తెలంగాణ

telangana

3 గంటల 3 నిమిషాల్లోనే భువి నుంచి దివికి..!

By

Published : Oct 15, 2020, 5:21 AM IST

ముగ్గురు రోదసి యాత్రికులు కేవలం 3 గంటల్లోనే నేల నుంచి నింగిలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం చేరుకున్నారు. ఇంత వేగంతో అక్కడికి ప్రయాణం చేయడం ఇదే తొలిసారి. ఇంతకుముందు ఈ యాత్రకు కనీసం ఆరు గంటల సమయం పట్టేది. రష్యా స్పేస్​ ఏజెన్సీ, నాసాకు చెందిన వ్యోమగాములు ఈ ఘనత సాధించారు.

Russian-US crew launches on fast track to the space station
3 గంటల 3 నిమిషాల్లోనే భువి నుంచి దివికి..!

ముగ్గురు వ్యోమగాముల బృందం బుధవారం రికార్డు స్థాయిలో మూడు గంటల మూడు నిమిషాలు ప్రయాణించి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. వారిని ఇంత తక్కువ సమయంలో అంతరిక్ష కేంద్రానికి చేర్చిన ఘనత రష్యన్ అంతరిక్ష సంస్థకు దక్కింది. ఈ ఆర్బిటల్ ల్యాబ్‌ను చేరుకునేందుకు చేపట్టిన అత్యంత వేగవంతమైన మానవ సహిత ప్రయాణం ఇదేనని ఆ సంస్థ వెల్లడించింది. రష్యాకు చెందిన అంతరిక్ష కార్యక్రమాలను నిర్వహించే రోస్కాస్మోస్ ఈ విషయాన్ని ధ్రువీకరించగా, 'మూడు గంటల మూడు నిమిషాలు' అని ఆ సంస్థ చీఫ్ దిమిత్రీ రోగోజిన్ ట్వీట్‌ చేశారు.

రష్యా స్పేస్​ ఏజెన్సీకి చెందిన సెర్గే రిజికోవ్​, సెర్గే కుద్​-వెర్చ్​కోవ్​, నాసాకు చెందిన కేత్​ రూబిన్స్​లు బుధవారం ఉదయం కజక్​స్థాన్​లోని బైకొనుర్​ అంతరిక్ష కేంద్రం నుంచి సోయుజ్​ ఎంఎస్​-17 రాకెట్​ ద్వారా ఐఎస్​ఎస్​కు చేరుకున్నారు. ఆరు నెలల పాటు వారు అక్కడే ఉంటారు. మామూలుగా అయితే అక్కడికి చేరుకుకోవడానికి ఆరు గంటల సమయం పడుతుంది. కాగా, ఇప్పుడు ఆ సమయాన్ని రష్యా మూడు గంటలకు కుదించి రికార్డు సృష్టించింది.

''ఐఎస్​ఎస్​లోని రష్యా విభాగం నుంచి ఆక్సిజన్​ లీకవుతోంది. దాని కారణంగా ప్రస్తుతం ఎలాంటి ప్రమాదం లేదు. మేము ఎక్కడ నుంచి ఆక్సిజన్​ లీకవుతుందో గుర్తించి, మరమ్మతులు చేపడతాం. ఇందుకు అవసరమైన సరంజామాను మాతో పాటూ తీసుకెళ్తున్నాం.'' అని రిజికోవ్​ తెలిపారు.

యాత్రకు ముందు ఈ ముగ్గురూ పలుమార్లు కొవిడ్​ పరీక్షలు చేయించుకొని, క్వారంటైన్​లో కూడా ఉన్నారు. వీరు ఐఎస్​ఎస్​కు చేరుకోవడంతో.. గత ఏప్రిల్​ నుంచి అక్కడే ఉంటున్న మరో ముగ్గురు వ్యోమగాములు వారం రోజుల్లో తిరిగి భూమికి పయనమవుతారు.

ABOUT THE AUTHOR

...view details