తెలంగాణ

telangana

ప్రపంచ వ్యాప్తంగా 14 లక్షల మందిలో కరోనా నయం

By

Published : May 9, 2020, 8:46 PM IST

రష్యాను కరోనా వైరస్​ కుదిపేస్తోంది. అక్కడ రోజురోజుకూ కరోనా బాధితులు పెరిగిపోడం అధికారులకు ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 10 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. స్పెయిన్​లో దాదాపు 3 వేల మంది వైరస్​ బారిన పడ్డారు. ఇరాన్​, సౌదీ అరేబియా, పాక్​ దేశాల్లో రోజూ వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి.

Singapore sees drop in new coronavirus cases
ప్రపంచ వ్యాప్తంగా 41 లక్షలకు చేరువలో కరోనా బాధితులు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్​ ఉద్ధృతి రోజురోజుకూ పెరిగిపోతోంది. అన్ని దేశాల్లో కలిపి ఇప్పటి వరకు 40.43లక్షలకు పైగా వైరస్​ కేసులు బయటపడ్డాయి. 2.77 లక్షల మంది మరణించారు. ఇప్పటి వరకు అంతర్జాతీయంగా 14.03లక్షల మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.

కరోనా కేసుల వివరాలు

రష్యాలో 2 లక్షలకు చేరువలో కేసులు

కరోనా వైరస్ ప్రభావానికి రష్యా కుదేలవుతోంది . ఇవాళ ఒక్కరోజే 10,817 మందికి వైరస్​ సోకడం వల్ల ఆ దేశంలో కొవిడ్​-19 బాధితుల సంఖ్య లక్షా 98 వేల 676కు చేరుకుంది. మరో 104 మంది మృతి చెందగా.. ఇప్పటి వరకు మహమ్మారి బారిన పడి మరణించిన వారి సంఖ్య 1,827కు పెరిగింది. 31,916మందికి వైరస్ నయమైంది.

అమెరికాలో మరో 86 మంది బలి

కరోనా మహమ్మారి ధాటికి అమెరికా అతలాకుతలమవుతోంది. ఇవాళ మరో 3 వేల కేసులు నమోదు కాగా మొత్తం బాధితుల సంఖ్య 13 లక్షల 25 వేలు దాటినట్లు ఆ దేశ అధికారులు తెలిపారు. అక్కడ ఇప్పటి వరకు 79 వేల మంది మృతి చెందారు.

స్పెయిన్​లో 179మంది మృతి

స్పెయిన్​లో నిత్యం వందల సంఖ్యలో కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. ఇవాళ 179 మంది మృతి చెందినట్లు ఆ దేశ యంత్రాంగం ప్రకటించింది. మరో 2,666 మందికి వైరస్​ సోకినట్లు తెలిపింది. దీంతో ఆ దేశంలో మొత్తం కొవిడ్​-19 బాధితుల సంఖ్య 2,62,783కు చేరింది. వీరిలో 1,73,157 మంది ఆసుపత్రి నుంచి కోలుకున్నారు.

మెక్సికోలో రెండు వేల కేసులు

మెక్సికోలో కరోనా వైరస్​ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. ఇవాళ మరో 1,906 మందికి వైరస్​ సోకినట్లు ఆ దేశ అధికారులు వెల్లడించారు. మరో 199 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మరణించిన వారి సంఖ్య 3,160కి చేరింది. దేశంలో 31,522 మంది మహమ్మారి బాధితులు ఉండగా.. 20,314 మంది కోలుకున్నారు.

వైరస్​ ప్రభావానికి పాక్​ అతలాకుతలం​

పాకిస్థాన్‌లో రోజూ వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 1,634 కొవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి దేశవ్యాప్తంగా వైరస్​ పాజిటివ్ కేసుల సంఖ్య 27,474కు చేరినట్లు పాకిస్థాన్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇవాళ మహమ్మారి కారణంగా 24 మంది ప్రాణాలు కోల్పోవటం వల్ల మృతుల సంఖ్య 618కి పెరిగినట్లు తెలిపింది. ఇప్పటి వరకు 7,756మంది కరోనా వైరస్ బారినుంచి కోలుకున్నారు. పలు ఆర్థిక కార్యకలాపాలు, వ్యాపార సంస్థలు, పాఠశాలలు జులై 15 నుంచి పునః ప్రారంభవుతాయని అధికారులు పేర్కొన్నారు.

సౌదీ అరేబియాలో 239 మంది మృతి

సౌదీ అరేబియాలో గత 24 గంటల్లో 1,704 మంది వైరస్​ బారిన పడ్డారు. మరో 10 మృతి చెందారు. దీంతో ఆ దేశంలో మరణించిన వారి సంఖ్య 239కి చేరినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం 37,136 మంది బాధితులు ఉండగా... 10,144 మంది రికవరీ అయ్యారు.

ఇరాన్​లో 24 గంటల్లో 1,529 కేసులు

ఇరాన్​లో కొత్తగా 1,529 కేసులు నమోదు కాగా... మొత్తం కేసుల సంఖ్య లక్షా 6 వేలు దాటింది. తాజాగా మరో 48 మంది మృతి చెందగా..అక్కడ ఇప్పటి వరకు 6వేల 589 మంది ప్రాణాలు కోల్పోయారు.

సింగపూర్​లో వైరస్​ ప్రతాపం

సింగపూర్​లో వైరస్​ విజృంభిస్తూనే ఉంది. నిత్యం వందల సంఖ్యలో పాజిటివ్​ కేసులు నమోదవుతున్నాయి. ఇవాళ ఒక్కరోజే 753 మందికి వైరస్​ సోకగా.. మొత్తం బాధితుల సంఖ్య 22,460 మంది బాధితులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కేసులు పెరుగుతున్నప్పటికీ మరణాల రేటు మాత్రం తక్కువగా ఉంది. ఇప్పటి వరకు అక్కడ 20 మంది మాత్రమే మహమ్మారికి బలయ్యారు.

  • చైనాలో మరో 15 కొత్త కేసులు వెలుగు చూశాయి. కానీ వీరిలో ఎటువంటి వైరస్​ లక్షణాలు కనిపించలేదని అధికారులు వెల్లడించారు. ఇలాంటి కేసులు మొత్తం 836 గుర్తించినట్లు తెలిపారు. వీరందరిని వైద్య పరిశీలనలో ఉంచినట్లు పేర్కొన్నారు.
  • బెల్జియంలో కేసులు తగ్గటం లేదు. ఇవాళ ఒక్కరోజు 585 మందికి వైరస్ సోకిన కారణంగా ఆ దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 52,596కు చేరింది. శనివారం ఒక్కరోజే 60 మంది మృతి చెందగా.. ఇప్పటి వరకు 8,581 మంది మరణించారు.
  • నెదర్లాండ్​లో కరోనా తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో 289 మందికి వైరస్​ పాజిటివ్​గా తేలినట్లు ఆ దేశ యంత్రాంగం ప్రకటించింది. దీంతో బాధితుల సంఖ్య 42,382కు పెరిగింది. వీరిలో 5,422 మంది వైరస్​కు బలయ్యారు.
  • బ్రెజిల్​లో తాజాగా నమోదైన కేసులతో కలిపి ఇప్పటి వరకు లక్షా 46,894 మందికి వైరస్​ సోకింది. 10 వేల మంది మృత్యువాతపడ్డారు.
  • ఖతార్​లోను కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా వెయ్యి మందికి పైగా వైరస్ బారిన పడగా... మొత్తం బాధితుల సంఖ్య 21 వేలకు ఎగబాకింది. కేసులు పెరుగుతున్నప్పటికీ మరణాలు తక్కువగానే సంభివిస్తున్నాయి. ఇప్పటి వరకు కేవలం 13 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • బంగ్లాదేశ్​లో నేడు 636 మంది వైరస్ పాజిటివ్​గా నిర్ధరణ అయినట్లు ఆ దేశ యంత్రాంగం ప్రకటించింది. మొత్తం కేసుల సంఖ్య 14 వేలకు చేరువైంది. 214 మంది వైరస్​కు బలయ్యారు.

ఇదీ చూడండి:రష్యా విజయోత్సవ వేళ.. వీధులు వెలవెల

ABOUT THE AUTHOR

...view details