంస్థలపై అమెరికా ఆంక్షలు విధించిందే తడవుగా తైవాన్‌కు చెందిన చిప్‌ తయారీ కంపెనీ స్పందించింది. అమెరికా ఆంక్షలు విధించిన సంస్థల్లో ఒకదానికి సరఫరాలను ఆపేసింది. టెక్‌ పవర్‌ హౌస్‌గా పేరున్న తైవాన్‌లోని సంస్థలు ప్రపంచ వ్యాప్తంగా సెమీకండక్టర్ల తయారీలో ముందు వరుసలో నిలుస్తాయి. ఈ సందర్భంగా తైవాన్‌ ఆర్థికశాఖ మంత్రి వాయ్‌ మెయి హువా మాట్లాడుతూ..‘‘ఇక్కడ పనిచేసే కంపెనీలు ఉత్పత్తుల విషయంలో లేదా.. ఎగుమతుల విషయంలో దేశ నిబంధనలను కచ్చితంగా పాటించాలి. అందుకే అమెరికా నిబంధనలను జాగ్రత్తగా పరిశీలించి వాటికి తగినట్లు మార్పులు చేసుకోవాలి’’ అని వెల్లడించారు. చైనా గత కొన్నాళ్లుగా తైవాన్‌ విషయంలో కవ్వింపు ధోరణితో వ్యవహరిస్తూ.. ఆయుధాలను అభివృద్ధి చేస్తుండటంతో అమెరికా ఆంక్షలను విధించింది.

ఓ పక్క చిప్‌ల కొరత ఉన్నా..!

ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్‌ కారణంగా ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్లకు డిమాండ్‌ పెరగడంతో చిప్‌(సెమీకండెక్టర్ల)ల కొరత ఏర్పడింది. అదే సమయంలో తైవాన్‌కు చెందిన అల్‌చిప్‌ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌ సంస్థ చైనాలోని తియాన్జిన్‌ పైటియమ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీస్‌కు అవసరమైన పరికరాల తయారీని మంగళవారమే నిలిపివేసింది. తియాన్జిన్‌ సంస్థ అమెరికా బ్లాక్ లిస్ట్‌లో ఉంది. అల్‌చిప్‌ సంస్థ ఆదాయంలో 39శాతం ఈ సంస్థ నుంచే వస్తున్నా.. అమెరికా ఆంక్షల నేపథ్యంలో సరఫరాను నిలిపివేశారు. ఇప్పుడు సరఫరాలను పునరుద్ధరించాలంటే అమెరికా అనుమతులు ఉండాల్సిందే. సెమీకండక్టర్ల తయారీలో ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీ అయినా టీఎస్‌ఎంసీ కూడా తియాన్జిన్‌ పైటియమ్‌ సంస్థకు సరఫరాలను ఆపేసినట్లు సమాచారం.

ఏడు సంస్థలకు కష్టమే..

బైడన్‌ కార్యవర్గం మరో ఏడు సంస్థలను ‘బ్లాక్‌లిస్ట్‌’లోకి నెట్టింది. చైనా సైన్యానికి ఆ సంస్థలు సాయం చేయడమే కారణమని పేర్కొంది. చైనా సంస్థలు అమెరికా టెక్నాలజీ పొందకుండా ఇటీవలే తొలిసారి బైడెన్‌ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. వీటిల్లో మూడు సంస్థలతోపాటు నాలుగు చైనా నేషనల్‌ కంప్యూటర్‌ సెంటర్‌కు చెందిన మూడు బ్రాంచీలు ఉన్నాయి.

ఈ ఆంక్షల దెబ్బకు ఆయా సంస్థలకు అమెరికా నుంచి, అమెరికా సాంకేతికతతో పరికరాలు తయారు చేస్తున్న సంస్థల నుంచి టెక్నాలజీ వెళ్లడానికి వీల్లేదు. ఎటువంటి సాంకేతికత అయినా వెళ్లాలంటే కఠినమైన అనుమతుల ప్రక్రియను దాటాల్సి ఉంది. చైనా సంస్థలు చైనా సైన్యం సామూహిక విధ్వంస ఆయుధాలను అభివృద్ధి చేసేందుకు అవసరమైన సూపర్‌ కంప్యూటర్లను సమకూరుస్తున్నాయని అమెరికా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ కామర్స్‌ ఆరోపించింది.

బైడెన్‌ చర్యతో ఈ కంపెనీలు మొత్తం అమెరికా టెక్నాలజీ పొందడానికి లైసెన్స్‌లు తీసుకోవాల్సి ఉంటుంది. ఇంటెల్‌ వంటి సంస్థలు తయారు చేసే చిప్‌లు కూడా ఉన్నాయి. ఈ సంస్థలకు అమెరికాలోని కంపెనీలు ఎటువంటి వస్తువులు, సర్వీస్‌లను అందజేయవు. అమెరికా బయట నిర్మించిన కర్మాగారాల నుంచి మాత్రం కొనుగోలు చేసుకొనే అవకాశం ఉంది. కానీ, తాజాగా తైవాన్‌ తీసుకొన్న నిర్ణయం చైనా ఆశలపై నీళ్లు చల్లింది.

సూపర్‌ కంప్యూటర్‌ ఏమిటీ..?

సాధారణ కంప్యూటర్‌తో పోలిస్తే సూపర్‌ కంప్యూటర్‌ కొన్ని వేల రెట్లు శక్తిమంతమైంది. ఇది క్షణకాలంలో వందల కోట్ల లెక్కలను పరిష్కరించగలదు. కొన్ని వేల ప్రాసెసర్లను అనుసంధానించి తయారు చేస్తారు. ఇది వాతవరణ పరిశోధనలకు, అణుపరీక్షల నకళ్లను కృత్రిమంగా కంప్యూటర్లలో సృష్టించడం, ఔషధాల పరిశోధనలకు వాడుతుంటారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే అత్యాధునిక ఆయుధాలు, జాతీయ భద్రతా వ్యవస్థల తయారీలో సూపర్‌ కంప్యూటర్లు అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తాయి. న్యూక్లియర్‌, హైపర్‌సానిక్‌ ఆయుధాలు కూడా చేయవచ్చు. ఇలాంటి వాటిని వాడుకొని చైనా ఆయుధాలను తయారు చేస్తోంది. దీంతో ఆయుధ శక్తిలో అమెరికా, చైనా మధ్య ఉన్న అంతరం గణనీయంగా తగ్గిపోయింది.

సొంతంగా తయారీ కూడా కష్టమే..

చిప్‌లను తయారు చేసే యంత్రాలను రూపొందించే ఏఎస్‌ఎంల్‌ సంస్థ చైనాలోని సెమీకండక్టర్‌ మ్యాన్‌ఫ్యాక్చరింగ్‌ ఇంటర్నేషనల్‌ కార్ప్‌కు ఈయూవీ యంత్రం విక్రయించకుండా ఇప్పటికే ఆపేశారు. ఈ యంత్రం విడిభాగాల సరఫరాదారుల్లో అమెరికా కంపెనీలు కూడా ఉన్నాయి. దీంతో చైనా పశ్చిమ దేశాలతో పోల్చుకుంటే చైనా అత్యంత సూక్ష్మ సెమీకండక్టర్ల విషయం బాగా వెనుకపడిపోయే పరిస్థితి తలెత్తింది.

ఇదీ చూడండి:అంబేడ్కర్​ గౌరవార్థం అమెరికా చట్టసభలో తీర్మానం

Last Updated : Apr 16, 2021, 7:03 AM IST

ABOUT THE AUTHOR

...view details