ఇండోనేసియా భద్రతా మంత్రి విరంటోపై దుండగుడు కత్తితో దాడి చేశాడు. ఆయన తన వాహనం నుంచి దిగుతుండగా రెండుసార్లు కడుపులో కత్తితో పొడిచాడు నిందితుడు. ఈ దాడిలో మరో ఇద్దరు కూడా గాయపడ్డారు. నిందితుడిని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదిగా పోలీసులు అనుమానిస్తున్నారు.
జావా ద్వీపంలోని పండేగ్లాంగ్ విశ్వవిద్యాలయంలో ఈ ఘటన జరిగింది. హుటాహుటిన దగ్గరలోని బెరక్కా ఆసుపత్రికి విరంటోను తీసుకెళ్లారు. రెండు చోట్ల బలమైన గాయాలయ్యాయని, శస్త్ర చికిత్స చేయాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు. అనంతరం ఆయనను అక్కడి నుంచి రాజధాని జకర్తాకు తరలించారు.
అక్కడే గొడవ పడుతూ..
సీసీటీవీ దృశ్యాల ఆధారంగా అక్కడే గొడవ పడుతున్న ఇద్దరిని నిందితులుగా అనుమానిస్తున్నారు. వీరిని సియారిల్ అలామ్సీ(31), ఫితురి ఆండ్రియానా (21)గా గుర్తించారు. వీరిద్దరూ ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదానికి ప్రభావితమైనట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే దీనిపై పోలీసులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.