తెలంగాణ

telangana

ETV Bharat / international

'ఉగ్రవాదంపై పోరులో ప్రపంచ దేశాలు ఏకం కావాలి' - భారత్​

కిరిస్థాన్​లో రెండు రోజులపాటు జరిగిన షాంఘై సహకార సమితి సదస్సు వేదికగా ఉగ్రవాదంపై పోరులో ప్రపంచ దేశాలన్నీ ఏకం కావాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఎస్​సీఓ పరిధిలో శాంతి, ఆర్థిక అభివృద్ధి, సాహిత్యం, సంస్కృతి పరిరక్షణకు భారత్​ కట్టుబడి ఉందని మోదీ స్పష్టం చేశారు.

'ఉగ్రవాదంపై పోరులో ప్రపంచ దేశాలు ఏకం కావాలి'

By

Published : Jun 15, 2019, 5:39 AM IST

Updated : Jun 15, 2019, 7:57 AM IST

'ఉగ్రవాదంపై పోరులో ప్రపంచ దేశాలు ఏకం కావాలి'

కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్​ వేదికగా జరిగిన షాంఘై సహకార సమితి సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ పొరుగు దేశం పాకిస్థాన్​పై మాటల దాడికి దిగారు. ఉగ్రవాదానికి ప్రోత్సాహం, ఆర్థికసాయం అందిస్తోన్న దేశాలను బాధ్యులుగా నిలబెట్టాలని స్పష్టం చేశారు. పాక్​ ప్రధాని ఇమ్రాన్​ఖాన్​ సమక్షంలోనే ఆ దేశంపై పరోక్ష విమర్శలు చేసిన మోదీ... ఉగ్రవాద రహిత సమాజం కోసం భారత్​ కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు.

ఉగ్రవాదంపై పోరులో ఎస్​సీఓ సంకల్పం, సిద్ధాంతాలను ప్రధాని మోదీ ప్రశంసించారు. తీవ్రవాదంపై పోరుకు ప్రపంచ దేశాలన్నీ ఏకంకావాలని పిలుపునిచ్చారు. ఆర్థికాభివృద్ధి, ప్రత్యామ్నాయ ఇంధనం, ఆరోగ్య పరిరక్షణ కోసం ఎస్​సీఓ సభ్యదేశాలు పరస్పరం సహకరించుకోవాలని ఆయన అన్నారు.

ఎస్​సీఓ ప్రాంత పరిధిలో శాంతి, ఆర్థికాభివృద్ధికి భారత్ కట్టుబడి ఉందన్నారు మోదీ. సభ్యదేశాలు సాహిత్యం, సంస్కృతి, అభివృద్ధి అంశాల్లో సహకరించుకోవాలని పిలుపునిచ్చారు.

ప్రాంతీయ సమగ్రతను కాపాడాలి..

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్​ మీదుగా నిర్మిస్తోన్న చైనా-పాక్ ఆర్థిక కారిడార్ గురించి మోదీ పరోక్షంగా ప్రస్తావించారు. ప్రతిదేశం తమ సార్వభౌమత్వం, ప్రాంతీయ సమగ్రతను గౌరవించుకోవాలని సూచించారు. ఏకపక్ష విధానాలు, రక్షణవాదం ఎవరికీ మేలు చేయవని మోదీ ఘాటు విమర్శలు చేశారు.

మోదీ... హెల్త్​ సూత్రం..

ప్రపంచ వాణిజ్య సంస్థ పరిధిలో స్వేచ్ఛాయుత, సమ్మిళిత వ్యాపార విధానాల ద్వారా పనిచేసుకోవాలని మోదీ సూచించారు. భారత్​ పెద్ద ఎత్తున సౌర, పునరుత్పాదక ఇంధనాన్ని ఉత్పత్తి చేస్తోందన్న మోదీ.. తాము వాతావరణ పరిరక్షణ పట్ల నిబద్ధతతో ఉన్నట్లు స్పష్టం చేశారు. ఎస్​సీఓ దేశాల మధ్య సయోధ్య కోసం మోదీ 'హెల్త్​' అనే ఆంగ్లపదాన్ని విశదీకరిస్తూ నూతన అర్థం చెప్పారు.

"ఎస్​సీఓ ప్రాంతంలో ఆరోగ్యకరమైన పోటీని బలోపేతం చేయడమే మన లక్ష్యం కావాలి. మన మధ్య సయోధ్య కోసం ఆంగ్లపదం 'హెల్త్'​తో ఒక చక్కని మాట వస్తుంది. ఇందులో 'హెచ్'​ అంటే ఆరోగ్య పరిరక్షణలో సహకారం, 'ఈ' అంటే ఆర్థిక సహకారం, 'ఏ' అంటే ప్రత్యామ్నాయ ఇంధనం, 'ఎల్'​ అంటే సాహిత్యం, సంస్కృతి, 'టీ' అంటే ఉగ్రవాద రహిత సమాజం, హెచ్​ అంటే మానవతాపూర్వక సహకారం."-నరేంద్ర మోదీ, భారత ప్రధానమంత్రి

ఇదీ చూడండి: బిష్కెక్​లో మోదీ-ఇమ్రాన్​ సరదా సంభాషణ

Last Updated : Jun 15, 2019, 7:57 AM IST

ABOUT THE AUTHOR

...view details